.. పూల వర్షం కురిపించిన అధికారులు..
ప్రయాగ్రాజ్లో మహా కుంభ మేళ భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగ సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలి వచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలిని సైతం లెక్క చేయకుండా పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.
మరోవైపు, ఉదయం 8 గంటల వరకూ దాదాపు 63 లక్షల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తెలిపింది. వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది.
మూడంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఘాట్ల వద్ద సింగల్ లైన్లో పంపిస్తున్నారు. అదే విధంగా ప్రయాగ్రాజ్ లోపలికి కార్లను అనుమతించడం లేదు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం 84 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 54 అతి జన సాంద్రత నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు..