వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయి

– రెండున్నరేళ్లలో జగన్ రెడ్డి రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారు
– అవినీతిని ఇనిస్టిట్యూషనలైజ్ చేశారు
– వైసీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారు
– రాష్ట్రంలోని ఆస్తులన్ని అమ్ముతున్నారు
– ప్రత్యేక హోదాను జగన్ తాకట్టు పెట్టారు
– ఉద్యోగుల తరపున మాట్లాడటమే అశోక్ బాబు చేసిన నేరమా?
– అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం
– నారా చంద్రబాబునాయుడు

నేడు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దిగిజారిపోయాయి. జగన్ రెడ్డి అవగాహన లోపంతో, స్వలాభం, స్వార్ధం కోసం రాష్ట్రంలోని రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటిని నాశనం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు అనేక పాలసీలు తీసుకువస్తే వాటిని కొనసాగించారు. కాని జగన్ రెడ్డి వచ్చిన తరువాత రాజ్యాంబద్ధ వ్యవస్థలనే కాకుండా ఎప్పటి నుంచో అభివృద్ధి చేసిన సంస్థలను విధ్వంసం చేశారు. భవిష్యత్ ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. రాష్ట్రాన్ని అంధకారం చేశారు. పోలీస్ కేసులు, దాడులు, రౌడీయిజం చలాయిస్తున్నారు. నేటి పరిస్థితులను మేథావులు, ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్పే మాటలకు మీరు సంఘీభావం చెప్పాల్సి ఉంది. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వ్యక్తిపై ప్రజా చైతన్యం రావాలి.

2 ఏళ్ల 9 నెలల పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి 66 ఏళ్లలో మొత్తం పాలకులు తీసుకువచ్చిన అప్పులు రూ. 3,14,000 కోట్ల అప్పు చేసిందని సీఏజీ చెప్పింది. నేడు దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పులయ్యాయి. 5 కోట్ల జనాభా అంటే ప్రతి ఒక్క కుటుంబంపై 5 నుంచి 6 లక్షల అప్పు ఉంది. రూ.3,14,000 కోట్ల అప్పు నుంచి 7 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు పెరిగాయో ప్రజలు ఆలోచించాలి. రాబోయే రోజుల్లో ప్రజలు ఏ పని చేసినా బలవంతపు వసూళ్లు చేసే పరిస్థితి వస్తుంది. 3 ఏళ్లుగా పన్నులు ఏ విధంగా బనాయిస్తున్నారో చూశాం. ఇప్పటికే ఖజానా ఖాళీ అయ్యింది.

రివర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే పరిమితం సమయం లోపు కట్టకపోతే మళ్లీ కట్టి మళ్లీ ఓవర్ డ్రాఫ్ట్ కువెళ్లాలి. రాష్ట్రానికి జగన్ రెడ్డినే ఆఖరి ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఆస్తులన్ని అమ్మేస్తున్నారు. కొన్ని అమ్మటానికి వీళ్లలేదని కోర్టులు అడ్డుకుంటున్నారు. ఎక్కడదొరికితే అక్కడ ఆస్తులు అమ్మేస్తున్నారు. మరోపక్క ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. కలెక్టరేట్, రెసిడెన్సియల్ స్కూళ్లు, పార్కులు తాకట్టు పెడుతున్నారు. మరో కొన్ని రోజుల పోతే రోడ్లు కూడా తాకట్టు పెడతారేమో.

ఈ అప్పులు ఎవరు కట్టాలి, ఆకాశం నుంచి వచ్చి ఎవరో కట్టారు, మనమే కట్టుకోవాలి, అప్పుల్లో కూరుకుపోతున్నాం, తప్పించుకోలేం. ఈ భారం ప్రతి ఒక్కరిపై పడుతుంది. ఒక వైపు అప్పులు, మరో వైపు విపరీతంగా పన్నులు తెచ్చారు. ఈ డబ్బులన్ని ఎక్కడికిపోతున్నాయి. పెట్రోల్ డీజిల్, గ్యాస్, లిక్కర్,

కరెంట్ చార్జీలు దేశంలో ఏపీలోనే ఎక్కువ ధరలు. ఆఖరికి చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఏదంటే ఏపీ ఒక్కటే. మరుగుదొడ్లపై పన్ను వేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్థిపై ప్రస్తుల మార్కెట్ ధర లెక్కించి దానిపై ప్రాపర్టీ ట్యాక్స్ పన్నులు వసూలు చేస్తున్నారు. అవినీతిని వ్యవస్థికృతం చేశారు. ప్రజలకు అందాల్సిన ఇసుక ఎక్కడికి పోతుంది. ఎప్పటి నుంచో ఉన్న మద్యం బ్రాండ్లు కాదని సొంత బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యాలతో చలగాటాలాడుతున్నారు.

కిరాణా కొట్టులో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే మద్యం షాపుల్లో మాత్రం ఆన్ లైన్ తీసుకోవడం లేదు. ఎందుకంటే సాయంత్రానికి డబ్బంతా పంపకాలు అవ్వాలిగా? భూగర్బ ఖనిజ సంపదంతా లూటీ చేస్తున్నారు. అడ్డుపడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. లేటరైట్, బాక్సైట్, బెరైటీస్ ఏదీ వదలని పరిస్థితి. ఎక్కడికక్కడ సెటిల్ మెంట్లు, బెదిరింపులు చేస్తున్నారు. పరిశ్రమలను బలవంతంగా లాగేసుకుంటున్నారు. జగన్ రెడ్డికి మాత్రం లక్షలాది కోట్లు కావాలి. రాష్ట్రంలో నీతి నిజాయితీ ఒక్క రూపాయి సంపాదించడానికి వీలు లేదు.

వైసీపీ నాయకులే సంపాదించుకోవాలి. రాష్ట్రంలో పేదలు నిరుపేదలవుతున్నారు. వైసీపీ నాయకులు మాత్రం కోటీశ్వరులు అవుతున్నారు. పేదవాడిపై ప్రతి నెల 5 నుంచి 10వేల భారం పడుతుంది.ఆర్ధిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? 3 ఏళ్లల్లో టీడీపీ 1,50,000 కోట్లు ఖర్చు పెడితే, మీరు ఖర్చు పెట్టింది 1,22,000 కోట్లు. కరోనా సోకిన బాధితులు క్యాంప్ కు వస్తే రూ.2,000 ఇచ్చారా? చనిపోయినా కరోనా బాధితులకు రూ.50,000 ఇవ్వమని సుప్రీంకోర్టు చెబితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు?

పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగాజారిపోయింది, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని అడుక్కుంటున్నారు దీనికి కారణం జగన్ రెడ్డి కాదా? 2014లో రూ.22,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే మెరుగుపరిచేందుకు అనునిత్యం పని చేసాం. సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం, ఉద్యోగులకు జీతాలు అందించాం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి చనిపోయేంత వరకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. పిల్లలకు బాగా చదివించారు. రూ.200 పించన్ రూ.2000 పెంచాం. అన్న క్యాంటీన్లు పెడితే ఇప్పుడు ఉన్నాయా? మీరు కష్టపడకుండా, సంపద సృష్టించకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు ఆలోచించకుండా నేడు ఢిల్లీకి వెళ్లి అడుక్కుంటే వాళ్లు ఇస్తారా?

రాష్ట్రంలోని సంపదను అస్థవ్యస్థం చేశారు. 25 ఏళ్ల కంటే ముందే హైదరాబాద్ లో నాడు వేసిన పునాది వలన నేడు ఎకరా కోటి రూపాయలు అమ్ముతున్నారు, అది వ్యక్తులకు అవ్వొచ్చు, ప్రభుత్వానిది అవ్వొచ్చు. అది సంపద అంటే. హైదరాబాద్ అభివృద్ధి దూరదృష్టితో ఆలోచించి సైబరాబాద్, హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్ తెచ్చాం. దానిని అన్ని ప్రభుత్వాలు కాపాడుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ వచ్చాయి. కాని జగన్ రెడ్డి చేతగాని తనంతో అమరావతిని నాశనం చేయడం వలన లక్ష నుంచి 2 లక్ష కోట్ల ప్రజాసంపదను కోల్పోయేలా చేశావు.

ఎక్కడికైనా వెళితే మన రాజధాని ఎక్కడో చెప్పలేని అసమర్ధత, బాధ, అవేదన కలుగుతుంది. మీకు రాజధాని లేదా అని ఎగతాళి చేస్తుంటే మా రాజధాని హైదరాబాద్ అని ఆంధ్రాలో ఉండే వాళ్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇది ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి దెబ్బ. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసిన జగన్ రెడ్డిని ప్రజలు క్షమించరు. విభజన చట్టం ఏమైంది? ఎందుకు కేంద్రాన్ని జగన్ రెడ్డి ప్రశ్నించలేకపోతున్నారు. ప్రత్యేకహోదా ఏమయ్యింది?

విభజన సమయంలో ఏం జరిగిందో అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని పోరాడాం. తెలుగు వాడి ఆత్మగౌరవం కాపాడేందుకే తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి పెంపొందించేందుకు ఎన్టీఆర్ కృషి చేశారు. ఆ స్ఫూర్తితోనే పని చేస్తున్నాం. విభజన చట్టంలో ఏపీకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్, బీజేపీలు సపోర్టు చేశారు. జగన్ రెడ్డి వలన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. మీ భవిష్యత్ గురించి యువత ఆలోచించుకోవాలి.

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏపీ పతనావస్థకు వెళ్లింది. ప్రత్యేకహోదా సంజీవని, యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కాని నేడు జగన్ రెడ్డి ఏం సాధించారు? 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు. నాడు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని యువతను ఎంత గొప్పగా రెచ్చగొట్టారు. నీ కేసులు మాఫీ అయితే చాలు, మీరు జైలుకు వెళ్లకుండా ఉంటే చాలా మిగిలిన ఏమై పోయినా పర్వాలేదా? ప్రత్యేకహోదా తాకట్టు పెట్టావు. పోలవరంలో అవినీతి జరిగిందన్నారు. ఒక్క రూపాయి అవినీతిని నిరూపించారా సవాల్ విసురుతున్నా. పోలవరాన్ని కేంద్రం సమ్మతితో ఎక్సిస్టింట్ కాంట్రాక్టర్ ను తప్పించి అదే రేట్లతో వేరొకరికి ఇస్తే ఆరోపణలు చేసిన నువ్వు నేడు పోలవరం ప్రాజెక్టును ఏం చేశావు? అవినీతి జరిగిందని చెప్పిన మీరు నేడు అదే అంచనా ధరలను సమర్ధించే పరిస్థితికి వచ్చారు, అది కూడా సాధించలేకపోతున్నారు.

నాడు ఆర్ అండ్ ఆర్ కోసం రూ.10 లక్షలు ఇస్తామని గిరిజనులను మోసం చేశారు. 2020 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు, తరువాత 2020 డిసెంబర్, తరువాత 2021 జూన్, తరువాత 2021 డిసెంబర్ నేడు 2022 ఖరీఫ్ కి పూర్తి అన్నారు. కాని నేడు ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. నాడు రాష్ట్రానికి మేము తెచ్చిన ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్ తప్పా మీరు అదనంగా ఒకటైనా తెచ్చారా? వాటిల్లో ఒక్క బ్రిక్ అయినా పెట్టగలిగారా? ఢిల్లీకి పోతే మీ కేసులు మీ సొంత విషయాలు తప్పా రాష్ట్రం కోసం ఎక్కడా మాట్లాడిన సందర్బం లేదు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజ్ చేస్తుంటే మాట్లాడలేని పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. నాడు టీడీపీ హయాంలో వాజ్ పేయ్ ప్రధాని గా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిధులు ఇప్పించి, విస్తరణ చేశాం, కాపాడుకోగలిగాం. నేడు జగన్ రెడ్డి వస్తూనే స్టీల్ ప్లాంట్ ను అమ్మే పరిస్థితికి తీసుకువచ్చారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కాబట్టి రైల్వే లైన్లు కాలేదని రైల్వే మంత్రి చెప్పారు. మన దగ్గర డబ్బులు లేవు,మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేం, ఈఏపీ తీసుకువచ్చినా మ్యాచింగ్ పెట్టరు. అభివృద్ధి ఎలా జరుగుతుందో సమాధానం చెప్పండి. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలు ఏమైనా పరిష్కారం ఎందుకు చేయలేదు.

రెండు రాష్ట్రాల్లో తెలుగు వారు ఉన్నారు. రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ముందుకు పోవాలన్నదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. మీ మోసకారి తనం అర్ధం చేసుకోకపోవడం వలన రాష్ట్రం భ్రష్టుపట్టింది.
వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఏపీ రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానంలో ఉంది. ఒకప్పుడు యూరియా లేకపోతే క్యూ లోనే ఉండి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే చెప్పులు పెట్టే పరిస్థితి నేడు మళ్లీ వచ్చింది. టీడీపీ 5 ఏళ్లల్లో ఎక్కడైనా ఒక్క ప్రాంతంలో ఎరువుల కొరత విన్నారా? నాడు మేము చేసినప్పుడు నేడు మీరెందుకు చేయలేకపోతున్నారు. పంటలన్ని నాశనం అవుతున్నాయి. తెగులు వచ్చినా పట్టించుకునే నాధుడే లేడు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖే లేదు. తెగులు వచ్చి మిరప రైతుకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపోతే మీరు పట్టించుకున్నారా? ఎక్కడన్నా మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ ఉందా? ధాన్యం కొనుగోలు చేస్తే డబ్బులు తిరిగి ఇచ్చారా?

నాడు పంటన్ని కొంటామని హామీనిచ్చి నేడు ఆఖరికి పులివెందులలో అరటిపంటకు డబ్బులు రావడం లేదు. రైతు వేసిన ఏ పంట వేసినా ఎందుకు వేశారా అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. నాడు మేము తెచ్చిన జీరో బడ్జెట్ న్యాచరల్ ఫామింగ్ మాత్రమే మిగిలింది. మైక్రో ఇరిగేషన్ లేదు, వ్యవసాయ యాంత్రీకరణ లేదు, సబ్సిడీలన్ని ఎత్తేశారు. రూ.12,500 రైతు భరోసా ఇస్తామని నేడు రూ. 7,500 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రైతులు తిరిగి కోలుకోలేని పరిస్థితికి వెళ్లారు. రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నాం. ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.

ఫ్యాన్ వచ్చింది పవర్ కష్టాలను తెచ్చింది. 1996-97లో దేశంలో పవర్ సెక్టార్ రిఫామ్స్ తెచ్చి జవాబు దారి తనానికి శ్రీకారం చుట్టాం. 2004కి పవర్ సర్ ప్లస్ కు తీసుకువచ్చాం. రెగ్యులేటరీ కమీషన్, డిస్ట్రిబ్యూటరీ విధానాలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపాం. 22.5 బిలియన్ యూనిట్ల కొరతను మూడు నెలల్లో అధిగమించి కరెంట్ పుష్కలంగా ఇవ్వగలిగాం. సోలార్, విండ్ లను తీసుకువచ్చాం. రాబోయే రోజుల్లో కరెంట్ చార్జీలు పెంచమని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.

నేడు మేము అధికారంలో ఉంటే కరెంట్ చార్జీలు పెరిగి ఉండేవి కాదు. 32 నెలల జగన్ రెడ్డి పాలనలో 6 సార్లు కరెంట్ పెంచి, రూ.11,611 కోట్లు కరెంట్ చార్జీలు పెంచారు. రూ.26,861 కోట్ల అప్పు తెచ్చారు. మొత్తం రూ.37,872 కోట్ల అయ్యింది. ఏం చేశారు ఈ డబ్బులు? ట్రాన్స్ కో, డిస్ట్రిబ్యూషన్, జన్ కో ను డైవర్షన్ చేశారు.జగన్ రెడ్డి పోతే రాష్ట్రానికి బాదుడే బాదుడు. 9,529 మె.గా. వాట్ల ఉత్పత్తి ఉంటే 19,080 మెగా వాట్లు పెంచి సోలార్ అయితే రూ.2 నుంచి రూ.3 వచ్చే పరిస్థితి ఉంటే మీరు రూ.15 ఓపెన్ మార్కెట్ లో కొంటారా?

చలికాలంలో తక్కువ కరెంట్ వాడతాం అలాంటిది ఎన్టీపీసీకి రూ.30 కోట్లు డబ్బులు చెల్లించకపోవడంతో వాళ్లు కరెంట్ కట్ చేసి రాష్ట్రాన్ని చీకటి చేయడం మీ అసమర్ధత కాదా? హైవోల్టేజ్, లోవోల్టేజ్ ఉండకూడదని కమాండ్ కంట్రోలో పెట్టి రెగ్యులర్ మానిటరింగ్ చేస్తే నేడు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి.

మేము ఉద్యోగులను రెచ్చగొడుతామని అంటున్నారు. మీ కంటే మెరుగైన జీతాలు, వసతులు కల్పించాం. రూ.22,000 కోట్ల రెవిన్యూ లోటు ఉన్నప్పుడు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం. విమరణ వయస్సు 58 నుంచి 60కు పెంచాం. 30 శాతం హెచ్ ఆర్ ఏ ఇచ్చాం. తక్కువ జీతాలు వచ్చే వారందరికి పెంచాం. మీరు ఉద్యోగస్థులకు ఏమీ చేయకుండా, ఉద్యోగ నాయకులను ఏ విధంగా మభ్య పెట్టారో, ఉద్యోగస్థులను ఏ విధంగా మోసం చేశారో ఇదొక కేస్ స్టడీ. టీడీపీ పాలన ఒక్కొక్క బెనిఫిట్ సాధించుకుంటూ అనేక సార్లు ఉద్యోగస్థుల మన్నలను పొందారు.

విభజన తరువాత తెలంగాణ వాళ్లకు 43 శాతం ఉంది కాబట్టి మనకు అంతే కావాలని అశోక్ బాబు నాయకత్వంలో అందరూ అడిగితే వెంటనే యదావిధంగా ఇచ్చాం. లోటు బడ్జెట్ లో ఉన్నా ఉద్యోగస్థుల సంక్షేమం కోసం తెలంగాణకు తగ్గకుండా అన్నింటిని ఇచ్చాం. సమైక్యాంధ్ర ప్రదేశ్ లో టీచర్లకు కౌన్సింగ్ పెట్టి ఏ ఒక్క టీచర్ రాజకీయ నాయకుడికి వెళ్లకుండా పాలన చేశాం. కాని మీరు టీచర్లను బ్రాందీ షాపుల ముందు ఉంచారు. గురువులను రోడ్ల మీదకు తెచ్చారు. వాళ్లపై రౌడీ షీట్లు పెడుతున్నారు. మీరు నియంతలా, టెర్రరిస్టులా? ఉద్యోగస్థులకు మేము న్యాయం చేసినా మీరు ప్రశ్నించారు. నేడు మీరు న్యాయం చేయలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తాం.

ఇంటీరీయం రిలీఫ్ ఫిట్ మెంట్ లో 27 శాతం ఒప్పుకొని నేడు 23 శాతమే ఇస్తామంటున్నారు. దానిని రికవరీ చేస్తామంటున్నారు. అంటే ఉద్యోగస్థులు క్యాలిక్ లేట్ చేసుకోలేరా? ఇన్ని సంవత్సరాల జీతాలపైన ఆధారపడే వ్యక్తి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గుర్తించలేరనుకున్నారా?

తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన జీతాలను తాను పెంచానని చెప్పుకునే దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రిది. అంగన్ వాడీలకు, ఆయాలకు జీతాలు పెంచింది నేను. జీవో నెం.8, 18 చూడాలి. పేపర్లో కూడా సిగ్గు లేకుండా వేసుకుంటారు. నువ్వు ఇచ్చింది ముష్టి వెయ్యి రూపాయలు. రూ.7వేల నుంచి 11,500కు పెంచానని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెబుతున్నారు. టీడీపీ హయాంలోనే రూ.10,500కు జీతాలు పెంచడం జరిగింది. నోరు విప్పితే అబద్ధాలు, అసత్యాలు. ఆశా వర్కర్లకు కేవలం రూ.1400 మాత్రమే జగన్ రెడ్డి పెంచారు.

టీడీపీ హయాంలోనే వారికి జీతాలు పెంచాం. ధైర్యం ఉంటే చర్చకు రావాలి. ఉద్యోగులకు ఎవరేం చేశారో చర్చకు రావాలి. ఉద్యోగులను అన్ని విధాల టీడీపీ ఆదుకుంది. తప్పుడు సమాచారం, వార్తలతో పబ్బం గడుపుకుంటున్నారు.అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏం తప్పు చేశాడు, ప్రశ్నించినందుకు, ఉద్యోగుల తరపున మాట్లాడటమే ఆయన చేసిన తప్పా? ఆయన విద్యార్హత ముసిగిపోయిన అంశం. గత ప్రభుత్వాల హయాంలోనే క్లియరెన్స్ ఇచ్చారు. జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే పిటిషన్ పెట్టించారు. తప్పుడు కేసులు పెట్టి బాధపెట్టాలనే కుట్ర ఉంది.

క్విడ్ ప్రో కోలో జగన్ రెడ్డి ఎక్స్ పర్ట్. ఫిర్యాదు చేసిన మెహర్ కుమార్ సోదరుడి భార్యకు బ్రాహ్మణ కార్పొరేషన్ లో మెంబర్ గా వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కూడా తన విద్యార్హత ఇంటర్మీడియట్ అని అశోక్ బాబు చెప్పారు. టెక్నికల్ మిస్టేక్ ను పట్టుకుని వ్యక్తిని హింసించే మిమ్మల్ని ఏం అనాలి. జనవరి 24, 2022న ఉదయం ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. దానిని అశోక్ బాబు సమర్థించారు. ఆ సాయంత్రమే కేసు పెడతారు, నిన్న అరెస్ట్ చేశారు. దీన్ని ఏమనాలి? దీనికి సమాధానం చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా. చేయని తప్పుకు శిక్ష వేస్తున్నారు. జగన్ రెడ్డి చేసిన నేరాలు, ఘోరాలకు, వైసీపీ వాళ్లు చేసిన వాటికి దేశంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని హెరాస్ చేస్తున్నారు.

అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా? పెద్ద సీబీసీఐడి? తప్పుడు కేసులన్నింటిపై మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ వేసి విచారిస్తాం. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టం. జగన్ రెడ్డిని నమ్మిన వాళ్లు జైలుకు వెళ్లారు. రేపు అన్నీ సమీక్షకు వస్తాయి. తప్పు చేయని వాళ్లకు శిక్ష వేస్తూ.. తప్పు చేసే వాళ్లను తప్పిస్తున్నారు. దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి.

నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ కేలండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అడిగితే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. పరిశ్రమలు తరలివెళ్లాయి. టీడీపీ హయాంలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని మీరే చెప్పారు. యువత, విద్యార్థులు నిన్న నిరసన తెలియజేస్తే.. తప్పా? వారి ఉద్యోగాలు ఏమయ్యాయని అడుగుతున్నారు. జగన్ రెడ్డి సమాధాన చెప్పాలి. చేతగాకపోతే క్షమాపణ చెప్పాలి.

నేను ఫస్ట్ టైం సినిమాటోగ్రఫీ మంత్రిని. తర్వాత సీఎం అయ్యాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సమస్యను సృష్టించి, పరిష్కరిస్తామనే నెపంతో ఆడుకోవడం ఇప్పుడు చూస్తున్నా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి పని వారు చేసుకుంటారు. అలాంటి ఇండస్ట్రీలో కూడా జోక్యం చేసుకుని కక్షతో చేస్తున్నారు. నిన్న జరిగింది చూస్తే నాకే అర్థం కాలేదు. ఆశ్చర్యపోయా. ఇలా కూడా చేయవచ్చా?

కోర్టులపైనా వైసీపీ పేటిఎం బ్యాచ్ దుష్ప్రచారం చేశారు. ఇదేవిధంగా గతంలో టీడీపీపై దుష్ప్రచారం చేశారు. కొంతమంది నమ్మారు. ఎర్రజెండా, పచ్చజెండా అంటూ మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు ఏ ప్రభుత్వంలోనైనా పోరాడతారు. నీ కోసం పోరాడితే ఆనందమా? మేం భజన చేయడానికి ఇక్కడ లేం. ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహిస్తాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం. ప్రజలు రాష్ట్రాన్ని కాపాడాలని అడుగుతున్నారు. రాష్ట్రానికి భవిష్యత్ లేదని ఆందోళన చెందుతున్నారు. జగన్ రెడ్డి అందరినీ భయపెడుతున్నారు. మీరు ఎన్ని చేసినా టీడీపీ పోరాడుతుంది. ప్రజలు, మేధావులు అందరూ ఆలోచించాలి.

గతంలో జీవన ప్రమాణాలు, ఇప్పటి ప్రమాణాలను బేరీజు వేసుకోవాలి. కేంద్రంలో 4 బడ్జెట్ లు అయిపోయాయి. బీద అరుపులతో రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీని చరిత్ర క్షమించదు. రాష్ట్రం మనందరిది. ఇది శాశ్వతం. ప్రజల్లో చర్చ జరగాలి. చైతన్యం రావాలి. అందరూ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి.

Leave a Reply