ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయకు మంత్రి హరీశ్‌రావు లేఖ

ఆయుష్మాన్‌ భారత్‌- హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్లలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు సైతం అవకాశం కల్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయకు లేఖ రాశారు.

ప్ర‌స్తుత నిబంధ‌న‌ల ప్ర‌కారం బీఎస్సీ కమ్యూనిటీ హెల్త్‌ లేదా బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం తోపాటు ఇగ్నో/మెడికల్‌ వర్సిటీ నుంచి ప్రత్యేక కోర్సు చేసిన ఆయుర్వేద డాక్టర్లు మాత్రమే ఎంఎల్ హెచ్‌పీ పోస్టుల‌కు అర్హులు. ఈ నిర్ణయం మిగతా అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని మంత్రి హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు.నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్స్‌ ఆఫ్‌ మెడిసిన్‌, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ హోమియోపతి ప్రకారం బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌, బీహెచ్‌ఎంఎస్ కోర్సులు మెడిసిన్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులేనని, వాటి కాలవ్యవధి, అర్హత కూడా సమానమేనని స్పష్టంగా ఉన్నదని మంత్రి గుర్తు చేశారు.

కేంద్రం ఆయుర్వేద అభ్యర్థులకు మాత్రమే అవకాశం క‌ల్పించి, సమాన అర్హత ఉన్న ఇతర కోర్సుల అభ్యర్థులను విస్మరించడం సరికాదన్నారు. కాబట్టి నిబంధనలను సవరించాలని, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌, బీహెచ్‌ఎంస్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు సైతం ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు అర్హత కల్పించాలని కోరారు.

Leave a Reply