– బాబు అరెస్ట్ తర్వాత శివుడిపై భక్తి పెరిగింది
– మంత్రి నారా లోకేష్
అమరావతిః నిరంజనీ పీఠాధీశ్వర్ స్వామీజీ శ్రీశ్రీశ్రీ మహా మండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ గారికి భక్తి పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీశ్రీశ్రీ మహామండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ గారిని ఇక్కడ ఇలా కలుసుకోవడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. బాబు అరెస్ట్ తర్వాత నా ఆలోచన మారింది. శివుడిపై భక్తి పెరిగింది. రాముడిలానే కాదు.. అప్పుడప్పుడు శివుడిలా మారాలి. శివుడి గురించి తెలుసుకొని నేను ఎన్నో విషయాలు ఫాలో అవుతున్నాననని మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఒక ప్రైవేట్ చానెల్ ప్రారంభోత్సవానికి హాజరయిన లోకేష్ మాట్లాడుతూ, నేను రోజు సమావేశాలు పెట్టుకునే రూమ్ లో కూడా శివుడి విగ్రహం ఉంటుంది. ప్రతి రోజూ శివుడ్ని పూజిస్తాను. శివుడ్ని తలచుకున్నా, అయన విగ్రహాన్ని చూసినా నాకు ధైర్యం వస్తుంది. నేను యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నడవలేడు అంటూ అనేక విమర్శలు చేశారు. నేను శివ భక్తుడిని…226 రోజులు..3,132 కిలోమీటర్లు నన్ను శివుడే నడిపించాడు. సత్యం..శివం..సుందరం. శుభాలను ఇచ్చేవాడు ..శివుడు. అందరికీ సంతోషాన్ని పంచేవాడు శివుడు.
మానవత్వం…శివతత్వం. విషాన్ని మింగి అందరికీ అమృతం పంచిన ఆది దేవుడు శివుడు. ధ్యానం..మౌనం..జ్ఞానం..తప్ప వేరే అలంకారాలు వుండవు. భక్తి తప్ప మరే కానుకలు అక్కరలేదు. కోరిన కోర్కెలు తీర్చే భోళా శంకరుడు. అర్ధ నారీశ్వరుడు రూపంలో మహిళల గొప్పతనం, మహిళల్ని గౌరవించాలని మనకు నేర్పింది శివుడని అన్నారు.