ఎమ్మెల్యేల ,అభ్యర్థుల పనితీరుపై మళ్లీ కేసీఆర్ అసహనం?

– సర్వే ప్రకారం బీఆర్‌ఎస్‌కు 103 సీట్లు
-ఉత్తుత్తి ప్రచారం చేసే ఎమ్మెల్యేలపై ఫోకస్
– హైదరాబాద్‌,పెద్దపల్లి ,ఖమ్మం లో ఆత్మీయ సమ్మేళనా లపై పెదవి విరుపు
– 35 మంది సిట్టింగులకు నో చాన్స్?

బీఆర్‌ఎస్ సిట్టింగుల కింద నీళ్లు వస్తున్నట్లే కనిపిస్తోంది. దాదాపు 35 మందిని మారుస్తారన్న ప్రచారం నేపధ్యంలో, తాజాగా జరిగిన భేటీలో కేసీఆస్ హెచ్చరికలు, ఆ ప్రమాదఘంటికను మోగించాయి. పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇచ్చేది లేదని నిర్మొహమాటంగా బీఆర్‌ఎస్ బాసు చెప్పేశారు.

బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం వాడివేడిగా సాగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు నేతలకు,ఇంచార్జి లకి పలు సూచనలు చేసిన ఆయన.. ఎమ్మెల్యేల ,ఇంచార్జి ల పనితీరుపై మళ్లీ అసహనం వ్యక్తం చేశారు.

ప్రజల్లోకి వెళ్లకుండా పైపై ప్రచారాలు పక్కనపెట్టాలని, ఎన్నికల సమయానికి లోపాలను సరిద్దుకోవాలని సూచించారు. హైదరాబాద్‌, నల్లగొండ,కరీంనగర్ ,పెద్దపల్లి జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలపై,ఇంచార్జి లపై సీఎం సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు సూచనలు చేసినా వైఖరి మారకుంటే టికెట్లు రావని కేసీఆర్ గారు స్పష్టం చేసినట్లు సమాచారం.

పథకాల ప్రచారంపై ఎమ్మెల్యేలు ఫోకస్ పెట్టాలని,సొంత అజెండా లు పక్కన పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నెలలో మొత్తం రోజులు ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. సర్వే ప్రకారం బీఆర్‌ఎస్‌కు 103 సీట్లు వస్తాయని తెలిపారు. హైదరాబాద్‌,పెద్దపల్లి ,ఖమ్మం లో ఆత్మీయ సమ్మేళనాలు ఆశించిన మేర జరగలేదని, విభేదాలు, విమర్శలు పక్కన పెట్టి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని ఎమ్మెల్యేలను ,ఇంచార్జి లకి కేసీఆర్ ఆదేశించారు.

వచ్చే ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరేసి హ్యాట్రిక్ నమోదు చేయాలని కేసీఆర్ గారు భావిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించారు. అయితే రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా , వచ్చే సహజమైన వ్యతిరేకతతో కొంతమందిని మార్చాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం 35 మంది సిట్టింగు ఎమ్మెల్యేలను పక్కనపెట్టే అవకాశముందని తెలుస్తోంది.

35 మంది అభ్యర్థులను మార్చితే.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనడంతో, అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ,అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. దీనికితోడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ.. కారు పార్టీలో గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు కొత్త తలనొప్పి తీసుకొస్తున్నాయి. ఈ సారి తమకే టికెట్ అని కొందరు అంటుంటే.. లేదు లేదు.. తమకే టికెట్ అని మరికొందరు ప్రచారం చేసుకోవడం పార్టీలో అంతర్గత సమస్యలకు కారణం అవుతోంది.

పని చేయని ఎమ్మెల్యేలకు,అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం కష్టమని మొదటి నుండి హెచ్చరిస్తున్న కేసీఆర్.. ప్రస్తుతం అలాంటి వారిని ఐడెంటిఫై చేసినట్లు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తవారిని నిలబెట్టేందుకు.. ఎవరైతే బాగుంటుందనే చర్చలు కూడా జరిపినట్లు బీఆర్ఎస్‌ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.

పార్టీకి మొదటి నుండి చురుకుగా పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి ఈ సారి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్లు, పని చేసిన వాళ్లను కూడా పరిగణనలోకి తీసుకునే చాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతోంది.పనిచేయని ఎమ్మెల్యేలు, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వారిని మార్చాలన్నదే గులాబీ దళపతి అసలు ఆలోచన అన్నది పార్టీ వర్గాల సమాచారం. తాజా సమావేశంలో కేసీఆర్ హెచ్చరికలు కూడా దానికి అనుగుణంగానే ఉన్నట్లు క నిపిస్తోంది.

Leave a Reply