డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

– స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్‌పై, చీఫ్ సెక్రటరీ ఎలా చర్యలు తీసుకుంటారు?
– తెలంగాణ ఐఏఎస్ రజత్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పిటిషన్‌
– కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు

తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి. రజత్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ డివోపీటీకి తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రజత్ కుమార్‌పై వచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని డీవోపీటీ కోరింది.

డివోపీటీనే నేరుగా చర్యలు తీసుకోకుండా, తన ఫిర్యాదును రాష్ట్రానికి పంపడంపై ఢిల్లీ హైకోర్టును గవినోళ్ల శ్రీనివాస్ ఆశ్రయించారు. న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ధర్మాసనం విచారణ నిర్వహించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్‌పై, చీఫ్ సెక్రటరీ ఎలా చర్యలు తీసుకుంటారని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. డివోపీటికి నోటీసులు జారీచేసి రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి హైకోర్టు వాయిదా వేసింది. రజత్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కూడా పిటిషన్‌లో గవినోళ్ల శ్రీనివాస్ కోరారు.

Leave a Reply