– 30 వైద్య బృందాలు, అంబులెన్సులు, 3 తాత్కాలిక ఆసుపత్రులు
– ఎమెర్జెన్సీ స్పందనకు అన్ని ఏర్పాట్లు
– వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: ప్రధాని సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సభకు హాజరయ్యే ప్రముఖులు, అతిథులు, ప్రజానీకం అవసరార్ధం వైద్య సేవలందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ వైద్యులు, స్పెషాలిటీ వైద్యులతో కూడిన 30 వైద్య బృందాల్ని వివిధ పాయింట్లలో నియమించారు.
అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్స్ తో కూడిన 6 అంబులెన్సులు, బేసిక్ లైఫ్ సిస్టమ్స్ కూడిన మరో 21 అంబులెన్సులు వివిధ చోట్ల అందుబాటులో ఉంటాయి. అంబులెన్సులతో కూడిన వైద్య బృందాలు విమానాశ్రయం, హెలీప్యాడ్, కాన్వాయ్ మార్గం, గ్యాలరీలు మరియు పార్కింగ్ ప్రాంతాల్లో సేవలందిస్తారు. వీటితో పాటు సభాస్థలి ప్రాంతంలో ఒక్కోటి 10 పడకలతో కూడిన 3 ఆసుపత్రులను కూడా వైద్య,ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది.
వైద్య సేవల ఏర్పాట్లను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులతో రెండు సార్లు సమీక్షించారు.
ఏర్పాట్ల వివరాలు
విమానాశ్రయం, హెలిప్యాడ్ ల వద్ద అవసరాల మేరకు సేవలందించడం, విఐపి కాన్వాయ్ లను అనుసరించే అంబులెన్సులతో కూడిన వైద్య బృందాలతో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో 11 వైద్య నిపుణుల బృందాలు సేవలందిస్తాయి. ప్రతి పార్కింగ్ ఏరియాకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనంగా 20 మెడికల్ క్యాంపులను కూడా అందుబాటులో ఉంచారు.
వివిఐపి పార్కింగ్ ప్రాంతంలో ఒకటి, పబ్లిక్ గ్యాలరీస్ కు సమీపంలో రెండు తాత్కాలిక ఆసుపత్రుల్ని ఏర్పాటు చేస్తున్నారు. 10 పడకలతో కూడిన ఈ ఆసుపత్రులలో కార్డియాక్ డిఫిబ్రిలేటర్, గ్లూకో మీటరు, ఇసిజి మెషీన్, ఆక్సిజన్ సిలిండర్, నెబ్యులైజర్ వంటి 11 పరికరాలతో పాటు మందులు అందుబాటులో ఉంటాయి.
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సభకు హాజరయ్యే వారికి మజ్జిగ, ఒఆర్యస్ ద్రావకం ప్యాకెట్లను అందించడానికి ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కూడిన 31 బృందాల్ని నియమించారు.