Suryaa.co.in

Andhra Pradesh

కుటుంబసభ్యులే నమ్మని జగన్ ను 5 కోట్ల మంది ప్రజలెలా నమ్మాలి?

-ప్రజాప్రభుత్వం వచ్చాక విశాఖను ఐటి రాజధానిగా అభివృద్ధి చేస్తాం!
-5 కోట్ల మంది ఆంధ్రులు గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మిస్తాం!
-కూల్చడం మా బ్లడ్ లో లేదు, రుషికొండను ప్రజావసరాలకే వినియోగిస్తాం
-ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ సొమ్మంతా ఏ పందికొక్కులు తిన్నాయో చెప్పాలి
-విజయనగరం యువగళం సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

విజయనగరం: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటి రాజధానిగా తీర్చిదిద్దుతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయనగరం ఎంఆర్ స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన యువగళం సభలో యువనేత పాల్గొన్నారు. కార్యక్రమానికి జర్నలిస్టు గోపి యాంకర్ గా వ్యవహరించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…. అధికారంలోకి వచ్చాక మూడునెలలకే జగన్ మూడు ముక్కలాట మొదలెట్టారు. కర్నూలు న్యాయరాజధాని, ఉత్తరాంద్రకు పరిపాలన రాజధాని, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి అన్నారు. కర్నూలులో ఒక్క ఇటుకలేదు, అమరావతిని సర్వనాశనంచేశాడు. విశాఖ పట్నంలో ఒక్క భవనమైనా కట్టారా? రుషికొండకు గుండుకొట్టి ఒక్క వ్యక్తి బతకడానికి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ డబ్బుతో విజయనగరం జిల్లాలో పేదలందరికీ ఇళ్లు నిర్మించే అవకాశం ఉండేది. నిబంధనలు ఉల్లంఘించి రుషికొండలో కట్టిన ప్యాలెస్ కు కేంద్రం 200 కోట్ల పెనాల్టీ కూడా విధించింది.

మొత్తం 700 కోట్లు దుర్వినియోగం చేశారు. రాష్టపతి భవనానికి కూడా అంత ఖర్చుపెట్టలేదు. కూల్చడం టిడిపి బ్లడ్ లో లేదు. చంద్రబాబుకు కట్టడమే తెలుసు, కూల్చడం తెలియదు, ఎప్పుడు నిర్మాణాలు చేయాలి, పిల్లల భవిష్యత్ మార్చాలని ఆలోచిస్తారు, బిడ్డల జీవితాలు మార్చాలని ఆలోచించేవ్యక్తి చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక ముందు రుషికొండ ప్యాలెస్ లో ఏం ఉందో పరిశీలించి, దేనికి ఉపయోగించాలో నిర్ణయిస్తాం.

ఆగిపోయిన పనులన్నీ ప్రారంభిస్తాం
చంద్రబాబుగారు అసెంబ్లీ సాక్షిగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో అమరావతి రాజధాని చట్టం తెచ్చారు. అదే సభలో జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి సిద్ధంగా లేను, అమరావతికి మద్దతు తెలుపుతున్నానని చెప్పి, 30వేలఎకరాల్లో రాజధాని కట్టాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ కూడా అమరావతి రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారు. సచివాలయం, అసెంబ్లీ, రోడ్ల నిర్మాణం చేపట్టాం. 2019లో రాష్ట్రప్రజలు ఒక్క అవకాశం మాయలో పడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ గానీ, ఒక్కరికి ఉద్యోగం గానీ వచ్చిందా? ఎక్కడ చూసినా భూకబ్జాలు, దోపిడీలు, ఇసుక, గంజాయి, డ్రగ్స్ మాఫియాలు, హత్యలు, మానభంగాలు.

పక్క రాష్ట్రాల పత్రికల్లో ప్రతిరోజూ పెట్టుబడుల వార్తలు వస్తున్నాయి. పాలనసౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది మా విధానం. అందులో భాగంగానే అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, కర్నూలులో రెన్యువబుల్, సిమెంట్, ఉత్తరాంద్రను ఐటికేంద్రంగా అభివృద్ధి చేయడానికి అడుగులు వేశాం. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావించి భూసేకరణ కూడా పూర్తిచేశాం. నెలలో మన ప్రభుత్వం వస్తుంది, ఆగిపోయిన పనులన్నీ ప్రారంభిస్తాం. అయిదుకోట్ల ఆంధ్రులు గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం.

పక్క దేశాల్లో కూడా చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేపడతాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తాం. అన్నిజిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు అంటే బ్రాండ్, జగన్ అంటే జైలు, చాలామంది వెయిటింగ్ లో ఉన్నారు. మేం వచ్చాక మొదటివందరోజుల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఐటిమంత్రిగా ఉన్నపుడు విశాఖకు పరిశ్రమలు తెచ్చాను. ఈసారి ఎక్కువ ఉద్యోగాలు కల్పించేవారికి ఇన్సెంటివ్స్ ఇస్తాం. స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం.

కుటుంబసభ్యులే వైసిపి నేతలను నమ్మడంలేదు
జగన్ ఒక బిల్డప్ బాబాయి, వెయ్యికోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి నువ్వే మా నమ్మకం అని బోర్డులు పెట్టారు. కుటుంబసభ్యులే ఆయనను నమ్మడం లేదు, వైసిపి నాయకులకు వారి కుటుంబసభ్యులు నమ్మడం లేదు. హత్యారాజకీయాలు చేసిన అన్నను నమ్మవద్దని చెల్లి సునీత చెప్పింది. జగన్ కు ఓటువేస్తే మా కుటుంబానికి పట్టిన గతే రాష్ట్రానికి అని చిన్నమ్మ సౌభాగమ్మ చెప్పింది, జగనన్న ఊసరవెల్లి అని చెల్లెమ్మ షర్మిల చెప్పింది, వైఎస్ విజయలక్ష్మి కూడా భయపడి అమెరికా వెళ్లిపోయింది. కుటుంబసభ్యులే నమ్మని జగన్ ను ప్రజలు ఎలా నమ్మాలి? అంబటి రాంబాబు నీచుడు, దుర్మార్గుడు అని ఆయన అల్లుడు చెప్పారు.

సొంత కొడుకుకే న్యాయం చేయలేదని ముత్యాలనాయుడు కుమారుడు చెప్పాడు. ముద్రగడ గారి కూతురు మీడియా ముందు వైఎస్ జగన్ మా తండ్రిని ట్రాప్ లో పడేశారని, వాడుకుని వదిలేస్తాడని చెప్పింది. దువ్వాడ శ్రీను భార్య తన భర్తకు ఓటువేయద్దని చెప్పింది. జగన్, వైసిపి నాయకులను వారి కుటుంబసభ్యులు నమ్మడం లేదు. 5కోట్ల మంది ప్రజలు ఎలానమ్మాలి?

జగన్ పాలనలో తొలిబాధితులు యువతీయువకులే!
జగన్ కు ఎంటర్ ప్రెన్యూర్ అంటే తెలియదు. ఆయన సిఎం కావడంవల్లే యువత ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. 2014లో ఎపి విభజన జరిగింది. రాజధాని లేని రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించి, అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ నిర్మించాం. రాష్ట్రానికి 15లక్షల కోట్లు పెట్టుబడులు, 35లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు కుదుర్చుకుని, 6లక్షల ఉద్యోగాలిచ్చాం. 2019లో ఒక్క అవకాశం మాయమాటలో పడి మోసపోయాం. జగన్ పాలనలో యువతీ యువకులే మొదటి బాధితులు, అధికారంలోకి వచ్చాక 2.3లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నాడు. ఒక్క ఉద్యోగం ఇచ్చాడా?

పిల్లలు కాలేజిల నుంచి బయటకువచ్చే సమయానికి ఉద్యోగాల్లేవు. ప్రతిఏటా కానిస్టేబుల్ పోస్టులు అన్నాడు, ఒక్క పోస్టు లేదు, స్టడీసర్కిల్ రద్దు చేశాడు, ఫీ రీఎంబర్స్ మెంట్ లేదు, నిరుపేద విద్యార్థులకు విదేశీవిద్య కూడా రద్దు చేశాడు జగన్. జగన్ సిఎం అయ్యాక గతంలో తెచ్చిన పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అమర్ రాజా, లులూ, హెచ్ ఎస్ బిసి హైదరాబాద్ వెళ్లిపోయాయి. ఉత్తరాంద్రకు కోడిగుడ్డు తెచ్చాడు జగన్. ఐటి మంత్రిని కంపెనీలు అడిగితే కోడిగుడ్డు కథలు చెబుతారు, అలాంటి వారు మనకు అవసరమా? నిరుద్యోగ యువతకు హామీ ఇస్తున్నా, తొలిసంతకం మెగా డిఎస్సీపైనే, సింగిల్ జాబ్ క్యాంలెండర్ ప్రతిఏటా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తాం, అయిదేళ్లలో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం, ప్రైవేటురంగంలో పెట్టుబడులు, పరిశ్రమలు రప్పించి 20లక్షల ఉద్యోగాలు తెస్తాం, ఉద్యోగం వచ్చేవరకు యువతకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.

31మంది ఎంపిలను ఇస్తే ఏంచేశారు?
జగన్ ఊరూరా తిరిగి 25 గెలిపిస్తే డిల్లీ మెడలు వంచుతానని అన్నాడు. 31మందిని గెలిపిస్తే ఏనాడైనా మన గురించి పోరాడారా? ఆంధ్రులఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు. ఒక ఎంపి బాబాయి హత్యకేసులో పోలీసులు వస్తే దొంగచాటుగా హాస్పటల్ లో దాక్కున్నాడు. మరో ఎంపి రీల్స్ వీడియోలు చేస్తాడు, విశాఖ ఎంపి కుటుంబసభ్యులను కిడ్నాప్ కు గురైతే హైదరాబాద్ పారిపోయాడు.

వీరందరికంటే విజయసాయి అనే మరో దొంగ విశాఖను దోచేసి ప్యాలెస్ కు డబ్బులెక్కలు చెప్పే పనిలో బిజీగా ఉన్నాడు. 31మంది ఎంపిలు ఉంటే డిల్లీని వణికించాలి, స్వప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టారు, ఏనాడు రాష్ట్రం కోసం పోరాడలేదు.టిడిపికి పార్లమెంటులో టైగర్ ఉన్నాడు, రాష్ట్ర సమస్యలపై రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర గళాన్ని పార్లమెంటులో విన్పించారు. గుంటూరు ఎంపి జయదేవ్ పరిశ్రమలు, పెట్టుబడుల కోసం పార్లమెంటు సాక్షిగా పోరాడారు.

ఆ సొమ్మంతా ఏ పంది కొక్కులు తింటున్నాయో చెప్పండి
బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ చూశాక వారిలో వణుకు అర్థమైంది. ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ మాఫియాలను ప్రధాని చెబితే అవన్నీ పాతవే అంటున్నాడు. టిడిపి అధికారంలో ఉన్నపుడు ట్రాక్టర్ వెయ్యి ఉన్నఇసుక ఇప్పుడు 7వేలు అమ్ముతున్నారు. ఏ పందికొక్కు ఆ డబ్బు తింటున్నారు, గతంలో 80 ఉన్నక్వార్టర్ ధర 180 అయింది… ఏ పందికొక్కు ప్రజల రక్తాన్ని తాగుతున్నారో చెప్పండి.

ప్రజల భూములకు కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. మనం కష్టపడి భూములు కొన్నాం. జగన్ పోటోలు ఎందుకు, ఆయనేమైనా కొనిచ్చాడా? మన భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన పెట్టుకుని జిరాక్స్ ఇస్తాడంట. భూతగాదా ఉంటే అధికారులే తేలుస్తారట. ఏమరపాటుగా ఉంటే మీ బిడ్డను అంటున్న జగన్ మీ భూములు కొట్టేస్తాడు.

ఆంధ్రులారా మేలుకోండి… ఎన్నాళ్లీ వలసబతకులు?
మేలుకోండి ఆంధ్రులారా, ఎన్నాళ్లు ఉద్యోగాలు, ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తాం. మనకు పౌరుషం, ఆత్మగౌరం లేదా? మన ఓటుపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది. అయిదేళ్లలో చాలా నష్టపోయాం. మళ్లీ రాష్ట్రాన్ని జాబ్ క్యాపిటల్ గా మార్చాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అశోక్ గజపతిరాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టిందో చూశాం. కేంద్ర, రాష్ట్ర మంత్రిగా ఆయన పనిచేశారు. ఇవ్వడమే తప్ప చేయిచాచి తీసుకునే గుణం ఆయనకు లేదు.

అలాంటి కుటుంబంపై జగన్ దాడి చేశారు. ఆయనను సింహాచలం ట్రస్ట్ నుంచి గెంటేశారు. సింహాచలం భూములు కొట్టేయడానికి విజయసాయి, బొత్స ప్రయత్నించారు. రాష్ట్రం మళ్లీ మరోసారి నష్టపోకూడదు. ఇప్పటికే 30ఏళ్లు వెనక్కి పోయింది. విజయనగరం గడ్డపై పసుపుజెండా ఎగురవేయాలి. గతంలో మాదిరి ప్రత్యేక శ్రద్ధ వహించి, విజయనగరం జిల్లాకు పరిశ్రమలు తెస్తాం, యువతకు ఉపాధి కల్పించి వలసలను నివారిస్తాం.

జగన్ లా నేను పరదాలు కట్టుకుని తిరగను. జగన్ లా చెట్లకొట్టను. నేను ఏనాడు తప్పుచేయలేదు. దమ్ముధైర్యంగా ప్రజలముందు నిలబడ్డా. మీతరపున పోరాడుతున్నందుకు నిన్న కూడా నాపై, చంద్రబాబుపై కేసులు పెట్టారు. బాంబులకే భయపడని కుటుంబం మాది, జగన్ చిల్లరకేసులకు భయపడతామా? జగన్ నీ టైమ్ అయిపోయింది, ఎపి ప్రజలు నిన్ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పవనన్న మంచి స్లోగన్ ఇచ్చారు, హలో ఏపీ, బైబై వైసిపి అని… అదే నినాదంతో ఈనెల 13న వైసిపికి బైబై చెప్పండి.

ఉత్తరాంధ్రకు పట్టిన క్యాన్సర్ గడ్డ బొత్స కుటుంబం
ఉత్తరాంధ్ర దద్దరిల్లింది…. యువగళం యువగర్జనగా మారింది. ఈ సభ చూశాక తాడేపల్లి కొంపలో టివిలు పగడలడం ఖాయం. విజయనగరం రాజులు ఏలిన నేల ఇది, శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం కొలువైన నేల విజయనగరం. బొత్స కుటుంబం ఉత్తరాంద్రను క్యాన్సర్ గడ్డలా పట్టారు. 2019లో బొత్స కుటుంబాన్ని గెలిపించారు, ఆ కుటుంబం జిల్లాను కేకు ముక్కలా కోసుకుని తింటున్నారు. బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, చిన్నశ్రీను, బెల్లాన చంద్రశేఖర్ ఏరియాలవారీగా పంచుకున్నారు.

ఉత్తరాంధ్రలో వైసీపీ వచ్చాక ఒక్క ఉద్యోగం వచ్చిందా, ఒక్క పరిశ్రమ వచ్చిందా, వైసిపి వారు బాగుపడ్డారు, వారి కంపెనీలకు ఆదాయం పెరిగింది, వారికి అధికారమిస్తే అధికారులను అడ్డుపెట్టి భూములు కాజేస్తారు. గత టిడిపి హయాంలో విజయనగరం జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. తోటపల్లి ప్రాజెక్టుకు 774 కోట్లు వెచ్చించాం. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి పనులు ప్రారంభిస్తే జగన్ వచ్చాక రద్దుచేశారు.

సెంచురియన్ యూనివర్సిటీ, భోగాపురం పోర్టుకు భూసేకరణతో పనులు ప్రారంభించింది చంద్రబాబు. గోస్తనీ, చంపావతి నదినుంచి విజయనగరానికి తాగునీరు తెచ్చాం, ప్రైఓవర్లు, బైపాస్ రోడ్లు నిర్మించాం, మహారాజా ఆసుపత్రి 300 పడకలకు విస్తరించాం, పేదలకు పెద్దఎత్తున టిడ్కో ఇళ్లు కట్టించాం. గతంలో మాదిరే ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్దపెట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

అదితి, అప్పలనాయుడులను గెలిపించండి
అశోక్ గారి గురించి చెప్పాలంటే రోజంతా చెప్పాల్సి ఉంటుంది. నన్ను చిన్నపుడు ఎత్తుకున్నారు, అశోక్ గారినిచూస్తూ పెరిగాను. ఆయన ప్రజాఆదరణ చూశాను. మాజీ కేంద్ర, రాష్ట్రమంత్రిగా గాక సామాన్యుడిలా ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ప్రయత్నించారు. అశోక్ గజపతిగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అదితి వచ్చారు. బొత్స కుటుంబం ఎంత అవినీతి చేశారో చూశాం, విజయనగరం ఎంత వెనుకబడిందో చూశాం.

అదితిని గెలిపించి శాసనసభకు పంపండి. కేంద్రంలో మన తరపున ప్రశ్నించే స్వరం విన్పించే ఎంపి కావాలి. కూటమి బలపర్చిన కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించండి. చాలామంది మొదటిసారి ఓటువేయబోతున్నారు. ఓర్పు, సహనంతో సైకిల్ కు ఓటువేసి గెలిపించండి. గుర్తుతో అయోమయాన్ని సృష్టిస్తారు. అప్రమత్తంగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువనేత లోకేష్ కోరారు

LEAVE A RESPONSE