Suryaa.co.in

Andhra Pradesh

ప్రెస్ అకాడమి ఆధ్వర్యం లో జర్నలిజంలో డిప్లొమా కోర్సు

గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచడం లక్ష్యంగా సి. రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి జర్నలిజం లో డిప్లొమా కోర్సు ను ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తోందని చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు పేర్కొన్నారు. జర్నలిజంలో డిప్లొమా కోర్సు ఏర్పాటుపై ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం జర్నలిజం విభాగంతో, వైస్ ఛాన్సలర్ ప్రొ. పి. రాజశేఖర్ సమక్షం లో సోమవారం ఒక ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. 6 నెలల వ్యవధి తో కూడిన ఈ డిప్లమో కు సంబంధించిన సిలబస్ ను ఇప్పటికే రూపొందించడం జరిగిందన్నారు. 3 సంవత్సరాలు అనుభవం వుండి,ఇంటర్ విద్యార్హత కలిగిన జర్నలిస్టులు ఈ డిప్లొమా కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆయన తెలిపారు. డిగ్రీ విద్యార్హత కలిగిన ఇతరులు కూడా ఈ డిప్లొమా కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విలేకరులు జర్నలిజం లో డిప్లొమా పూర్తి చేసుకోవడం ద్వారా తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం తో బాటు విద్యార్హత ను పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ డిప్లొమా కోర్సు ఆన్ లైన్ విధానం లో అందచేయడం జరుగుతుందన్నారు. పరీక్షలు నిర్వహించడం, డిప్లమా సెర్టిఫికెట్ ఇవ్వడం వంటి అకడమిక్ అంశాలను నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం నిర్వహిస్తుందన్నారు.

సెంట్రల్ యూనివర్సిటీ స్థాయికి ఎదగాలి; నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ గా ప్రతిష్ఠాత్మక కోర్సులతో ఉన్నత విద్యని మధ్య కోస్తా జిల్లాల పేద విద్యార్థులకు అందిస్తోందని ఆయనప్రశంసించారు. పలువురు లబ్ద ప్రతిష్టులైన ప్రముఖులు ఈ యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యని అభ్యసించి ప్రముఖ స్థానాలను పొందగలిగారన్నారు. నాగార్జున విశ్వ విద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ స్థాయికి ఎదగాలని, యిందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు.

నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. పి. రాజశేఖర్ మాట్లాడుతూ జర్నలిజం డిప్లమో కోర్సు ప్రారంభించడంలో నాగార్జున యూనివర్సిటీ తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అకడమిక్ అంశాల్లో తమ యూనివర్సిటీ జర్నలిజం విభాగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే తమ యూనివర్సిటీ లో జర్నలిజంకోర్సు అభ్యసించిన విద్యార్థులు పలు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చేరారని ఆయన తెలిపారు.

జర్నలిజం డిప్లమా కోర్సు ఏర్పాటు కు సంబంధిచిన “మెమోరాండం ఆఫ్ అండర్ ష్టాండింగ్”(ఎం.ఓ.యూ.) పై ప్రెస్ అకాడమీ సెక్రెటరీ శ్రీ ఎం. బాలగంగాధర్ తిలక్, నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీమతి డా. బి. కరుణ సంతకాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు, నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. పి. రాజకుమార్ ల సమక్షంలో ఒప్పంద పత్రాల్ని ఒకరికొకరు అంద చేసుకున్నారు. నాగార్జున నగర్, గుంటూరు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రంలో జర్నలిజం విభాగం హెడ్ అఫ్ ది డిపార్టుమెంటు డా. జి.అనిత ,అధ్యాపకులు డా. మధు బాబు, డా. మాణిక్య రావు, ప్రొ. శ్రీనివాస రెడ్డి, ప్రొ. నాగరాజు, ప్రెస్ అకాడమీ కంటెంట్ ఎడిటర్ శ్రీ కలమండ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE