– ప్రధాని మోడీ అమరావతి పునరాగమనం రాష్ట్ర పునర్వికాసానికి శంఖారావం
– ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి పునర్వికాసానికి సంబంధించి పలు ప్రాజెక్టులకు పునాదిరాయి వేయడానికి శుక్రవారం నాడు రాష్ట్ర రాజధానికి వస్తున్నందుకు రాష్ట్ర ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుతున్నాయి. ఆయన పునరాగమనం రాష్ట్ర పునర్వికాసానికి శంఖారావం లాంటిదని ప్రజలు భావిస్తున్నారు.
అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణానికి 2015లో ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపన చేయగా అప్పటి కూటమి ప్రభుత్వం ఎన్నో అవాంతరాల్ని దాటుకుని రాష్ట్ర నవ్య రాజధాని నిర్మాణానికి పలు ప్రాజెక్టుల్ని చేపట్టింది. తద్వారా రాష్ట్ర ప్రజలు కట్టుకున్న ఆశా సౌధాన్ని 2019లో అధికారంలోకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కసితో, క క్షతో విధ్వంసం చేసి ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు తిలోదకాలిచ్చి, వారిని తీవ్ర నిరాశానిస్పృహలకు గురి చేశారు.
ఐదేళ్ల పాటు నిర్ద్వందంగా సాగిన విధ్వంసకాండకు బెంబేలెత్తిన రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో భారీ స్థాయిలో కూటమికి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నారు. రాష్ట్రంలో 2014లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం నిర్మించదలచి… జగన్ కారణంగా ఆగిపోయిన రాజధాని పునర్నిర్మాణ విషయం గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పులో అంతర్భాగమనేది సుస్పష్టం.
ఈ సందేశానికనుగుణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారంనాడు అమరావతికి వస్తూ…నవ్య రాజధాని పునర్నిర్మాణానికి తాను అండగా ఉంటానంటూ స్పష్టమైన సంకేతాల్ని రాష్ట్ర ప్రజలకిస్తున్నారు. అందుకు ప్రధాని మోడీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
పాకిస్తాన్ తో సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలు ఉన్నతస్థాయి సమావేశాలతో తీరికలేకుండా ఉన్నప్పటికీ ప్రధాన మంత్రి మోడీ అమరావతికి రెండో సారి రావడం గమనార్హం. దీంతో రాష్ట్ర ప్రజలపై ఆయనకున్న మక్కువ, అమరావతి పునర్నిర్మాణం పట్ల ఆయన నిబద్ధతను స్పష్టమవుతున్నాయి.
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రాష్ట్ర ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు.
మే2న రాజధాని నిర్మాణంతో పాటు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన దాదాపు లక్షకోట్ల రూపాయల పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన/ ప్రారంభోత్సవాలు చేయడంతో రాష్ట్ర వికాసంలో ఒక నూతన శకం ప్రారంభం కానున్నదని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ జైత్ర యాత్రను మరోసారి అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.