సర్కారు ఇచ్చిన వాహనాల్లో తమ పిల్లలను ఖరీదైన స్కూళ్లకు పంపే చాలామంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఓసారి ఈ వాస్తవ దృశ్యాన్ని చూడాల్సిందే. సర్కారీ స్కూల్లో చదువుతున్న జిల్లా కలెక్టరు , అక్కడ అంగన్వాడీ పెట్టే భోజనం తింటున్నారు. ఖరీదైన బంగ్లాలు, ప్రైవేటు ఆస్తులు, ఫ్లాట్లు, ప్లాట్లూ, గోవాలో రెస్టు, హైదరాబాద్ అశోకా హోటల్లో ప్రైవేటు ముచ్చట్లు, ఫాంహౌసులలో ఎంజాయ్ చేసే చాలామంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులెవరనయినా తమ పిల్లలను ఈవిధంగా చేర్పించే ధైర్యం చేయగలరా? పబ్బులు, క్లబ్బుల్లో సేదదీరే అధికారుల పుత్రరత్నాలు కూడా ఓసారి ఈ అద్భుతం చూడాల్సిందే.
ముందు వరుసలో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు కొమురం భీం జిల్లా కలెక్టరు రాహుల్రాజ్ కుమార్తెలు.. ఆర్థిక పరిస్థితి కొంత బాగుంటేనే.. పిల్లలను ప్లేస్కూల్స్కు పంపుతున్న ఈ రోజుల్లో కలెక్టరు తన ఇద్దరు కుమార్తెలు నిర్వికరాజ్, రిత్వికరాజ్లను అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు చిన్నారులు జన్కాపూర్-1 కేంద్రంలోని సహచరులతో ఆడుతూపాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. కలెక్టరు పిల్లలు మూడు నెలలుగా ఇక్కడికి వస్తున్నారని, ఇక్కడే భోజనం చేస్తున్నారని అంగన్వాడీ టీచర్ అరుణ తెలిపారు.