Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా?

– వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు
– ప్రజల ఆస్తులను జగన్ అమ్మేస్తున్నాడు జాగ్రత్త
– మీ ఓటు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది
– కళ్యాణదుర్గం మహిళలకు భువనేశ్వరి హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం వెళ్లిన భువనేశ్వరి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మహిళలతో మాట్లాడుతూ….జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు దిగుతున్నారు.

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షసుల పాలనలో ఉన్నామా? లేక బ్రిటీషు వారి చేతిలో బానిసల్లా ఉన్నామా? ప్రజలు ఆలోచించాలి. మనకు స్వాతంత్ర్యం, రాజ్యాంగబద్దమైన హక్కులు ఉన్నాయా? లేవా? ప్రజలు వీటి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

చంద్రబాబు పాలనలో ధైర్యంగా బ్రతికిన మహిళలు నేడు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.వైసీపీ నాయకులు మహిళలు అని కూడా చూడకుండా రాడ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు.నాయకుడు ఎలా ఉన్నాడో క్రింద ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు.

చంద్రబాబు పాలనలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే నిందితుడిని ప్రభుత్వం ఎలా శిక్షిస్తుందోననే భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మహిళలకు ఏదైనా జరిగితే చంద్రబాబు ఆ స్థాయిలో స్పందించి చర్యలు తీసుకునేవారు.

అమరావతి రైతులు 1600రోజులుగా రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు.అమరావతి మహిళలపై వైసీపీ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించింది. గర్భిణి కడుపై పోలీసులు తన్నడంతో బిడ్డల్ని కూడా కోల్పోయారు. రాత్రిపూట కూడా స్టేషన్లలో నిర్బంధించినా మహిళలు ఎక్కడా తగ్గకుండా తమ పోరాటాలను కొనసాగించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో శాంతియుత ర్యాలీలు, నిరసనలు చేసిన మహిళలపైనా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది..అక్రమ కేసులు పెట్టింది. రాత్రిపూట కూడా మహిళలను స్టేషన్లలో ఉంచి ఇబ్బందులు పెట్టారు.

తెలుగుదేశం కార్యకర్తలను గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చిత్రహింసలు పెడుతూనే ఉంది. అక్రమ కేసులు పెడుతూనే ఉంది.నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలను నడిరోడ్డుపై గొంతుకోసి చంపేసిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది.

ప్రాణాలు కోల్పోయినా సరే పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాలు పసుపు జెండాను కిందికి దించకుండా పైకి ఎగరేస్తూనే ఉన్నారు. అది తెలుగుదేశంపార్టీ గొప్పతనం.ఇబ్బందులు పడిన కార్యకర్తలు, అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు…మీతో మేమున్నాం…మీకు అండగా నిలబడతాం..మీకు మీ నాయకుడు చంద్రబాబు అన్నివేళలా అందుబాటులో ఉన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును 53రోజులు జైల్లో నిర్బంధించింది. ప్రజలకు చంద్రబాబును దూరం చేయాలని చూశారు. కానీ చంద్రబాబు జైల్లో ఉండి కూడా ప్రజల గురించే ఆలోచించారు. అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవాలని, పార్టీ అండగా ఉందనే విషయాన్ని చెప్పి ఓదార్చాలని నన్ను పంపారు.

నిజం గెలవాలి కార్యక్రమం చేయాలంటే ప్రారంభంలో నేను భయపడ్డాను..కానీ నాకు రోజు పెరిగిన కొద్దీ ధైర్యం పెరిగిపోతోంది. దానికి కారణం కార్యకర్తలు నన్ను అడుగడుగునా ఓ తల్లిని బిడ్డలు ఎలా కాపాడుకుంటారో అలా నన్ను కాపాడుకుంటున్నారు. మీకోసం ఎంత దూరమైనా రావడానికి నేను బెదిరే పరిస్థితే లేదు.

రాష్ట్రం విడిపోయిన సమయంలో దీన్ని నిర్మించడానికి చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడిపారు.కష్టపడి కంపెనీలు, పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చారు. 33వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించేందుకు అనేక పనులు చేపట్టారు.

జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక 3 రాజధానులు అంటూ కనీసం ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడు. ఇది రాష్ట్ర ప్రజలకు సిగ్గుచేటు విషయం. చంద్రబాబు తెచ్చిన కంపెనీలన్నీ జగన్ వేధింపులు, కమీషన్ల కోసం ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రక్కనున్న రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.

ఏపీలో నేడు ఉద్యోగాలు పోయి నిరుద్యోగులు మిగిలిపోయారు. ఏపీకి రావాలంటే కంపెనీలు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు.జగన్ ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్నాడు..ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులను తాకట్టు పెడుతున్నాడు. చివరకు రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు.

తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారు? ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో ఎవరికీ తెలియదు.ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పోకపోతే ఏపీ ప్రజలంతా రానున్న రోజుల్లో ప్రక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వస్తాయని మర్చిపోవద్దు.

మహిళలు భద్రంగా ఉండాలంటే, ఆర్థికంగా బలోపేతం కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఒకప్పుడు అభివృద్ధిలో నంబర్ 1 స్థానంలో ఉన్న ఏపీని జగన్ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్, శాండ్ మాఫియా, మహిళలపై దాడులు, అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యల్లో నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చాడు.

ఏపీ భవిష్యత్తు చంద్రబాబు చేతిలో పెడితే రాష్ట్రమంతా బాగుంటుంది. జగన్ కు మరో అవకాశం ఇస్తే రాష్ట్ర పరిస్థితిని ఊహించలేం…పక్కనున్న రాష్ట్రాలకు వెళ్లి బ్రతకాల్సిందే. మహిళలను, ఈ రాష్ట్రాన్ని మీ ఓటే కాపాడుతుంది.
రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మహిళలు అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

LEAVE A RESPONSE