– ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ కమిషనర్గా నియామకం
– ఫలించిన న్యాయ పోరాటం
– కోర్టు ధిక్కరణకు వెళ్లే సమయంలో పోస్టింగ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
డీజీపీ స్థాయి సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకూ పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ డిపార్టుమెంట్ కమిషనర్గా నియమిస్తూ బుధవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ ఉత్తర్వులుజారీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న జి.విజయకుమార్ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. దీనితో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ, ఏబీ గత కొద్దికాలం నుంచి ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం ఫలించినట్టయింది. ఇది కూడా చదవండి: ఏబీ సస్పెన్షన్ ఎత్తేశారు..ఏం సాధించినట్లు?
నిజానికి ప్రభుత్వం తనకు నచ్చని అధికారులకు మూడు అప్రాధాన్యమైన పోస్టింగులు ఇస్తుంటుంది. అందులో ఒకటి ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ కమిషనర్ అయితే, రెండోది గోదావరి వ్యాలీ డెవలెప్మెంట్ అథారిటీ కమిషనర్. మూడవది రోడ్ సేఫ్టీ అథారిటీ కమిషనర్ పోస్టింగు. ఈ విభాగాల్లో పెద్దగా పనేమీ ఉండదు. బాగా పనిచేసే అధికారులయినప్పటికీ, ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా లేనివారినే ఈ విభాగాల్లో నియమిస్తుంటారు. ఒకరకంగా ఇది పనిష్మెంట్ పోస్టుగానే భావిస్తుంటారు. ఇది ఏ ప్రభుత్వంలోనయినా జరిగేదే.
ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ కమిషనర్కు పెద్దగా బాధ్యతలు లేవు. అధికారాలూ లేవు. ఉమ్మడి రాష్ట్రంలో చంచల్గూడలో ప్రింటింగ్ కార్యాలయం ఉన్నప్పటి నుంచే , దాని పరిథి తగ్గిస్తూ వచ్చారు. గవ్నరమెంట్ బుక్స్ ప్రింటింగును ప్రైవేటుకు అప్పగించిన తర్వాత, ఈ విభాగానికి పెద్దగా పనిలేకుండా పోయింది. ప్రస్తుతం గవ్నరమెంట్ లెటర్ హెడ్స్, డైరీలు, క్యాలెండర్లు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ కాపీలు మాత్రమే ప్రింటింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా, ఈ విభాగానికి కమిషనర్గా బాధ్యతలు తీసుకోనున్న డీజీపీ స్ధాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన న్యాయపోరాటం, దేశంలోని పోలీసు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సస్పెన్షన్లకు సంబంధించి ఏబీవీ కేసు తీర్పు, ఇకపై ఉదాహరణగా తీసుకునే అవకాశం ఏర్పడింది. రెండేళ్ల పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన ఏబీవీ శ్రమకు ఎట్టకేలకూ ఫలితం దక్కింది. ఆయనకు ఇలాంటి అప్రాధాన్యపరమైన పోస్టింగు మాత్రమే దక్కుతుందని, ముందు నుంచీ ఊహించినదేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఇప్పటివరకూ ఏపీ, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో.. ప్రభుత్వాలకు తలవంచకుండా, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకువెళ్లడమే కాకుండా, చివరకు ముఖ్యమంత్రిని కూడా కలవని ఏకైక ఐపిఎస్ అధికారిగా ఏబీవీ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా తన వేతన వ్యవహారంపై సీఎస్కు రాసిన లేఖపై స్పందన రాని నేపథ్యంలో, దానిపై మరోమారు ఆయన కోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి:ఆడు మగాడ్రా బుజ్జీ!
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ మూడుసార్లు సీఎస్ వద్దకు వెళ్లి,(ఏబీకి మళ్లీ ఈ‘సారీ’..) తన పోస్టింగు అంశంపై లేఖ ఇచ్చినా సీఎస్ నుంచి స్పందన కనిపించలేదు. దానితో ఒకటిరెండు రోజుల్లో సీఎస్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసేందుకు సిద్ధమైన సమయంలో, ఏబీకి పోస్టింగ్ దక్కడం విశేషం.కాగా ఒకటి రెండు రోజుల్లో తాను విధుల్లో చేరతానని ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.