Suryaa.co.in

Political News

ప్రజా సమస్యల పరిష్కారానికి  పాదయాత్రలు ఉపకరిస్తాయా ? 

దేశ ప్రజలలో  ఉత్సాహం నింపేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి అన్ని రంగాల ప్రజలతో మమేకమై, ప్రజల  సమస్యల అధ్యయనానికి  భరత్ జోడో యాత్ర దోహదపడిందని చెప్పవచ్చు . భరత్ జోడో యాత్ర కొద్ది రోజులల్లో ముగియనుంది. భరత్ జోడో యాత్రకు  రెండు వందలకు పైగా పౌర ప్రజా సంఘాలు ప్రత్యక్షంగా  యాత్రలో పాల్గొన్నారు,  తటస్థంగా  ఉన్న కవులు, కళాకారులు, కార్మికులు, కర్షకులు, యువకులు, లౌకిక ప్రజాతంత్రవాదులు, సేన విభాగాధిపతులు, రిటైర్డ్ అధికారులు యాత్రలో పాల్గొని  మద్దతు తెలియజేశారు.   సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం మరియు  రాజ్యాంగ విలువలు బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమై పోయాయి.  క్లిష్ట పరిస్థితుల్లో దేశ  ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది.  లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు స్వచ్చందంగా  పాల్గొంటున్నారు. 80 ఏళ్ల క్రితం  మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది.  ఐదేళ్ల తర్వాత ఈ ఉద్యమం భారతదేశానికి స్వాతంత్య్రానికి దారితీసింది. భారతదేశం అంతటా ఐక్యతా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి పాన్-ఇండియన్ మార్చ్‌ను గుర్తించడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక యాత్ర. లౌకిక ప్రజాతంత్రవాదులు  మాత్రమే భారతదేశాన్ని రక్షించగలరు. మతోన్మాద  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను గద్దె దింపడానికి, అవకాశవాద పార్టీలను ఎండగట్టడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది.

‘కలిసి నడుద్దాం, దేశాన్ని కలిపి ఉంచుదాం (మిలే కదమ్‌.. జుడే వతన్‌)’  నినాదంతో సుదీర్ఘంగా ఐదు నెలలపాటు ఈ ప్రజాఉద్యమం ముందుకు కొనసాగుతుంది.  దేశప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా తన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుందని అన్నారు రాహుల్‌గాంధీ. ఈడీ, సీబీఐ దాడులతో విపక్షాలను బెదిరిస్తే ఎవరు భయపడరు అని  అన్నారు.  క్రియాశీలకంగా, బాహాటంగా ప్రభుత్వాలు కానీ,  అంతర్జాతీయ శక్తులు కానీ చేసే కొన్ని చట్టాలు, డిమాండులు, ఆదేశాలను తలొగ్గడానికి నిరాకరిస్తూ ఉల్లంఘించడాన్ని శాసనోల్లంఘన అంటారు. శాసనోల్లంఘన అన్నది మొత్తంగా  వ్యవస్థనే నిరాకరించడం కాక తమ నిరసన వ్యక్తం చేయడానికి చట్టాన్ని సంకేతాత్మకంగా ఉల్లంగించే విధానం. అన్నిసార్లూ కాకున్నా, కొన్నిసార్లు శాసనోల్లంఘనను అహింసాత్మక ప్రతిఘటనగా వ్యవహరిస్తారు. నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం, రాజకీయ నాయకులపై ఇడి, సీబీఐ కేసులు పెట్టడం, కవులు కళాకారులు మేధావులపై దేశ ద్రోహ కేసులు బనాయించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం,  విద్య వైద్యం వ్యవసాయం నైతికత మానవ విలువలు మహిళా సాధికారత దళితులు, మైనార్టీలు  అన్ని రంగాలు పతనం చెంది నీచ స్థితికి దిగజారాయి.

ఇలాంటి సందర్భంలో దేశంలో  ఏకధృవ సామాజిక పోకడ, దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, విద్వేషాలను రూపుమాపేందుకు దేశ ప్రజలు నడుం బిగించాలి. కులమతాలకతీతంగా దేశ ప్రజానీకం పాదయాత్రలో కదంతొక్కనున్నారు. పాదయాత్రగా కొనసాగే ఈ కార్యక్రమాన్ని స్వాతంత్య్ర భారతంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమం స్థాయికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో  మార్పునకు ఇదే ఉదాహరణ. నిజమైన రాహుల్ గాంధీ ఇప్పుడే అందరికీ తెలుస్తున్నారు. కొత్త రాహుల్ గాంధీ అని అనడం లేదు. కానీ నిజమైన రాహుల్ గాంధీ ప్రజలకు పరిచయం అవుతున్నారు. ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో ఆయన మమేకమవుతున్న తీరు, ఆయన ఫిట్‌నెస్‌ “రియల్ రాహుల్ గాంధీ”కి నిదర్శనమని ప్రజలు  అభిప్రాయపడుతున్నారు. భారత్ జోడో యాత్ర ఇలా సాగుతుందని మేము ఊహించలేదు. నేను నడుస్తున్నంత సేపు దేశ ప్రజలు ఒక్కటిగా ఉన్నారన్న నమ్మకం కలుగుతున్నది. నాతో పాటు ప్రజా సంఘాలు, విభిన్న వర్గాల ప్రజలు, జాతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, మహిళలు, కవులు కళాకారులు  సేవా దళ్‌తో కలిసి నడవటం చాలా స్ఫూర్తినిస్తోంది అని భరత్ యాత్రికులు అంటున్నారు. వాళ్ల అంకిత భావానికి, కమిట్‌మెంట్‌కి సెల్యూట్ చేస్తున్నాను. మేం మానసికంగా ఇప్పటికే విజయం సాధించాం.

కాంగ్రెస్ కూడా గట్టిగా నిలబడగలదని ఈ భారత్ జోడో యాత్రతో అందరికీ తెలిసొస్తుంది. మేం వీధుల్లోకి వస్తున్నాం. నేరుగా భాజపాతోనే యుద్ధం చేస్తున్నాం. ప్రజా సమస్యలను చర్చిస్తున్నాం. మేము దేనికీ అతిగా రియాక్ట్ అవడం లేదు. ఆ పని మా ప్రత్యర్థులు చేస్తున్నారు వారు మా  మీద దుష్ప్రచారం చేయటం వలన, మాకు మంచే చేస్తోంది. ఎన్నికల విషయం పక్కన పెడితే, మానసికంగా వాళ్లతో యుద్ధం మొదలైంది” అని  రాహుల్ గాంధీ  స్పష్టం చేశారు. ఇరవై ఏళ్ళ క్రితం 2003 లో ప్రజా ప్రస్థానం పేరుతో సుధీర్గ పాదయాత్రకు నాంది పలికిన దివంగత నేత డా॥వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుండి మొదలు పెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో  ముగించారు.68 రోజులపాటు 1500 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో ఆయన అనేక హామీలను ప్రజలకు ఇవ్వడం జరిగింది.వీటిలో ముఖ్యమైనవి ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు ప్రజలలో రాజశేఖరరెడ్ది పట్ల నమ్మకాన్ని పెంచాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి చారిత్రక విజయాన్ని అందించడమే కాకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు.రాజశేఖర రెడ్డి మరణానంతరం రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత  తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా.చంద్రబాబునాయుడు 2012 సంవత్సరంలో  వస్తున్నా  మీకోసం పేరుతో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మొదలు పెట్టి విశాఖ జిల్లా అగనంపూడి వరకు సుమారు 2800 కిలోమీటర్ల మేర సాగింది. 2009 రెండో సారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ఛిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో ప్రజలకు భవిష్యత్తు మీద భరోసా ఇచ్చేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు అందుకే ఈ యాత్రకు వస్తున్నా మీకోసం అని పేరుపెట్టారు. ఆ తరువాత  2014 లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.

వై.ఎస్.జగన్నోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరు తో 2017 సంవంత్సరంలో కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలు పెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సంవత్సర కాలంలో దాదాపు 3650 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.ఈ యాత్ర ద్వారా జగన్ దాదాపు రెండు కోట్ల మందిని ప్రత్యక్షంగా కలిశారని ఒక అంచనా. అప్పటి వరకు అక్రమాస్తుల కేసులు, అవినీతి ఆరోపణలతో సతమతమౌతున్న జగన్ కు ప్రజాప్రస్థానం పాదయాత్ర తో ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. 151 సీట్లతో సీఎం అయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాద యాత్రలకు మంచి సెంటిమెంట్ ఉంది.  పాదయాత్ర చేసిన కీలక నేతలు అంతా సీఎం గా బాధ్యతలు స్వీకరించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్ వీరంతా పాదయాత్ర ద్వారా సీఎం అయిన వారే, మరి ఆ సెంటిమెంట్ లోకేష్ కు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు  వర్కౌట్ అవుతుందా ? తెలుగు దేశం పార్టీ  జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  పాద యాత్ర ప్రారంభమైంది. యువగళం  పేరుతో ఈ రోజు చిత్తూరు జిల్లాలోని టీడీపీ కంచుకోట కుప్పం నుండి ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల  పాదయాత్ర కొనసాగుతుంది. చివరికి  శ్రీకాకుళం జిల్లా  ఇచ్ఛాపురంలో  పాదయాత్ర ముగియనుంది.  అయితే   “యువగళం”  పేరుతో నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందా గతంలో పాదాయాత్ర చేసిన నాయకులను సీఎం కుర్చీ వరించింది. మరి లోకేష్ కు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా?  “యువగళం” కోసం లోకేష్ గడచిన సంవత్సర కాలంగా ఎంతో కృషిచేశారు. పాదయాత్ర కోసం లోకేష్ తన ఆహార్యాన్ని ఎంతగానో మెరుగు పరచుకున్నారు. అంతేకాదు గత కొంత కాలంగా లోకేష్ ప్రసంగాలలో వచ్చిన పరిణితి ప్రత్యర్ధులను సైతం ఆశ్ఛర్యానికి గురిచేస్తోంది. గతం లోకేష్ ప్రసంగాలలో తప్పులు దొర్లడం పరిపాటిగా ఉండేది.ఐతే ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకోవడమే కాక  అనేక విషయాలపై సమగ్రమైన అవగాహనతో సరికొత్తగా ముందుకు వస్తున్నారనేది తెదేపా వర్గాల మాట. ఐతే యువగళం యాత్రలో కేవలం  రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి పైనే అస్త్రాలు సంధిస్తారా లేక గత ఎనిమిది సంవత్సరాలుగా  ప్రత్యేక హోదా లేకుండా, బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ కు నిధులు కేటాయించకుండా, రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా కొత్త ప్రాజెక్టులు లేకుండా, విశాఖ ఉక్కుని ప్రయివేటుపరం చేసిన   కేంద్ర ప్రభుత్వాన్ని  ఏమైనా అంటారా అని ఎదురుచూస్తున్నారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌  రాజకీయాల్లో క్రీయాశీకలంగా ఉన్నానంటూ  .రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేనాని…అందుకు తగ్గట్టుగానే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నారు. .దానికి తగ్గట్టే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం కోసం ప్రత్యేక వాహానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఆ వాహనం పేరు ‘వారాహి’.   నలభై నరసింహ క్షేత్రాలు, కొన్ని  ఆంజనేయ క్షేత్రాలు, అమ్మవారి గుళ్ళు  కొండగట్టు ఆంజనేయ స్వామి గుళ్ళో  వాహన పూజ అనంతరం విజయవాడ ఇంద్రకీలాద్రి గుడిలో పూజ ముగించారు. అసలు వారాహి అనే పేరుకు అర్థం ఏంటి? ఎందుకు పవన్‌ కళ్యాణ్‌ తన వాహనానికి ఈ పేరు పెట్టారు?  ఈ పేరు ఎందుకంత పవర్ ఫుల్. పురాణాల గురించి తెలిసిన వారికి శ్రీ మహావిష్ణువు వరాహా అవతారం గురించి తెలిసే ఉంటుంది. విష్ణువు దశవాతారాల్లో వరహ అవతారం ఒకటి. హిరణాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి భూమిని సముద్రంలో దాచేస్తాడు.

అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి వేదాలను కాపాడి భూమిని ఉద్ధరిస్తాడు. ఈ వరాహస్వామి అర్థాంగి ‘వారాహి’. అమ్మవారి శక్తిరూపాల్లో వారాహి దేవి ఒకరు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యలలో ఒకరిగా పూజిస్తారు. ఆమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా పూజలందిస్తారు. వరాహస్వామి అర్థాంగి అయిన వారాహిని నేపాల్ బారాహి అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ అమ్మవారిని తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. దేవీ మాహాత్మ్యంలో ఉన్న శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మణి ఇలా వరాహ స్వామి నుంచి వారాహి ఉద్భవించింది. రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ధరించి ఉంటుంది వారాహి.  వారాహి  వాహనంతో వెళితే ఇతర మతస్థులు ఆదరిస్తారా?  గతంలో కమ్యూనిస్టులతో, బీఎస్పీతో  తిరిగినప్పుడు తన ప్రసంగాలలో  చేగువేరా ప్రస్తావన తెచ్చారు, మరి మతతత్వ పోకడలు మూర్తీభవించిన వ్యక్తులతో దోస్తీ కట్టినప్పుడు చేగువేని మర్చిపోయి ఉంటారు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE