బోండా ఉమాపై కేసు నమోదు

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు పై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ipc 153a, 294 b, 504 , 505, 506 సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ 676 గా కేసు నమోదైంది.
మంగళగిరి లోని టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసీపీ మూకల దాడిని నిరసిస్తూ చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీ కార్యాలయం పై దాడి చేసి విధ్వంసం సృష్టించిన నిందితులపై మాత్రం బెయిలబుల్ కేసులు నమోదు చేసి కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్న పోలీసులు, టిడిపి నేత బోండా ఉమ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు చిటికేస్తే తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేస్తామని బోండా ఉమామహేశ్వర రావు హెచ్చరించినట్లు మూడు రోజుల క్రితం మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు తో పాటు మరికొందరు వైసీపీ నేతలు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. పోలీసులు అనుసరిస్తున్న వైఖరి, పెడుతున్న కేసులు, నమోదు చేస్తున్న సెక్షన్ల పట్ల, తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే ఉమాపై నమోదైన కేసులోని సెక్షన్ల ప్రకారం అవన్నీ ఏడేళ్ళ లోపు శిక్షలు పడేవే కాబట్టి 41ఎ నోటీసు ఇవ్వదగినదేనని న్యాయ వర్గాలు అంటున్నాయి.

Leave a Reply