( మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమికి తిరుగులేని స్థానాలు పువ్వుల్లో పెట్టి అప్పగించిన జనం నమ్మకాన్ని అధికారులు అవలీలగా పోగొడుతున్నారు. శవాల కోసం చకోరపక్షిలా ఆవురావురమంటున్న విపక్షానికి.. చావులతోపాటు, అస్త్రాలూ అందిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ అధికారులు అడ్డగోలు స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. కులం-ప్రాంతం పేరుతో గద్దెనెక్కుతున్న అధికారులు, ఆనక రెచ్చిపోయి పాలకుల పరువు తీస్తున్న సంప్రదాయం.. కూటమి జమానాలోనూ విజయవంతంగా కొనసాగడమే విషాదం. అందుకు సింహాచలం అప్పన్న సన్నిధిలో తలవాల్చిన, ఏడుగురు అమాయక భక్తుల విషాదమే నిలువెత్తు నిదర్శనం.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. ఆయనపై దుష్ప్రచారం మొదయిలందే ధార్మిక అంశాల నుంచి అన్నది విస్మరించకూడదు. పుష్కరాల్లో డజన్ల కొద్దీ భక్తుల మరణాలు, శ్రీవారి ఆలయంలో పింక్ డైమండ్ మాయమయిందన్న ఆరోపణ నుంచి.. ఆలయాల కూల్చివేత వరకూ వెల్లువెత్తిన విమర్శలను, నాటి విపక్ష వైసీపీ సొమ్ము చేసుకుందన్న చేదు అనుభవాల నుంచి, ఇంకా గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా?
నిజానికి అప్పన్న సన్నిధిలో గోడ కూలి, నేల రాలిన అమాయక భక్తుల మరణానికి ఏ గాలివానో కారణం కాదు. విపక్షం భాషలో చెప్పాలంటే అది నిస్సందేహంగా అధికారుల హ త్యనే. అప్పన్న ఆలయంలో చందనోత్సవం ఎప్పుడన్నది దేవదాయ శాఖ కమిషనర్గా ఉన్న రామచంద్రమోహన్కు తెలుసు. కాబట్టి ఆలయంలో అంతపెద్ద గోడ నిర్మాణానికి, సరైన సమయమేదో ఆయనకు అంచనా ఉండి తీరాలి. పైగా రామచంద్రమోహన్కు సింహాచలం ఆలయంతో ఫెవికాల్ బంధం.
చాలాకాలం ఆలయాన్ని ఏలిన రామచంద్రమోహన్కు అప్పన్న ఆలయంలో ఎన్ని మెట్లు, గోడల ఎత్తుతోపాటు, చెట్టు పుట్టల లెక్కలు కూడా తెలిసే తీరాలి. మరి అలాంటిది.. కీలకమైన చందనోత్సవానికి కేవలం నాలుగురోజుల ముందు భారీ గోడ నిర్మాణానికి ఎలా అనుమతించారు? ఉత్సవానికి రెండురోజుల ముందు సతీసమేతంగా దర్శనానికి వచ్చిన రామచంద్రుల వారికి ఆ గోడ కనిపించలేదా? ఆ నిర్మాణానికి తాను అనుమతి ఇచ్చానా లేదా అన్న స్పృహ కూడా లేకుండా పోయిందా? లేక చూసి నేత్రానందం పొందారా?
పునాదులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్ఫోర్స్మెంట్, స్ట్రక్చర్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్తో భారీ గోడ నిర్మించడమే దారుణం. అంతఎత్తున గోడ నిర్మించినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడ పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు? దాని ప్రకారమే గోడ కట్టారా? అక్కడ ఉన్న షాపులను తొలగించమని ఆదేశాలిచ్చింది ఎవరు? కనీసం సిమెంట్ లేకుండా ఇసుక ఎక్కువపాలు చేసి నాసిరకం నిర్మాణం చేయడాన్ని.. అన్నేళ్లు సింహాచలం ఈఓగా వెలగబెట్టిన రామచంద్రుడికి తెలియకపోవడమే వింత. ఒకరకంగా ఇది ఆయన అనుభవానికే సిగ్గుచేటు.
అసలు లక్షల సంఖ్యలో తరలివచ్చే ఇలాంటి కార్యక్రమాల సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పారామెడికల్, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలి. కానీ ప్రమాదం జరిగిన అరగంట తర్వాత అవి వచ్చాయంటే.. కమిషనర్గా రామచంద్రుల వారి పర్యవేక్షణ-కలెక్టర్ పనితనం అంత అమోఘంగా అఘోరించిందన్నమాట. రెండురోజుల ముందు వచ్చిన కమిషనర్.. విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్తోపాటు ఎలక్ట్రిసిటీ, రెవిన్యూ అధికారులతో ఎన్నిసార్లు సమీక్ష నిర్వహించారన్నదే ప్రశ్న.
విశాఖలో అత్యంత పెద్ద పండుగయిన చందనోత్సవ వేళ విధులు నిర్వహించకుండా, త్రినాధరావు అనే అధికారికి అమెరికా వెళ్లేందుకు, కమిషనర్గా వెలగబెడుతున్న రామచంద్రమోహన్ ఎలా అనుమతించారు? అసలు ఇలాంటి వ్యవహారాల్లో ఏమాత్రం అనుభవం లేని రెవిన్యూ అధికారి సుబ్బారావుకు, ఇన్చార్జి ఈఓ బాధ్యత లు ఏ ప్రాతిపదికన కట్టబెట్టారు? క్రౌడ్ మేనేజ్మెంట్లో అనుభవం లేని ఆయనకు బాధ్యతలిచ్చి, ఇప్పుడు ఆయనను బలి పశువును చేస్తారా? బహుశా సుబ్బారావు కాపు సామాజిక వర్గానికి చెందిన అధికారి కాబట్టి, ఆలయంలో ఏదైనా వివాదం తలెత్తితే ఏ రాజకీయ పార్టీ, నాయకుడు నోరెత్తి మాట్లాడలేరన్న అతి తెలివితో ఆయనను నియమించారా? అసలు సుబ్బారావును సిఫార్సు చేసి, ఎంపిక చేసిన మహానుభావుడెవరు?
ఈ రామచంద్రుల వారి ఘనత అలాంటిదిలాంటిది కాదు. సింహాచలం భూములన్నీ సారుకు కొట్టినపిండి. మాన్సాస్ ట్రస్టు పెద్దల మనసెరిగి వ్యవహరించే రామచంద్రుడు.. నిజానికి దేవదాయశాఖ కమిషనర్ పోస్టుకు అనర్హుడని, ఆయన కంటే సీనియర్ అయిన ఒక దళిత అధికారికి అన్యాయం చేసి, కులం దన్నుతో ఆ పోస్టు పట్టేశారన్నది దేవదాయశాఖలో గత కొద్దికాలం నుంచీ వినిపిస్తున్న చర్చ. సహజంగా దేవాలయాలకు సంబంధించి అందులో ఎవరిపైనయినా అవినీతి ఆరోపణలతోపాటు, విజిలెన్స్-ఏసీబీ విచారణ జరిగితే, వారికి కీలకమైన పోస్టులు ఇవ్వరు. కానీ రామచంద్రుల వారి పాల‘కుల’ పలుకుబడి-పరిచయాల ముందు అవన్నీ చిన్నబోయాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే.. ఆయనను సింహాచలం ఈఓగా నియమించేది లేదని, స్వయంగా ప్రభుత్వమే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. మరి అసలు ఈఓగానే నియమించమని చెప్పిన ప్రభుత్వం..పదేళ్ల తర్వాత ఏకంగా ఎండోమెంట్ కమిషనర్గానే నియమించడమే వింత.
సింహాచలం నరసింహస్వామి వంటి ప్రతిష్ఠాత్మక ఆలయంలో జరిగే చందనోత్సవానికి, ఫుల్టైమ్ ఈఓను నియమించాలన్న స్పృహ ఒక్కటే కాదు. ఎండోమెంట్ కమిషనర్ను కూడా పూర్తి స్థాయి అధికారిని నియమించాలన్న స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడమే విచారకరం. ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ నాన్ ఐఏఎస్. చందనోత్సవం జరిగే విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఐఏఎస్. జిల్లా ఎస్పీ, ఐజీ ఐపిఎస్ అధికారులు.
మరి ఒక నాన్ ఐఏఎస్ ఆదేశాలను.. ఏఐఎస్-ఐపిఎస్ అధికారులు ఎలా పాటిస్తారన్న స్పృహ కూడా, పాలకుల్లో కొరవడటమే వింత. నిజానికి నాన్ ఐఏఎస్ పోస్టు పెద్దదే అయినప్పటికీ, వారి మాట మిగిలిన శాఖల డైరక్ట్ ఐఏఎస్-ఐపిఎస్లు వినరన్నది బహిరంగమే. ఇప్పుడు సింహాచలంలో కూడా అదే జరిగిందన్నది, అధికార వర్గాల్లో జరుగుతున్న ఒక చర్చ. నిజానికి రామచంద్రమోహన్కు కమిషనర్ స్థాయి లేదు. కింద నుంచి ప్రమోషన్లపై వచ్చిన అధికారి మాత్రమే. తాజా విషాదాంతంలోనయినా పాలకులు కళ్లు తెరిచి, ఎండోమెంట్శాఖకు ఐఏఎస్ను కమిషనర్గా నియమిస్తే.. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాన్ని ఆపే అవకాశం ఉంటుంది.
చందనోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వెళ్లిన మంత్రుల బృందం కూడా, మెదడుతో ఆలోచించినట్లు కనిపించలేదు. ఆలయంలో ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రుల బృందానికి.. అక్కడ నిర్మించిన తాత్కాలిక గోడ, తొలగించిన రిటైనింగ్ వాల్ కనిపించకపోవడం బట్టి.. వచ్చిన ఆ మంత్రులు ఎంత పనిమంతులో తెలిసిపోతుంది. అసలు జిల్లా కలెక్టరే అంత పెద్ద ఉత్సవంపై మొక్కుబడి సమీక్ష నిర్వహించారంటే, ఆయనెంత ప్రతిభాశాలో అర్ధమవుతుంది.
సహజంగా ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఉత్సవాలకు రాజకీయ పార్టీల సహకారం ముఖ్యం. అధికార పార్టీ వారయినా, ప్రతిపక్షపార్టీల వార యినా, ఆ ఉత్సవాల్లో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ శాఖల అధికారులయినా, దర్శన టికెట్లు సిఫార్సు చేస్తుంటారు. వారిని సంతృప్తిపరిచి, లౌక్యంగా వ్యవహరించి ఉత్సవాన్ని పూర్తి చేయడంలోనే అధికారుల సత్తా బయటపడుతుంది. ఎందుకంటే వారి సహకారం అక్కడ అవసరం. రాష్ట్ర స్థాయిలో రాజకీయపార్టీల మధ్య ఎన్ని వైరుధ్యాలున్నా, స్థానికంగా వారిని మెప్పించి ఉత్సవాన్ని గట్టెక్కించడమే అధికారుల తెలివి. రాష్ట్రంలోని అన్ని ఉత్సవాల వ్యవహారం ఇలాగే ఉంటుంది.
టీటీడీనే ఉదాహరణకు తీసుకుంటే.. టీటీడీ దర్శనాలకు ప్రజాప్రతినిధులు, ఐపిఎస్-ఐఏఎస్ లేఖలు మాత్రమే అర్హత అన్నది చాలామంది నమ్మకం. కానీ తిరుపతిలో అన్ని పార్టీల నాయకులు ఇచ్చే లేఖలకు సైతం, రోజూ టికెట్లు ఇస్తారన్న విషయం బయట ప్రపంచానికి తెలియదు. చాలామంది తిరుపతి నాయకులకు ఇదో పరోక్ష ఆదాయం. ఎందుకంటే వీరు తమ గురించి, మీడియా వద్ద వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండటానికి టీటీడీ అధికారుల లౌక్యం అన్నమాట.
కానీ తాత్కాలిక అధికారిగా ఉన్న సుబ్బారావుకు గానీ, ఏళ్ల తరబడి పాతుకుపోయి.. పైవారిని మెప్పించడంలో నిష్ణాతుడిగా పేరున్న కమిషనర్ రామచంద్రమోహన్కు గానీ, ఈ లౌక్యం తెలియకపోవడమే వింత. విశాఖలో టీడీపీ కీలక ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి తనపై వచ్చే ఒత్తిడి దృష్ట్యా, సొంత ఖర్చుతో స్వయంగా టికెట్లు కొంటానని చెప్పినా, తాత్కాలిక ఈఓ పెద్దగా స్పందించలేదట. ఓ 50 టికెట్లు ఇస్తానని చెప్పారట. చివరకు ఆయన బంధువైన మంత్రి గారి సిఫార్సును కూడా, సదరు తాత్కాలిక ఈఓ పట్టించుకోలేదేట. మరి అధికార పార్టీ స్థానిక నేతల నుంచి, ఉత్సవాలకు స్థానికంగా సహకారం ఎందుకు లభిస్తుంది?
తాజా విషాదంపై బహిరంగ విచారణ జరిపించడం మంచిదే అయినప్పటికీ.. పర్యవేక్షణలో ఘోరంగా విఫలమైన, దేవాదయ శాఖకు బాధ్యుడిగా ఉన్న కమిషనర్ రామచంద్రమోహన్పై వేటు వేయకపోవడం, తప్పుడు సంకేతాలకు కారణమవుతుంది. చందనోత్సవం ఉందని తెలిసినా ఈఓకు, అమెరికా వెళ్లేందుకు సెలవు ఇచ్చిన ఉన్నతాధికారిపై చర్యల కొరడా ఝళిపించకపోతే, అది క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. ఇదే సంప్రదాయాన్ని మరొక ఈఓ పాటించే ప్రమాదం లేకపోలేదు. ఇక ఈ విషాదంలో విశాఖ కలెక్టర్ పాత్ర కూడా సుస్పష్టం. ఘటన ముందురోజు అర్ధరాత్రి వరకూ టికెట్ల అమ్మకాలను పర్యవేక్షించిన సుబ్బారావు, ఏర్పాట్ల పర్యవేక్షణ ఎలా చూడగలరన్నది మరో ప్రశ్న.
అసలు ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తూ.. విపక్ష నేత జగన్ బయటపెట్టిన గోడ నిర్మాణ ఫొటోలే అతిపెద్ద అనుమానాస్పదం. గోడ నిర్మాణ ప్రారంభం నుంచి.. అన్ని దశల్లో జరిగిన నిర్మాణాలను ఆయన ఫొటోలతో సహా ప్రపంచానికి చూపించడం ద్వారా, ప్రభుత్వాన్ని-ఆలయ అధికారులను ప్రజల్లో ముద్దాయిగా నిలబెట్టారు. అయితే అసలు ఆ ఫోటోలు తీసింది ఎవరు? వాటిని వైసీపీ నేతలకు అందించింది ఎవరు? మంత్రులు, నిఘా వే గులకూ దొరకని ఫొటోలు జగన్కు ఎలా చేరాయి? అంటే ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా? ఈ మొత్తం వ్యవహారంలో జగన్ జగద్గురువు విశాఖ స్వామి గారు, తమ అదృశ్య హస్తాలతో ఏమైనా చక్రం తిప్పారా? అన్నది మరో ప్రశ్న.
అయితే జగన్ ఆరోపించారు కాబట్టి, రాజకీయ కోణంలో అవన్నీ అబద్ధమని.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫలానా చోట అన్నేసి మరణాలు జరిగాయంటూ, కూటమి నేతలు రాజకీయంగా ఎదురుదాడి చేయడ ం అవివేకం. దానివల్ల ఆ ఒక్కరోజు మీడియాలో పబ్లిసిటీ వస్తుందేమో గానీ, ప్రజల్లో నెలకొన్న అనుమానాలు దూరం చేయలేవు. జగన్ జమానాలో అన్ని కిరాతకాలు, మహా పాతకాలు జరిగాయనే కదా కూటమికి జనం గంపగుత్తగా ఓటేసింది?
మరి ఇప్పుడు ఆ కూటమి హయాంలోనూ అవే దారుణాలు జరిగితే, ఇక వైసీపీకి-కూటమికి తేడా ఏం ఉంటుంది? ఆ ప్రభుత్వాన్ని నిందించి, ఈ ప్రభుత్వం చేసిందేమిటి? అన్న అసంతృప్తి-ఆగ్రహం, మెడమీద తల ఉన్న ఎవరికైనా వచ్చి తీరుతుంది కదా? నిజానికి ఆ విషాదఘటనపై జగన్ ఏ ఆరోపణలయితే చేశారో, ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రధాన పత్రికలు కూడా.. అదే కోణంలో కథనాలు రాయడం విస్మరించకూడదు. అంటే జగన్ ఆరోపణల్లో బలం ఉందని నమ్మినట్లే కదా?
మొన్న తిరుపతి, నిన్న సింహాచలం లాంటి ఘటనలు కొనసాగితే, కూటమి పాలనపై ప్రజలకు నమ్మకం సడలడం.. విపక్షాలు వాటిని తమకు అనుకూలంగా వాడుకోవడం సహజమే కదా? కూటమి నాయకులు ఇంకా ఇలాంటి కాలం చెల్లిన రాజకీయాలనే కొనసాగించడం అవివేకం. ఇలాంటి సున్నిత, మతపరమైన అంశాల్లో రాజకీయ పార్టీగా అధికారపార్టీ ఎంత మౌనంగా ఉండి, అంత వేగంగా చర్యలు తీసుకుంటే అంత మంచిది.
అసలు అప్పన్న ఆలయంలో నాలుగురోజుల క్రితం గోడ నిర్మించాలని ఆదేశించింది ఎవరు? ఆ ప్లాన్కు అప్రూవల్ ఉందా? అన్న ప్రశ్నలకు కాంట్రాక్టరు జవాబు ఇచ్చేశారు కాబట్టి, ఇప్పుడు వారిపై వేటు వేస్తారా? లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఈ వ్యవహారంలో కాంట్రాక్టరు నిమిత్తమాత్రుడు. అధికారులు ఏది చెబితే అది చేయడం, త్వరగా బిల్లులు తీసుకోవడమే అతని విధి. కాబట్టి ఈ ఘోరంలో సదరు కాంట్రాక్టరును బలి చేయడం అన్యాయమే అవుతుంది. ఆ ప్రకారంగా కాంట్రాక్టరుకు ఆదేశాలిచ్చిన అధికారులపై వేటు వేయడమే న్యాయం. ఇందులో ఇన్చార్జి ఈఓగా ఉన్న సుబ్బారావు కూడా నిమిత్తమాత్రుడే.
జగన్ దంపతులు ముచ్చటపడి.. వందలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన రిపికొండ ప్యాలెస్ నిర్మించిన ఇంజనీరు సారే, సింహాచలం ఆలయంలో తాత్కాలిక గోడ నిర్మించారన్న కొత్త ఆరోపణలను తేల్చాల్సి ఉంది. ఎందుకంటే.. రుషికొండను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, జగన్ దంపతుల కళ్లలో మెరుపులు చూడటమే కాదు. ఆ పులివెందుల కాంట్రాక్టరుకు బిల్లులు కూడా పువ్వులో పెట్టి అప్పగించిన ఐఏఎస్ అధికారికి ‘కాపు’కాసి, ఇప్పుడు సీఆర్డిఏ బాధ్యతలు అప్పగించారు. సో.. రిషికొండ అనుభవంతో, అప్పన్న ఆలయంలో గోడ కట్టించిన సదరు ఇంజనీరు బాబుకు కూడా, ఈ ‘మంచి ప్రభుత్వం’ ఇంకేదైనా కీలక పోస్టు ఇచ్చినా ఆశ్చర్యం లేదన్నది తమ్ముళ్ల ఉవాచ. ఎందుకంటే ఎంతైనా మంచి ప్రభుత్వం కదా?
చందనోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిన మంత్రి ఆనం, తన నియోజకవర్గంలో జరిగే సీఎం పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. దానితో ఆయన అటు వైపు కన్నేయలేదు. ఫలితంగా పట్టువస్త్రాలు కూడా సమర్పించలేకపోయారు. సరే. సంబంధిత మంత్రి రాకపోతే.. ఆ బాధ్యతను జిల్లా ఇన్చార్జిమంత్రి బాలవీరాంజనేయస్వామికో, ఉమ్మడిజిల్లా మంత్రి అనితకో అప్పగించాలి కదా?
మరి బాపట్ల జిల్లాకు చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఎలా అప్పగించారు? అసలు ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఇది సీఎంఓ స్థాయిలో జరిగిన నిర్ణయమా? లేక శాఖ కార్యదర్శి నిర్ణయమా? ఒకవేళ సీఎంఓ స్థాయిలో జరిగితే ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరు అన్నది తేల్చాలి. ఎందుకంటే.. ఇది దళితులను అవమానించే వ్యవహారమన్నది, ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో కొత్తగా తెరపైకి వచ్చిన చర్చ. అనితకు గతంలో కూడా నాకాంబికా ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఇవ్వలేదన్నది కొత్తగా తెరపైకి వచ్చిన పాత చర్చ. ఇది రచ్చ కావడానికి పెద్ద సమయం కూడా అవసరం లేదు. ఇలాంటి చర్చలకు అవకాశం ఇవ్వడం ద్వారా, ప్రభుత్వాన్ని భ్రష్ఠుపట్టిస్తున్న అధికారులను కొనసాగించడమే వింత.
దేశంలో ప్రాంతీయవాదం, మతవాదం, కులవాదం అత్యంత ప్రమాదకరం. వాటికి అవకాశం ఇవ్వకుండా పాలించడమే పాలకుల భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ప్రాంతీయవాదం, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల ముందు రేగిన తిరుమల పింక్ ైడె మండ్ చిచ్చు ఎంత ప్రభావితం చేసిందో, ఏ ఫలితాలకు దారితీసిందో విశ్లేషించుకోవాలి. చేతులు కాలిన తర్వాత తీరి కూర్చుని విచారించినా ఫలితం ఉండదు.