రాష్ట్రంలో ప్రతి ఏటా కార్డియాక్ అరెస్ట్ తో 24 వేల మంది చనిపోతున్నారు

– సగటున రోజుకి 4000 మంది చనిపోతున్నట్లు అంచనా
– సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయడం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యం అవుతుంది
– మొదటి దశలో 18 కోట్లతో 1200 ఏఈడీ మిషన్లు కొంటాము
– కేసీఆర్‌ , ఒక గొప్ప ఆలోచన చేసి సీపీఆర్‌ ట్రైనింగ్‌ ప్రారంభించారు
– టీ డయాగ్నొస్టిక్ ద్వారా ఉచితంగా పరీక్షలు
– దేశం ఇప్పుడు డయాబెటిస్ హబ్ గా మారింది
– సంవత్సరానికి 5 ప్రాణాలు కాపాడినా.. 5 కుటుంబాలను కాపాడినట్టే

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణా కార్యక్రమాన్ని మేడ్చల్ లోని జీవీకే, ఈఎంఆర్ఐ వేదికగా ప్రారంభించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు , మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..
ఈ శిక్షణ ఆలోచన కేటీఆర్ గారిది, వారి మామగారు చనిపోయినపుడు అక్కడికి వెళ్తే చెప్పారు. సీపీఆర్ తెలిసిన వారు లేక ప్రాణాలు కొలోయారు అని చెప్పారు. ఎంతో బాధ అనిపించింది. అప్పుడు జరిగిన చర్చలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని అనుకున్నాం. కేటీఆర్ గారికి ధన్యవాదాలు. సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయడం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యం అవుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గుండెలు ఆగిపోతున్నాయి. సడెన్‌ కార్డియాక్‌ అరెస్టులు (ఎస్‌.సి.ఎ), హార్ట్‌ స్ట్రోక్‌లు పెరుగుతున్నాయి. ఇది ఎంతో ఆలోచించాల్సిన విషయం. మన కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం. సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల మన దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. సగటున రోజుకి 4000 మంది చనిపోతున్నట్లు అంచనా. అయితే సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయడం వల్ల చనిపోయే వారి సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కార్డియాక్ అరెస్ట్ అయిన ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు. సి పి ఆర్ సకాలంలో చేస్తే కనీసం 5 మందిని బతికించుకునే అవకాశం ఉంటుందని ప్రపంచ అరోగ్య సంస్థ, ఇతర సంస్థలు చెబుతున్నాయి.

జిమ్‌ చేస్తూ, పనులు చేస్తూ, డ్యాన్స్‌ చేస్తూ, నడుస్తూ కొంత మంది సడెన్‌గా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు సోషల్‌ మీడియా, టీవీల్లో చూస్తున్నాం. ఇవి సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కేసులే. సీపీఆర్‌ తెలిసిన వారు ఉంటే సీపీఆర్‌ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా కార్డియాక్ అరెస్ట్ తో 24 వేల మంది చనిపోతున్నారు అనేది అంచనా. సి పి అర్ శిక్షణ విస్తృతంగా చేస్తే ఇందులో కనీస సగం మంది ప్రాణాలు కాపాడవచ్చు. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్‌ చేసేందుకు చదువు అవసరం లేదు, మెడికల్‌ పరిజ్ఞానం అవసరం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఎవ్వరైనా సీపీఆర్‌ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. కొంత అవగాహన, కొంత సమయ స్ఫూర్తి. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ విస్తారించలన్నదే ప్రభుత్వం ప్రయత్నం. వైద్యారోగ్య, పోలీసు, మున్సిపల్, పంచాయత్ రాజ్ అందరికీ శిక్షణ ఇస్తున్నాం. గేటేడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ, వాచ్ మెన్, అసోసియేషన్, బస్తీల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, పంచాయతీల్లో, మున్సిపాలిటిల్లో ఇలా అందరికీ శిక్షణ ఇస్తాం. గ్రామ ప్రాంతాల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది ఇలా అందరికీ శిక్షణ ఇస్తాం. కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోవడం చూస్తే మనసు కలిచి వేస్తున్నది. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, చెడు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలు గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి. కరోనా తర్వాత కార్డియాక్ అరెస్టులు పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైక్లాజికల్‌ షాక్స్‌కి గురవుతాడు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుంది. గుండె లయ తప్పి ఆగిపోతుంది.

ఈ సమయంలో మనిషి స్పందించడు, శ్వాస ఆగిపోతుంది. ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె మరియు ఊపిరితిత్తులు తిరిగి పని చేస్తాయి. దీన్నే సీపీఆర్‌ అంటారు. దీన్ని తెలుగులో హృదయ శ్వాస పునరుద్ధరణ అంటారు. ఇంత చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదు ఆ సమయంలో ఆటోమేటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డెఫిబ్రిలేటర్స్‌ – ఏఈడీ అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుంది. మొదటి దశలో 18 కోట్లతో 1200 ఏఈడీ మిషన్లు కొంటాము. అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో నెల రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నాం. ఇక ముందు అపార్ట్మెంట్, గేట్డ్ కమ్యూనిటీ, మాల్స్, బస్టాండ్లకు పర్మిషన్ ఇవ్వాలంటే ఏ ఇ డి విధిగా పెట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. ఆయా శాఖలకు వైద్యారోగ్య శాఖ తరుపున లేఖ రాస్తం.

రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక వ్యక్తికి సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ అయితే, అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి అతని ప్రాణాలు కాపాడారు. అదే విధంగా, ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చేందుకు వరంగల్‌ కలెక్టరేట్‌కు వచ్చి, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వ్యక్తికి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ తక్షణం స్పందించి సీపీఆర్‌ చేసి ప్రాణం కాపాడారు. వీరిద్దరి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనర్ లు జిల్లాల్లో కలెక్టర్ల అధ్వర్యంలో అన్ని శాఖల సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అన్ని శాఖల సహకారం, ప్రజా ప్రతినిదుల సహకారం కావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ , ఒక గొప్ప ఆలోచన చేసి సీపీఆర్‌ ట్రైనింగ్‌ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యం రంగాన్ని పటిష్టం చేయడంతో పాటు, ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ క్యూర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నది.మనం ఆరోగ్యంగా ఉండాలంటే పీల్చే గాలి, తీసుకునే ఆహారం, తాగే నీరు శుధ్దంగా ఉండాలి.

హరిత హారం ద్వారా స్వచ్ఛమైన గాలిని, మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగు నీటిని, మిషన్‌ కాకతీయ ద్వారా ఉపరితల జలాలతో పండిన నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నది. ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడుతున్నది. ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం చెడిపోతే తిరిగి సాధారణ స్థితికి చేరుకోవవడం ఎంతో కష్టం. చెడిపోయిన అవయవాలు బాగు చేసుకోవడం అంత కంటే కష్టం. కాబట్టి ఆరోగ్యంగా ఉందాం. మంచి ఆహార అలవాట్లు, జీవన శైలిని పాటిద్దాం. శారీరక, మానసిక ఉల్లసాన్నిచ్చే వాకింగ్‌, వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి అలవాటు చేసుకుందాం.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…
సీఎం కెసిఆర్ నాయకత్వంలో, మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య రంగం అద్భుతంగా ముందుకు పోతున్నది. ప్రాథమిక స్థాయిలో బస్తి దావాఖనలు మొదలు.. సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్ళ వరకు వరకు ఉత్తమ వైద్య సేవలు అందుతున్నాయి.టీ డయాగ్నొస్టిక్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగింది. ఆసుపత్రి ప్రసవాలు పెరగడం, మాతా శిశు మరణాలు వంటి సూచిల్లో మనం మెరుగు పడడమే ఇందుకు నిదర్శనం. విదేశాల్లో సంవత్సరానికి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకుంటారు. కానీ మన దగ్గర మాత్రం ఆరోగ్య సమస్య వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇది సరైన పద్ధతి కాదు. శారీరక శ్రమ తగ్గడం, జీవన శైలి మారడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరిగాయి.
మన దేశం ఇప్పుడు డయాబెటిస్ హబ్ గా మారింది. గుండె పోట్లు పెరిగాయి.
• నాకు తెలిసి ఇందుకు రెండు కారణాలు…
1. జీవన శైలి మారడం
2. గుండె పోటు వచ్చినప్పుడు ఏం చేయాలో అవగాహన లేకపోవడం.
ఇటీవల మా మామ గారు కూడా గుండె పోటుతో మరణించారు.
మంత్రి హరీష్ రావు గారితో ఓ సందర్భంలో ఈ విషయం గురించి మాట్లాడితే.. సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా డి-ఫైబ్లేటర్స్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు గారిని కోరుతున్నాను. హైదరాబాద్ లో కనీసం లక్ష మందికి ట్రైనింగ్ ఇవ్వాలి. సంవత్సరానికి 5 ప్రాణాలు కాపాడినా.. 5 కుటుంబాలను కాపాడినట్టే. ఈ విషయంలోనూ తెలంగాణ భారత దేశానికి ఆదర్శంగా నిలవాలి.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగం ఎంతో మెరుగు పడింది. 4 టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ నిర్మిస్తున్నారు. ఇలా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కెసిఆర్ ది. సి పి ఆర్ కార్యక్రమం అందరం కలిసి విజయవంతం చేద్దాం. సీఎం కేసీఆర్ మంచి కార్యక్రమం చేస్తున్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, TSMSIDC ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డిహెచ్ శ్రీనివాస్ రావు, TSMSIDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జీవీకే ఇఎంఆర్ఐ డైరెక్టర్ కృష్ణం రాజు, మేడ్చల్ జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply