Suryaa.co.in

Telangana

రాజకీయ కక్షతో పెట్టిన కేసు

ఈడీ కార్యాల‌యం ముందు ధ‌ర్నాలో పాల్గొన్న మంత్రి జూప‌ల్లి

హైదరాబాద్‌: ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు.ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుండి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, పొన్నం ప్ర‌భాక‌ర్, ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌న్మంత‌రావు, ఇత‌ర‌ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలను నిరసిస్తూ ధర్నా చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ… ఈ కేసు రాజకీయ కక్షతో పెట్టినదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని సంస్థలను దుర్వినియోగం చేస్తోందని అన్నారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే భ‌యందోళ‌న‌ల‌తో నేష‌న‌ల్ హెర‌ల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్ల‌ను ఈడీ త‌న చార్జిషీట్ లో చేర్చింద‌ని ద్వ‌జ‌మెత్తారు.

రాహుల్ గాంధీకి దేశ వ్యాప్తంగా వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి బీజేపీ ఓర్వ‌లేక‌పోతుంద‌ని, రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌నే ఆందోళ‌న‌తో… వారి ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో గాంధీ కుటుంబాన్ని భ‌య పెట్టాల‌నుకుంటే.. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోద‌ని, మీ బెదిరింపుల‌కు లొంగే ప్ర‌సక్తే లేద‌ని హెచ్చ‌రించారు.

LEAVE A RESPONSE