సునాయాస మరణంపై ఇంటర్నెట్‌లో వెతికిన ప్రత్యూష..

హైదరాబాద్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (36) కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చిన ప్రత్యూష పది రోజుల ముందుగానే అందుకు మానసికంగా సిద్ధమయ్యారు. అయితే, నొప్పి తెలియకుండా సునాయాసంగా ఎలా చనిపోవాలన్న దానిపై ఇంటర్నెట్‌లో వెతికి వివరాలు సేకరించారు. కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం ద్వారా ఎలాంటి బాధ లేకుండా చనిపోవచ్చని తెలుసుకుని అది కొనుగోలు చేశారు. దానిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకోవడం కుదరదని భావించిన ప్రత్యూష అందుకు తన బొటిక్‌ను సరైన ప్లేస్‌గా ఎంచుకున్నారు. ఆత్మహత్యకు వారం రోజుల ముందు బాత్రూంలోని కిటికీలు, ఎగ్జాస్టర్ ఫ్యాన్ ప్రాంతాన్ని మూయించేసినట్టు పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఉదయం రెండుసార్లు బయటకు వెళ్లిన ఆమె సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో తిరిగి వచ్చారు.

ఆ సమయంలో ఆమె వద్ద పనిచేసే దుర్గ.. తాను కిరాణా దుకాణానికి వెళ్తున్నానని ప్రత్యూషకు చెప్పారు. వెళ్లమని చెప్పిన ఆమె పని ఉంటే పిలుస్తానని, లోపలికి రావొద్దని చెప్పి పంపించారు. ఆ తర్వాతి రోజు ఉదయం గది నుంచి ప్రత్యూష బయటకు రాకపోవడంతో దుర్గ దంపతులు తలుపు తట్టినా తీయలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యూష తండ్రి, డ్రైవర్ వచ్చినట్టు దుర్గ, ఆమె భర్త వీరబాబు పోలీసులకు తెలిపారు.

ప్రత్యూష గది నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌ను ఆమే రాసినట్టు పోలీసులు నిర్ధారించారు. గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న ఆమె బయటపడే మార్గం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. స్నేహితులు, సన్నిహితుల వద్ద ప్రత్యూష తన నిరాశను వ్యక్తం చేసినా.. ఆమె తీవ్ర మానసిక ఘర్షణకు గురవుతున్న విషయాన్ని వారు గుర్తించలేకపోయారని పోలీసులు భావిస్తున్నారు. చివరికి తాను కోరుకున్న జీవితం ఇది కాదని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె లేఖ ద్వారా పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.

Leave a Reply