Suryaa.co.in

Andhra Pradesh

మహాపాదయాత్రను అణచివేసేందుకు జగన్ రెడ్డి కుట్ర

– అడుగడుగునా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
– యాత్రలో ప్రజావెల్లువను చూసి భయపడుతోన్న ప్రభుత్వం
– నారా చంద్రబాబునాయుడు
రాష్ట్రానికి ఏకైక ప్రజారాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న విశేషమైన స్పందనను చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన యాత్రకు లక్షలాది మంది ప్రజలు తమ సంఘీభావాన్ని తెలుపుతుంటే ప్రభుత్వం మాత్రం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం.
జగన్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ దమనకాండకు ఈ సంఘటన అద్దం పడుతోంది. 13 జిల్లాల అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అమరావతి నిర్మాణాన్ని నిలిపివేస్తూ.. 3 రాజధానులంటూ విధ్వంసకర రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు.
ప్రజా మద్దతుతో సాగుతున్న మహాపాదయాత్రను అణచివేయాలనే కుట్రతో పోలీసులను అడ్డుపెట్టుకుని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మొదటి రోజు నుంచీ మహాపాదయాత్రకు ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నారు. రైతుల పాదయాత్రకు మద్దతుగా వస్తున్న ప్రజలను రానివ్వకుండా రోడ్లు దిగ్బంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనం.
అమరావతి రైతుల పాదయాత్రను జరుపుకోనివ్వాలన్న న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మహాపాదయాత్రను కొనసాగిస్తున్న అమరావతి రైతులను అడ్డుకోవడం మానుకోవాలి. పాదయాత్రలో గాయపడిన రైతులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE