250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డైరీ నిర్మాణం

-విజయ డైరీ టర్నోవర్ 700 కోట్ల రూపాయలు
-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సోమా భరత్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం కు ముందు నష్టాలలో ఉన్న విజయ డైరీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేడు 700 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

విజయ డైరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాదరణ ఉందని, కానీ నాడు ప్రజలకు అందుబాటులో కి తీసుకు రాలేదని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నూతనంగా ఔట్ లెట్ లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంకా మరిన్ని ఔట్ లెట్ లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విజయ పేరుతో డైరీ లో నూతనంగా అనేక ఉత్పత్తులను మార్కెట్ లోకి తేవడం జరిగిందని అన్నారు.

పాడి రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మంత్రి వివరించారు. విజయ డైరీ అభివృద్ధి చర్యలలో భాగంగా 250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డైరీ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.

Leave a Reply