Suryaa.co.in

Telangana

ఇవాళ కాకపోయినా.. ఎన్నికల తర్వాతైనా.. కలిసే పార్టీలే

కేసీఆర్ఇది ఏరకంగా సమైక్యత దినం?
మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నారు
మహారాష్ట్ర, కర్ణాటకల్లో విముక్తి ఉత్సవాలు జరిగితే.. తెలంగాణలో.. సమైక్యత పేరుతో కార్యక్రమాలా?
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుని అధికారాన్ని పంచుకుని.. తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. 4కోట్ల మంది ప్రజలకు నిరంతర పోరాటం తర్వాత అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. 42 రోజుల పాటు తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే కానీ స్పందించని పార్టీ కాంగ్రెస్.

హామీ ఇచ్చాం.. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ అంటోంది. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి మీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో కాంగ్రెస్ పార్టీ రాలేదు. 1952 నుంచి కూడా అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. 1971లో గరీబీ హటావో, 16 పాయింట్ పార్ములా.. ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదు. నిన్న హైదరాబాద్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మోసపూరితమైనవి. గతంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేని పరిస్థితి.

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు ఎన్నో జరిగాయి. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసు ఈ హామీలల్లో పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప.. ఇవేవీ అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చింది వేటినీ అమలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సమావేశం.. బీఆర్ఎస్ స్పాన్సర్ చేసిన పార్టీ అది. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత పెంచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది.

నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తే.. మా కార్యకర్తలమీద జులూం ప్రదర్శించారు. చాలా మంది ఇంకా ఆసుపత్రుల్లో ఉన్నారు. ప్రభుత్వం,పోలీసులు ధర్నాచౌక్ లో అనుమతిచ్చిన తర్వాత కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రెండు పార్టీలు ఒకటే. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇవాళ కాకపోయినా.. ఎన్నికల తర్వాతైనా.. కలిసే పార్టీలే. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారు. కానీ బీజేపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరు. తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదు.

తెలంగాణ విమోచన దినోత్సవం రోజు హైదరాబాద్ లో సమావేశం పెట్టుకుని.. కనీసం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పలేని పరిస్థితి. గత 75 ఏళ్లుగా.. అధికారంలో ఉన్నప్పుడు తెలంగణ దినోత్సవ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సెప్టెంబర్ 17న సమావేశం హైదరాబాద్ లో పెట్టుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు.

1998 నుంచి బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం కలెక్టర్ కార్యాలయాలపై జెండాలు ఎగురవేసి.. దెబ్బలు తిన్నాం. బీఆర్ఎస్ సమైక్యత దినం అని చెప్పి.. పెద్దల త్యాగాలను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తోంది.

ఇది ఏరకంగా సమైక్యత దినం? కేసీఆర్. ఎవరి ద్వారా సమైక్యత సాధ్యమైంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఓ మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట.. చేత కాకపోతే.. మజ్లిస్ కు భయపడితే ఏ ఉత్సవాలు చేయొద్దు. కానీ చరిత్రను వక్రీకరించొద్దు. కుహనా లౌకిక వాదంతో.. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నారు.

ఏడ్చిన వాళ్ల కళ్లు తుడిచినట్లు.. పబ్లిక్ గార్డెన్ లో కార్యక్రమం చేసి చేతులు దులుపుకున్నారు. ఏరకంగానైతే.. 15 ఆగస్టు, 26 జనవరి నిర్వహిస్తామో.. అలాగే సెప్టెంబర్ 17ను కూడా రాష్ట్రవ్యాప్తంగా వైభవోపేతంగా జరపాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విముక్తి ఉత్సవాలు జరిగితే.. తెలంగాణలో.. సమైక్యత పేరుతో కార్యక్రమాలా? నిన్న జరిగిన కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాం. చాలా అద్భుతంగా జరిగింది.

కేసీఆర్ కుటుంబానికి దేన్నీ అర్థం చేసుకునే సోయి లేదు. 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తికి.. సమైక్యతకు, విమోచనానికి తేడా తెలియదా? ప్రధానమంత్రి గారు.. మాట్లాడుతూ.. బీజేపీ మూడు రాష్ట్రాలను ఎలాంటి సమస్యలేకుండా విభజించింది. కానీ కాంగ్రెస్ అసమర్థత కారణంగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం.. పెప్పర్ స్ప్రేలు వాడేలా పరిస్థితి తలెత్తింది.. అని మాత్రమే అన్నారు.

ట్విట్టర్ లో మాత్రమే మాట్లాడతాను, ట్విట్టర్ లేకుంటే బతకలేను.. అనే వాళ్లకు వాస్తవాలు అర్థం కావు. ఆయన అమెరికా వెళ్లి నేర్చుకున్నది ట్విట్టర్ వాడటం ఒక్కటే కావొచ్చు.

LEAVE A RESPONSE