Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో జీఎస్టీతో పాటు జే ట్యాక్స్‌ అదనం

– జగన్‌ను ఇంటికి పంపి ‘జే ట్యాక్స్‌’ను రద్దు చేసుకుందాం
-వ్యాపారులను ఇబ్బంది పెడుతూ లూఠీ చేశారు

-అవకాశాల కోసం పార్టీలు మారే వ్యక్తి వెల్లంపల్లి
-విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌
-వెస్ట్‌ నియోజకవర్గ ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం
-కూటమికి మద్దతిస్తూ సంఘ సభ్యుల నిర్ణయం

విజయవాడ బ్యూరో ప్రతినిధి, మహానాడు: ఆర్యవైశ్య సమాజం ఎవరికి మద్దతు పలికితే వారు అధికారంలోకి వస్తారు. జగన్‌ మాయ మాటలకు అందరూ మోసపోయారు. జగన్‌ అండగా ఉంటాడని గెలిపిస్తే మీకు జే ట్యాక్స్‌ విధించి వ్యాపారం చేసుకునే వారిని ఇబ్బందులకు గురి చేశాడు. రాష్ట్రానికి ఏ కంపెనీ రాకుండా అభివృద్ధిని అడ్డుకుని ఆర్యవైశ్యులకు వ్యాపారాలు జరగకుండా చేశాడు. అందుకే రాబోయే ఎన్నికల్లో మీరందరూ ఐక్యంగా నిలబడి జేె ట్యాక్స్‌ను రద్దు చేసుకునేందుకు కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ, జనసేన బలపరిచిన టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ ఆర్యవైశ్య సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని శ్రీదేసు సుబ్బారావు వాసవీ కళ్యాణ మండపంలో మంగళవారం పశ్చిమ నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా కేశినేనితో పాటు పశ్చిమ నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ క్రమశిక్షణ, దానగుణం ఆర్యవైశ్యులలో ఎక్కువ ఉంటుందన్నారు. సంఘ సేవలో ఎప్పటి నుంచో ఉన్నారని తెలిపారు.

వ్యాపారులను నమ్మించి నట్టేట ముంచాడు
మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, కోణిజేటి రోశయ్య వారసులైన ఆర్యవైశ్యులను జగన్‌ నమ్మించి నట్టేట ముంచాడని విమర్శించారు. అభివృద్ధి చేస్తాడని మద్దతిస్తే జీఎస్టీకి తోడుగా జే ట్యాక్స్‌ విధించి వ్యాపారస్తులను వేధించాడని పేర్కొన్నారు. టీడీపీ హయంలో ఏ వ్యాపారస్తుడు బాధపడలేదన్నారు. ఈసారి ఐక్యంగా ఉండి రాష్ట్రాభివృద్ధితో పాటు వ్యాపార రంగానికి చేదోడుగా నిలబడే చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు.

ఆ అభ్యర్థి ఓటమి ఖాయం
పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు గత 20 ఏళ్లుగా ఆర్యవైశ్య సంఘం సమస్యలు పరిష్కరించలేదని, తన ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం పార్టీలు మారుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని వాడుకున్నాడని విమర్శించారు. ఆ వ్యక్తి ఇక్కడ గెలవడని పక్క నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడకు కొత్త అభ్యర్థిని తీసుకు వచ్చారు. సుజనా చౌదరి దెబ్బకు ఆ వ్యక్తి ఓడిపోతాడన్నారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం, యువత భవిత కోసం కూటమికి అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని, రాష్ట్రంలో జగన్‌ పాలనపై అందరూ విసిగిపోయారని అన్నారు.

సుజనా గెలుపుతో వెస్ట్‌ నియోజకవర్గ అభివృద్ధి
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సుజనాచౌదరి వెనకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకోవ టం ఈ ప్రాంతం అదృష్టమన్నారు. 175 నియోజక వర్గాల్లో వెస్ట్‌ నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఉందన్నారు. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో తప్పకుండా తాను కూడా నడుస్తానని తెలిపారు. మోదీ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సుజనాచౌదరి ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కమలం గుర్తుపై ఓటువేసి సుజనాచౌదరిని అసెంబ్లీకి పంపిం చాలని, పార్లమెంట్‌ అభ్యర్థిగా తనకి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్టా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, టీడీపీ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎం.ఎస్‌.బేగ్‌, ఏపీ మర్చంట్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌, మాజీ దుర్గగుడి ఆలయ చైర్మన్‌ పైలా సొమినాయుడు, తమ్మలపాటి శ్రీనివాస్‌, గుంట్ల రాము, కోణిజేటి రమేష్‌తో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE