జూన్ 9న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

జూన్ 9 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో GHMC కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ CV ఆనంద్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిన సోదరులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీ కి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ కి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి కారణంగా చేప ప్రసాదం పంపిణీ చేయలేదని, తిరిగి ఈ సంవత్సరం నుండి చేప ప్రసాదం పంపిణీ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ చేప ప్రసాదం కోసం మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి కూడా లక్షలాది మంది వస్తుంటారని చెప్పారు. సాధారణ ప్రజలకు, వృద్దులు, వికలాంగులు, చిన్న పిల్లలకు వేరువేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ ల ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం, ఎవరైనా అనారోగ్యానికి గురైతే అత్యవసర వైద్య సేవలు అందించడం కోసం హెల్త్ క్యాంప్ ల ఏర్పాటు తో పాటు అంబులెన్స్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు.

అంతేకాకుండా పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో బోజన సౌకర్యం కూడా కల్పిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైన చేప పిల్లలను కూడా ప్రభుత్వమే మత్స్య శాఖ ద్వారా సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. ఏర్పాట్లపై ఈ నెల 25 వ తేదీన వివిధ శాఖల అధికారులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రత్యేక సమావేశం నిర్వాహించున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో బత్తిన సోదరులు గౌరీ శంకర్ గౌడ్, శివశంకర్ గౌడ్, అమర్నాద్ గౌడ్, అలకానంద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply