– కీలక అభివృద్ధి మొదలైంది
– దివిసీమ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వ కృషితో కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది
అమరావతి: ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. దివిసీమ ప్రజల చిరకాల వాంఛ.. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మనోభిలాష, అవనిగడ్డ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కీలకంగా నిలుస్తుందనే మహోన్నత లక్ష్యానికి ప్రతిరూపం “నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రం” నిర్మాణ పనులకు భారత ప్రధాని నరేంద్రమోడీ అమరావతి రాజధాని వేదికపై శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కృషితో ఈ శంకుస్థాపన మహోత్సవం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ దివిసీమ ప్రగతి రధచక్రానికి మెరుపు వేగాన్ని ఇచ్చారు. దాదాపు రూ.ఇరవై వేల కోట్లతో నిర్మించే “నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రం” నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బాటలు వేశారు.
తొలి దశలో రూ.1,500 కోట్లతో నిర్మాణ పనులకు ప్రధాని తమ స్వహస్తాలతో వర్చువల్ శంకుస్థాపన చేయటం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గ శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షను నెరవేర్చారు. ఈ కేంద్రం సాధనకు మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి పూర్వపు డీ.ఆర్.డీ.ఏ చైర్మన్, ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారు డాక్టర్ జీ.సతీష్ రెడ్డి సహకారంతో విస్తృత కృషి చేశారు.