కేసీఆర్.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించండి

– విద్యుత్ రేట్లపై రెఫరెండానికి సిద్ధమేనా?
– తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ

తెలంగాణ ప్రజలపై మోపిన విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇదీ..

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

నమస్కారం …
విషయం: పెంచిన విద్యుత్‌ చార్జీలను తక్షణం ఉపసంహరించండి లేదా ప్రభుత్వం రిఫరెండమ్‌కు సిద్ధం కావాలి

గత ఎనిమిదేండ్లుగా అసమర్థ విధానాలను అనుసరిస్తున్న మీ ప్రభుత్వం తెలంగాణా ప్రజలపై 6 వేల కోట్ల విద్యుత్‌చార్జీల భారాన్ని మోపింది. ఈ ప్రజా వ్యతిరేఖ చర్చను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలి. లేదా పెంచిన విద్యుత్‌ఛార్జీల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రిఫరండమ్‌కు సిద్ధం కావాలని డిమాండ్‌ చేస్తున్నాము. రిఫరెండమ్‌కు ప్రభుత్వం సిద్ధపడి ముందుకు రాకపోతే బిజెపి తెలంగాణశాఖ విద్యుత్‌చార్జీల పెంపుపై రిఫరెండమ్‌ నిర్వహిస్తుంది. దానికి మీరు సిద్దమా?

విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని, వినియోగానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే మీ ప్రభుత్వం మరి విద్యుత్‌ చార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో రాష్ట్రప్రజలకు చెప్పాలి. విద్యుత్‌ ఉత్పత్తిలో నిజంగా మిగులు రాష్ట్రమైతే ప్రజల నడ్డి విరిచి విద్యుత్‌ చార్జీలతో రాష్ట్ర ఖజానాను నింపుకునే చర్చలను విడనాడండి.

రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో అవి దివాలా తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రాష్ట్రం ప్రభుత్వం నుండి డిస్కంలకు చెల్లించాల్సిన 48 వేల కోట్ల బకాయిలు చెల్లించలేదు. డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.17వేల కోట్లు ఉంటే అందులో వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలే 12,598 కోట్ల వరకు ఉన్నాయి.

వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,603 కోట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం పాతబస్తీలో వసూళ్ళు కావాల్సిన బకాయిలే.
పాతబస్తీలో ఎం.ఐ.ఎంకు బయపడి వసూళ్ళు చేయడంలో మీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై పాతబస్తీలో యధేచ్ఛగా దాడులు జరుగుతున్నా మీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పాతబస్తీలోని ఉద్యోగస్తులకు తగిన రక్షన కల్పించి అక్కడ పాతబకాయిలను వసూలు చేయాలి.

విద్యుత్‌ సరఫరా తాలుకా సాంకేతిక నష్టాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఈ నష్టాలు 2015`16 లో 14.01 శాతం ఉండగా 2019`20 నాటికి 21.54 శాతానికి పెరిగాయి, దీనికి కారణం మీ అసమర్థత పాలనే.

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఇప్పుడున్న సాంప్రదాయ పద్ధతులు మినహా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలవైపు ఆలోచించడం లేదు. నిరుద్యోగ యువతను బృందాలుగా ఏర్పాటు చేసి, శిక్షణ ఇప్పించి సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రుణాలు ఇస్తే యువతకు ఉపాధి, రాష్ట్రానికి చౌకగా కరెంటు దొరుకుతుంది. అలా కాకుండా కమీషన్లకు కక్కుర్తి పడి అధిక ధరలకు ఇతర రాష్ట్రాలనుండి విద్యుత్‌ కొనుగోలు చేస్తే ఆ భారం రాష్ట్ర ప్రజలపై పడుతుంది.

రకరకాల పేరుతో పెంచిన 6 వేలకోట్ల విద్యుత్‌ ఛార్జీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని బిజెజి డిమాండ్‌ చేస్తోంది. విద్యుత్‌ చార్జీల తగ్గింపు విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్‌కు కరెంట్‌ షాక్‌ ఇస్తారని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం విద్యుత్‌ఛార్జీలు తగ్గించకపోతే శాంతియుతంగా గాంధేయపద్ధతిలో ప్రజలతరుపున విద్యుత్‌చార్జీలు తగ్గించేవరకు బిజెపి ప్రజలపక్షాన నిలబడి పోరాటం చేస్తోంది.

అభినందనలతో …
బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి.

Leave a Reply