ఐపిఎల్‌ కమర్షియల్‌గా మారింది

-దానిమూలంగానే క్రికెట్‌లో బెట్టింగ్‌ మాఫియా
-స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ
-తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై,విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతతో దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందని అంతగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు.

క్రీడా రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వృద్ధి కనిపిస్తుందని అన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహకాలను అందించారని తెలిపారు. గ్రామ స్థాయిలో,మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తెచ్చేందుకు ఈ నెల 29 నుండి 31 వరకు సీఎం కప్ టోర్నమెంట్ లను నిర్వహించడం జరిగిందని చెప్పారు.

అయితే క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని గెలిస్తే బాధ్యతగా ముందుగు వెళ్లాలని,ఓడితే మళ్ళీ గెలిచే వరకు శ్రమించాలని ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో క్రీడలను కూడా వ్యాపారంగా మార్చారని ,ఐ. పి .యల్ మొత్తం కమర్షియల్ గా ఉందని, దాని మూలంగా బెట్టింగ్ మాఫియా కారణంగా అమాయకులు నష్టపోతున్నారని ఆయన మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణిస్తారనే నమ్మకం బలంగా ఉందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ,తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply