భాగ్యలక్ష్మి టెంపుల్ బండి సంజయ్ జాగీరా?

– ఎవరైనా నీకు రాసిచ్చారా ?:
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్
– కరోనా నుంచి సోనియాగాంధీ కోలుకోవాలని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టక ముందు నుంచే కాంగ్రెస్ నేతలు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కరోనా బారిన పడిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్19 నుంచి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలో శుక్రవారం ఉదయం ప్రతేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సోనియమ్మ త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశామన్నిరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన, నిజం చేసిన సోనియా ఆరోగ్యం బాగుండాలని మతాలకు అతీతంగా ప్రజలు, నేతలు పూజలు చేస్తున్నామని భట్టి తెలిపారు.

బండి సంజయ్ వాఖ్యలు హాస్యాస్పదం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బండి సంజయ్ పుట్టక ముందు నుంచే కాంగ్రెస్ నేతలు భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు హిందూవులు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని.. భాగ్యలక్ష్మి అమ్మవారు అందరి దేవత అని భట్టి అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ నేతలు లబ్దిపొందాలని చూస్తున్నారని.. బీజేపీ నేతల కామెంట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. భాగ్యలక్ష్మి దేవాలయం బండి సంజయ్ కి ఏవరైనా రాసిచ్చారా? అని భట్టి ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ బండి సంజయ్ జాగీరు కాదు. మతాల మధ్య చిచ్చు పెట్టే, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బండి సంజయ్ కి బుద్ధి చెబుతారని భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆకాంక్షించారు. చార్మినార్ లో నమాజ్ వివాదానికి సంబంధించి ఎలాంటి ప్రస్తుతం తాను ఏ కామెంట్ చేయనని, తరువాత మాట్లాడతా అన్నారు. మేం పుట్టి పెరిగింది ఒక్కడే మాకు కథలు చెప్పొద్దంటూ బండి సంజయ్ కి వీహెచ్ హితవు పలికారు. ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, రాములు నాయక్, అనిల్ యాదవ్, నిరంజన్, హైదరాబాద్‌లోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply