– వివరాలివ్వాలని సిట్కు లేఖ
– అనిల్, మిథున్రెడ్డికి చిక్కులు తప్పవా?
– మరోసారి చిక్కుల్లో జగన్
అమరావతి: జగన్ జమానాలో జరిగిన వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంలో కీలక మలుపు. అనుకున్నట్లుగానే ఈ కేసులో, ఈడీ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. వెల్లడించింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002 ప్రకారం లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందజేయాల్సిందిగా సిట్ అధిపతి, విజయవాడ సీపీకి ఈడీ తాజాగా లేఖ రాసింది.
కేసుకు సంబంధించిన 21/2024 ఎఫ్ఐఆర్ వివరాలు, ఇప్పటి వరకు సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలు పంపాలని.. ఇప్పటివవరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు తమకు అందజేయాలని కోరింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులపై ఛార్జిఫీట్ నమోదు చేస్తే, వాటి కాపీలను కూడా ఇవ్వాలని ఈడీ లేఖలో పేర్కొంది.
లిక్కర్ స్కాంకు సంబంధించి సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు, ఆయన పీఏ పైలా దిలీప్ను అరెస్ట్ చేసింది.
నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులను కోరినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది.
ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగితే ఈ కేసులో సూత్రధారిగా అనుమానిస్తున్న అనిల్రెడ్డి, ఎంపి మిథున్రెడ్డికి ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా తాము లిక్కర్ స్కాములో సంపాదించిన ధనాన్ని, తాడేపల్లి ప్యాలెస్కు పంపించామని నిందితులు వెల్లడించినందున.. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడక తప్పదంటున్నారు.
కాగా లిక్కర్ సొమ్మును.. ఒక మాజీ డీజీపీ తనయుడికి చెందిన హైదరాబాద్ ఐటీ కంపెనీకి మళ్లించినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ ఏరికోరి ఆయనను డీజీపీగా నియమించిన కాలంలోనే టీడీపీ అగ్రనేతలపై కేసులు, అరెస్టులు జరిగిన విషయం తెలిసిందే. జగన్ సన్నిహితులైన వారి బంధువుల కంపెనీల అకౌంట్లు తనిఖీ చేస్తే, ఆశ్చర్యమైన విషయాలు వెలుగుచూస్తాయంటున్నారు.