Suryaa.co.in

Andhra Pradesh

అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

– టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతున్నారు. ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం. జగన్ మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి పాలనను గాలికోదిలేశారు. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలతో ప్రజావ్యతిరేకతను అడ్డుకోలేరు. జగన్ రెడ్డి అవినీతిని, విధ్వంస పాలనను ప్రశ్నించిన వారిపై గతంలో వేల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేశారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికి కానీ.. ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపు చర్యల కోసం కాదు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించటం సిఐడి అధాకారులకు తగదు. రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ వైపు చెబుతున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో నారాయణను అరెస్ట్ చేశామని పోలీసులు లీకులు ఎలా ఇస్తారు. ఎపి సిఐడి అక్రమ కేసుల నమోదుకు అడ్డాగా మారింది.

ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లాంటి రాజకీయ జోకర్లు ఎపి సిఐడిని అక్రమ కేసులకు నిలయంగా మార్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలు అంటూ మరో అక్రమ కేసును తెరమీదకు తెచ్చారు. ఎలాంటి ప్రాధమిక విచారణ లేకుండా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ లాంటి ప్రముఖులపై రాత్రికి రాత్రి కేసు ఎలా నమోదు చేస్తారు? ప్రముఖ కంపెనులపై కేసులు నమోదు చేసి, కార్పోరేట్ వర్గాలను భయభ్రాంతులకు గురిచేయాలని సియం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. అక్రమ అరెస్ట్ ల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదు.

LEAVE A RESPONSE