Suryaa.co.in

Telangana

బోనాలు వేడుకలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు

– డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, జూలై 12 : సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో రానున్న ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు వేడుకలు ఘనంగా జరిగేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు జరపాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బోనాలు ఏర్పాట్ల పై బుధవారం సీతాఫల్మండి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో అయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం 176 దేవాలయాల నిర్వాహకులకు దాదాపు రూ.80 లక్షల మేరకు బోనాలు నిధుల చెక్కులను పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి, యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, బీ ఆర్ ఎస్ నాయకులు కంది నారాయణ, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్ లతో పాటు చిలకలగూడ ఏ సీ పీ శ్రీనివాస్, జీ హెచ్ ఎం సీ ఈ ఈ ఆశా లత, ఈ ఓ మహేందర్ గౌడ్, జలమండలి డీ జీ ఎం కృష్ణ, పోలీస్ ఇన్స్పెక్టర్లు మట్టం రాజు, మధులత, శంకర్, ఆంజనేయులు, భాస్కర్, భారత్ కుమార్, తిమ్మప్ప లతో సహా రోడ్లు భవనాలు, టురిజం, రెవిన్యూ వంటి అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారిగా 2015 సంవత్సరంలో ప్రత్యేకంగా ఆలయాలకు నిధులు మంజూరు చేసే పద్దతిని ప్రవేశపెట్టా మని తెలిపారు.

ప్రతి ఏటా ప్రభుత్వం నిధులను సమకుర్చుతోందని, బోనాలు వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరపాలని అధికారులను ఆదేశించారు. పార్టీలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ సహకరించాలని కోరారు. చిలకలగుడా కట్టమైసమ్మ ఆలయంతో పాటు వందకు పైగా ఆలయాల్లో రానున్న అది సోమవారాల్లో బోనాలు వేడుకలు జరుగుతాయని, బోనాలు మహిళా భక్తులకు ఇబ్బంది కలుగ కుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు.

రోడ్లు భవనాల శాఖ ద్వారా బ్యారికేడ్లు ఏర్పాట్లు జరపాలని సూచించారు. చిలకలగుడా మున్సిపల్ గ్రౌండ్ లో కొంత భాగం పార్కింగ్ కు ఏర్పాట్లు జరపాలని, వర్షపు నీటి వల్ల ఇబ్బంది కలుగ కుండా ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు జరపాలని, ట్రాఫిక్ చిక్కులు నివారించేలా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవాలని, చిలకలగూడ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను పోలీస్ స్టేషన్ వెనుక మార్గంలో మల్లించాలని గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న ఎల్ ఈ డీ ప్రదర్శనకు ఏర్పాట్లు జరపాలని, మంచి నీటి సరఫరా లో ఇబ్బందులు నివారించి, ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరాకు ఏర్పాట్లు జరపాలని కోరారు.

డ్రైనేజ్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని, ఇంజనీరింగ్ వింగ్ అన్ని ప్యాచ్ వర్క్స్ పూర్తి చేయాలని, శానిటేషన్ వింగ్ పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరెంటు కోత లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు జాగ్రత్త పడాలని, చిలకలగుడా లో మొబైల్ జెనరేటర్ లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కట్ట మైసమ్మ దేవాలయంతో పాటు అన్ని దేవాలయాల వద్ద విధిగా పోలీసు సిబ్బందిని నియమించి బందో బస్తును పర్యవేక్షించాలని, సీ సీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అన్ని విభాగాలు సమన్వయంగా వ్యవహరించాలని, సీతాఫల్మండి లోని తమ క్యాంపు కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 2020 లో 185 దేవాలయాలకు రూ.89 లక్షలు, గత సంవత్సరం 198 దేవాలయాలకు 90 లక్షల రూపాయలు అందించామని అయన వివరించారు. పలు ప్రదేశాల్లో రోడ్లను తొవ్వి పునర్నిర్మాణం పనులు చేపట్టలేదని, వెంటనే తాత్కాలిక ఏర్పాట్లు జరిపి భక్తులకు అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను పద్మారావు గౌడ్ ఆదేశించారు.

LEAVE A RESPONSE