• నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసన మండలి సభ్యులు నాగబాబు
• గొల్లప్రోలు తాగునీటి సరఫరా కేంద్రంలో పూర్తయిన అభివృద్ధి పనులు
• గొల్లప్రోలులో అన్న క్యాంటీన్ ప్రారంభం
పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు.
పవన్ కళ్యాణ్ చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు పూర్తయిన పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందులో భాగంగా రూ. 28.5 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలసి ప్రారంభించారు.
అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో రూ. 65.24 లక్షలతో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పంప్ హౌస్ లో మోటార్ల పని తీరుని పరిశీలించారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ని ప్రారంభించారు. క్యాంటిన్ లో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. నాగబాబు తోపాటు ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్ , కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి , కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి , మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు , జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు , అధికారులు పాల్గొన్నారు.