వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశానికి శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో వైయస్ జగన్ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమయాత్తం చేసేలా పార్టీ అధినేత దిశా నిర్దేశం చేస్తున్నారు.
రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ స్థానాల్లోనూ వైయస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. గత నెల 18న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు వర్క్షాప్ నిర్వహించారు. లక్షలాది కుటుంబాలు వైయస్సార్సీపీపై ఆధారపడ్డాయని, ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలని సీఎం వైయస్ జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 4 నుంచి నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశమై దిశానిర్దేశం చేస్తానని ప్రకటించారు. నెలకు 10 నుంచి 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తొలి సమావేశం కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో జరుగుతోంది. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, అందిస్తున్న సుపరిపాలనపై సీఎం వైయస్ జగన్ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. మూడేళ్లుగా చేసిన మంచిని, రాబోయే కాలంలో చేయబోయే మంచిని ఇంటింటికీ వెళ్లి.. వివరించాలని, జనంతో మమేకమవ్వాలని సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.