Suryaa.co.in

Telangana

మాటలకే పరిమితమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

-అవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి
-బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతి పరులను జైలులో వేస్తామని మాటలకే పరిమితమయ్యాడు తప్ప చర్యలు లేవని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి లీకు వీరుడు కాదు.. గ్రీకు వీరుడు అని నిరూపించుకోవాలనుకుంటే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఈ విషయంలో పాత్రదారులతో పాటు సూత్రదారులను కూడా బయటపెట్టాలన్నారు. కేసీఆర్‌ కుమార్తె కవిత లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయ్యారని, కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిరదన్నారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అయినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం అవినీతి పరులపై చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ధరణి అవకతవకలపై చర్యలు లేవని, డ్రగ్స్‌ కేసులు పత్తా లేకుండా పోయాయని ఆరోపించారు. నియంతృత్వంగా వ్యవహరించేవారు నీడను కూడా నమ్మరని.. అలాగే కేసీఆర్‌ ఎవరినీ నమ్మలేదని.. అందుకే రాజకీయ, మీడియా ప్రముఖులు, పలువురు బ్యూరోక్రాట్ల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని తెలిపారు. వ్యాపారులను బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేశారన్నారు. గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్ధుకుంటున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు.

కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఫామ్‌ హౌస్‌ నుంచి కదలలేదని, సచివాలయానికి రాలేదని, స్కీంలను స్కామ్‌లుగా మార్చేశారని, కమీషన్లు దండుకున్నారని విమర్శించారు. ప్రశ్నించే వారిని బెదిరించారని, నియంతృత్వ పోకడలు సాగించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కొంత మంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిందన్నారు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా వెనకేసుకొస్తోందంటూ లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఒక్కరిద్దరి ఫోన్లు ట్యాప్‌ అయ్యి ఉండొచ్చని కేటీఆర్‌ మాట్లాడుతున్నారని, పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే గుడ్డి గాడిద పల్లు తోమారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కేవలం ఎన్నికల వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటివి తెరమీదకి తెస్తున్నారనే అనుమానం కలుగుతుందని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE