-పోలింగ్ బూత్ కు రాలేని వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు అవకాశం
-వాళ్ల ఇంటి వద్దకే బ్యాలెట్ తీసుకెళ్లి ఓటు నమోదు చేసుకుంటున్న అధికారులు
-కర్ణాటక ఎన్నికలతో ప్రయోగం
-ఫలిస్తే ఇక దేశమంతటా అదే విధానం?
కరోనా పుణ్యాన వర్క్ ఫ్రం హోం అనే మాట విన్నాం. కానీ ఓట్ ఫ్రం హోం అనే మాట ఎప్పుడైనా విన్నారా? లేదు కదా! ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా వచ్చేసింది. అంటే ఇంటి దగ్గరే ఉండి ఎంచక్కా ఓటు వేసుకోవచ్చన్నమాట. హలో.. ఇది అందరికీ కాదండోయ్. వృద్థులు, దివ్యాంగులు, జర్నలిస్టుల కోసం పెట్టిన సౌకర్యం! భారతదేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా, భారత ఎన్నికల కమిషన్ కర్నాటక ఎన్నికల్లో ఈ ప్రయోగం చేయబోతోంది. ఇది సక్సెస్ అయితే, ఇక అన్ని రాష్ట్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చేస్తుందన్న మాట. ఇక వివరాల్లోకి వెళదాం రండి.
మన దేశంలో ఏ ఎన్నికల్లో అయినా ఓటర్లు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇస్తారు. కానీ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి దేశ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల ఇంటి వద్దకే వెళ్లి పోలింగ్ నిర్వహించే ‘ఓట్ ఫ్రం హోమ్’ విధానం కర్ణాటకలో నిన్న ప్రారంభమైంది.
కర్ణాటక అసెంబ్లీకి మే 10న జరిగే పోలింగ్ జరగనుంది. అయితే, పోలింగ్ కేంద్రానికి రాలేని 80 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు తమ తమ ఇళ్ల నుంచే ఓటు వినియోగించుకునే కొత్త సంప్రదాయానికి ఎన్నికల కమిషన్ ఈసారి తెలరేపింది. ఇంటివద్దనే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చింది. ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఇలాంటి అవకాశం కల్పిస్తున్నారు.
ఈ క్రమంలో నిన్నటి నుంచి వారికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభైంది. తొలి రోజు ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ పోలింగ్ ప్రక్రియ మే 6 వరకు జరగనుందని తెలిపింది. ఇలా ఇంటి నుంచి ఓటు వినియోగించుకునే వృద్ధులు 80,250 మందిని, దివ్యాంగ ఓటర్లు 19,279 మందిని గుర్తించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.