ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు?

-బీజేపీ, టీఆర్ఎస్ లను ప్రశ్నించిన భట్టి
-రూ. 15లక్షలు ఇస్తానని రూ.15 లు ఇచ్చావా?
-2 కోట్ల ఉదోగాలు ఇస్తానని 2వేల ఉద్యోగాలు ఇవ్వలే..
-మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దివాళ తీయించిన కేసీఆర్
-బంగారు తెలంగాణ చేస్తానని రూ. 5లక్షల కోట్ల అప్పలు చేసిన కేసీఆర్
-ఒక్కొక్కరిపై తలసరి అప్పు రూ. 2.25 లక్షలు మోపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
-మునుగోడు ఎన్నికల ప్రచారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండ ప్రజలను నయ వంచన చేసిన బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం రాత్రి మునుగోడు మండలం కొరటికల్ గ్రామాంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు.

అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తానని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసిన ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్న ఏ ఒక్కరి ఖాతాలో కనీసం 15 రూపాయలు జమ చేయలేదని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు దేవుడెరుగు దేశం మొత్తం 2వేల ఉద్యోగాలు కూడ ఇవ్వలేదన్నారు.

కానీ ఈ 8 సంవత్సరాల కాలంలో సామాన్యుడిగా ఉన్న తన మిత్రడు ఆదానీని మాత్రం ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానం పొందే విధంగా దేశ సంపదను పోగేసి దారదత్తం చేశాడని దుయ్యబట్టారు. దేశంలోని సామన్య, పేద, మధ్యతరగతి ప్రజలు బతుకలేకుండ రోజు రోజుకు వంటగ్యాసు, పెట్రోల్, డిజిల్ ధరలు పెంచి భారం మోపాడన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టించి జైలుకు పంపిస్తున్న మోడీ పాలన భేష్ అంటూ బిజెపి ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం సిగ్గుగా ఉందన్నారు. బిజెపి నాయకులు ఏ మెఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

బంగారు తెలంగాణ చేస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని ద్వజమెత్తారు. 8 సంవత్సరాల టీఆర్ పాలనలో 5లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పలు వల్ల ప్రతి ఒక్కరిపై తలసరిగా రూ.2.25లక్షల భారం మోపారని తెలిపారు. దేశ సంపదను కార్పోరేట్లకు, సంపన్నులకు దోచి పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మాత్రం అప్పులను మిగిల్చారని మండిపడ్డారు. వీరి దోపిడికి కళ్లేం వేయడానికి ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు.

లేకుంటే వారి దోపిడికి ప్రజలే లైసెన్స్ ఇచ్చిన వారవుతారని, మన పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి బిజెపి, టీఆర్ పార్టీలకు వాత పెట్టాలన్నారు. ప్రజల సంక్షేమమే ద్యేయంగా పని చేసేటువంటి కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. దేశ, రాష్ట్ర సంక్షేమం దృష్టా నిస్వార్ధ రాజకీయ సేవకుడైన స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తనయురాలు స్రవంతిని ఈ ఉప ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీలు ప్రేమ్ సాగర్ రావు, పోట్ల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే రమణరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply