Suryaa.co.in

Andhra Pradesh

పట్టణాలలో మళ్లీ పెరిగిన ఇంటి పన్నులు

– 320 కోట్ల రూ… పైగా భారం
– ఐదు సంవత్సరాలలో 100% పెంపు
– పన్ను పెంచబోమని మాట ఇచ్చి, తప్పిన కూటమి ప్రభుత్వం
– గుట్టు చప్పుడు కాకుండా పన్ను పెంపు
– ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం చట్టం, జీవో రద్దు చేయాలి
– ఆస్తి పన్ను పెంపుపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన
– ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సిహెచ్.బాబూరావు

అమరావతి : 2025 _ 26 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో ఆస్తి( ఇంటి) పన్నును గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం పెంచింది. గత సంవత్సరంతో పోల్చితే 15%, 2020_21 సంవత్సరంతో పోలిస్తే 30% ఇంటి పన్ను పెరిగింది. దీనివల్ల 320 కోట్ల రూపాయల భారం గృహ యజమానులపై పడుతుంది.

2020 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి నాటి వైసిపి ప్రభుత్వం అద్దె విలువ ఆధారిత పన్ను విధానం స్థానంలో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. చట్ట సవరణ చేసింది, దానికనుగుణంగా జీవో 198 విడుదల చేసింది.

ప్రతి సంవత్సరం 15% పన్ను పెంచే విధంగా ఆదేశాలు ఇచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 15% పన్ను పెంచుతూ వచ్చారు. దానిపై పౌర సంఘాలు ఎన్నో ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం లెక్క చేయలేదు.

ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్నులు పెంచబోమని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరంలో కూడా పన్ను పెంపు కొనసాగింది. 2024 ఏప్రిల్ నుండే పన్నులు పెరిగినందున, ఆ సంవత్సరం తగ్గించలేకపోయామని కూటమి ప్రజాప్రతినిధులు ప్రకటించారు.

ఈ సంవత్సరం పన్నుల పెంపుదల ఉండదని ప్రజలందరూ భావించారు. కానీ 25 _26 ఆర్థిక సంవత్సరానికి గుట్టు చప్పుడు కాకుండా పన్నులు పెంచడం శోచనీయం. ఆన్ లైన్ లో పన్ను పెంచుతూ డిమాండ్ రూపొందించారు. కూటమి ప్రభుత్వం మాట తప్పింది, ప్రజలకు నమ్మకద్రోహం చేసింది.

ప్రజలు భారాలు మోయలేని స్థితిలో ఉన్నారని, భారాలు వేయబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ప్రకటించారు. కానీ దానికి భిన్నంగా ఒకేసారి 320 కోట్ల రూపాయల భారం వేయటం గర్హనీయం.

2020-21 సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికీ 100% పన్నులు పెరిగాయి. గతంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పన్ను పెంపుదల ఉండేది. కానీ 5 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పన్నులు పెంచడం దుర్మార్గం.

దానికి తోడు ప్రతి సంవత్సరం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ విలువల కొరకు భూముల విలువలను ప్రభుత్వం పెంచుతున్నది. దీని ఆధారంగా ఇంటి పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఈ పన్నుల పెంపు భారం గృహ యజమానులపైనే కాకుండా పరోక్షంగా అద్దెదారులపై కూడా పడుతుంది.

మరోవైపు కొత్తగా ఇళ్ళు, భవనాలు నిర్మించుకునేవారు, గదులు అదనంగా కట్టుకునే వారిపై పూర్తి ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేస్తున్నారు. సవరిస్తున్నారు. దీంతో మరింత భారం పడుతున్నది.

ప్లాన్ ప్రకారం ఇళ్ల నిర్మాణాలు జరగలేదని, అదనపు కట్టడాలు నిర్మాణం జరిగాయని పేరు చెప్పి,BRS లో రెగ్యులరైజ్ అయిన వాటిని అక్రమ కట్టడాలుగా గుర్తించి ఇంకా అదనంగా 50% పన్ను వేస్తున్నారు. ఈ రూపంలో 100 % నుండి 500% వరకు కొన్ని పట్టణాల్లో కొంతమందికి పన్నులు పెరిగాయి.

అదానీ పోర్టులు,పరిశ్రమలు, ఇతర కార్పొరేట్ కంపెనీలకు పూర్తిగా ఆస్తి పన్ను ప్రభుత్వం రద్దు చేస్తున్నది. కొత్తగా పెట్టే పరిశ్రమలకు అనేక సంవత్సరాలపాటు పన్ను రాయితీలు ఇస్తున్నారు. ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలకు మాత్రం పన్నులు తగ్గించకపోగా, పెంచడం దుర్మార్గం.

దీనికి తోడు ఒక నెల ఆలస్యమైనా 24 శాతం వడ్డీ.. పెనాల్టీ రూపంలో వసూలు చేయటం అన్యాయం. 30 శాతం వరకు ఇంటి పన్ను పెంచి ఈ నెలాఖరు లోపల పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం మోసపూరితము.

పన్ను పెంచిన విషయం మరుగుపరిచి ,ఐదు శాతం రాయితీ గురించి చెప్పటం వంచించటమే. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పెంచిన పన్ను రద్దు చేయాలి. విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం పూర్తిగా చట్టం 44/2020, జీవో 198 రద్దు చేయాలి. హామీ నిలబెట్టుకోవాలి.

పలు పట్టణాల్లో గత నాలుగైదు ఏళ్లలో అడ్డగోలుగా పెంచిన పన్నులపై సమీక్ష చేయాలి. గతంలో జరిగిన తప్పులను సవరించాలి.

 

 

LEAVE A RESPONSE