Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి

– మేనమామగా ఉంటానన్న జగన్ రెడ్డి కంసమామగా మారిపోయారు
– ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌నం ర‌క్తం త‌ప్పించి ఏమీ మిగ‌ల్లేదు
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…
జగన్ రెడ్డి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి…ఈ మాట నేను ఊరికే అనడం లేదు. అనంతపురంలో ఎం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది. విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిన వైసీపీ మంత్రులు ఎం మాట్లాడుతున్నారో విన్నారా?
విద్యార్థి సంఘాల ముసుగులో దుండగులు పోలీస్ డ్రెస్ వేసుకొని విద్యార్థుల పై దాడి చేసారట. ఇంకో మంత్రి అసలు అక్కడ పోలీసులే లేరు విద్యార్థులే కొట్టుకొని తలలు పగలగొట్టుకున్నారని అంటున్నారు. ఇలాగే వదిలేస్తే అసలు అనంతపురంలో ఎస్.ఎస్.బి.ఎన్ కాలేజ్ లేదు దాడి ఎప్పుడు జరిగింది అంటారు.
అందుకే జగన్ రెడ్డి మూర్ఖపు ముఖ్యమంత్రి, మంత్రులు కంత్రీలు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా దానికి జగనన్న అని పేరు పెట్టుకుంటున్నారు…చెత్త బళ్లకు కూడా వైకాపా రంగులు జగనన్న చెత్త బళ్లు అని పేరు.కానీ ఎయిడెడ్ కళాశాలపై జగన్ రెడ్డి విధ్వంసం చూసిన తరువాత ఆయన కార్యక్రమాలకు ఒక పేరు పెట్టాలనిపించింది జగనన్న కాదు జగన్ దున్న అని.
దున్న ఎం చేస్తుంది? వెంటపడి తరుముతుంది, కుమ్మేస్తుంది, అడ్డుగా ఉన్నవాటిని నాశనం చేస్తుంది. జగన్ రెడ్డి ఒక దున్న లా ఎయిడెడ్ విద్యా సంస్థల పై పడ్డాడు. వాటిని విధ్వంసం చెయ్యడానికి ప్రయతిస్తున్నారు. జగన్ రెడ్డి బ్లడ్ లో డేవలప్మెంట్ లేదు మొత్తం డిస్ట్రక్షనే.
1854 లోనే ఎయిడెడ్ వ్యవస్థ ఏర్పడింది. పేద విద్యార్థులకు అండగా నిలబడటానికి దాతలు, ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఎన్టీఆర్ గారు, వెంకయ్యనాయుడు గారు, జస్టిస్ రమణ గారు, బలయోగి గారు ఆఖరికి జగన్ రెడ్డి తండ్రి వైఎస్ గారు, రోశయ్య గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. నెలలో మొదటి తేదీన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిది.
రత్నకుమారి కమిటీ ఎవరితో మాట్లాడకుండానే రిపోర్ట్ ఇచ్చింది.జిఓ 42 తెచ్చి ఎయిడెడ్ ని చంపాలని చూస్తున్నారు. రెండే అప్షన్లు ఇచ్చారు. ఒకటి ఉపాధ్యాయులను, ఆస్తులను ప్రభుత్వానికి ఇవ్వడం. రెండు ప్రైవేటీకరణ. జిఓ లో లేని మూడో అప్షన్ ఉందని చెబుతున్నారు. ఇష్టం లేకపోతే ప్రభుత్వ ఎయిడ్ కొనసాగిస్తాం అని చెబుతున్నారు. ఆ ప్రస్తావన జిఓ లో ఎందుకు లేదు.
మేనమామగా ఉంటానన్న జగన్ రెడ్డి కంసమామగా మారిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు. అధికారంలోకి వచ్చాకా పిడి గుద్దులు. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేయించే స్థాయికి జగన్ రెడ్డి దిగజారిపోయారు. రాజారెడ్డి రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై దాడి చేసే అధికారం ఎవరిచ్చారు?
ఎయిడెడ్ స్కూల్స్, కాలేజెస్ ని నాశనం చెయ్యొద్దు, నిర్ణయాన్ని మార్చుకోండి అని అడిగినందుకు విద్యార్థుల తలలు పగల గొట్టారు, చెంప దెబ్బలు, విద్యార్థులను బూటు కాలితో తొక్కిస్తారా? దొంగల్ని తీసికెళ్ళినట్టు పొలిసు వాహనాల్లో తీసుకెళ్తారా? ఇద్దరు పిల్లలు ఉన్నా అమ్మ ఒడి అన్న వాడు మాట మార్చాడు, మడమ తిప్పాడు. అమ్మ ఒడిని అర్ధ ఒడి చేసి ఇప్పుడు ఏకంగా కొడుకు బడిని మూసేస్తున్నాడు.
జ‌గ‌న్‌రెడ్డి దోచుకోవ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌నం ర‌క్తం త‌ప్పించి ఏమీ మిగ‌ల్లేదు..అందుకే ఎయిడ్ సంస్థ‌ల ఆస్తుల‌పై క‌న్ను వేశారు. ఆస్తులు కొట్టేసేందుకు వైసీపీ గెద్దలు సిద్ధంగా ఉన్నాయి.
మా కళాశాలని ఎయిడెడ్‌లో కొన‌సాగించండి… ప్రైవేటుగా మార‌నివ్వ‌కండి…అంటూ అనంతపురం ఎస్.ఎస్.బి.ఎన్ కళాశాల విద్యార్ధులు ధ‌ర్నా చేయ‌డం నేర‌మా?
విద్యార్థులపై పోలీసులు చేసిన దాడికి సీఎం విద్యార్థిలోకానికి క్ష‌మాప‌ణ చెప్పాలి. బాధ్యులైన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి.నిన్న మొన్నటి వరకు ప్రశ్నించిన ప్రజలు, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టారు. కొట్టారు.
నేడు విద్యార్ధులపై జ‌రిగిన‌వి కూడా స్టేట్ స్పాన్స‌ర్డ్ దాడులే.విద్యార్ధులపై పడిన ఒక్కో లాఠీ దెబ్బకి జగన్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.విద్యార్థుల ర‌క్తం క‌ళ్ల‌జూసిన స‌ర్కారుకి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి.వైజాగ్, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, అనంత‌పురంల‌లో విద్యార్థుల ఆందోళ‌న‌లు జ‌గ‌న్‌రెడ్డికి క‌న‌ప‌డ‌లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ రద్దుకు వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు జగన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపడుతూ నిరసనలు తెలియజేస్తున్నారు.
ప్రజలు స్వచ్ఛంధంగా రోడ్ల మీదకు వస్తున్నారంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత దుర్మార్గమైనదో అర్ధంమౌతుంది. ఎంత సేపూ ప్ర‌శ్నించే వారిని ఎలా అణిచివేయాలో చూడ‌ట‌మే కానీ, స‌మ‌స్య ఎలా ప‌రిష్క‌రించాలో ఆలోచ‌న చేయ‌రా సీఎం గారూ!ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీల భూములు, విద్యా సంస్థల ఆస్తులు లాక్కుంటే…అవి మూత‌ప‌డ‌తాయి ల‌క్ష‌లాది మంది విద్యార్థుల భవిష్య‌త్తు అంధ‌కారం అవుతుంది.
ప్ర‌భుత్వం ఎయిడ్ ఆగిపోతే…ఎయిడెడ్ విద్యాసంస్థ‌లు కాస్తా ప్రైవేట్ విద్యాసంస్థ‌లు అవుతాయి.అప్పుడు ఫీజుల భారం నిరుపేద పిల్ల‌లు భ‌రించ‌లేక చ‌దువుల‌కే దూరం అవుతారు.
ఎయిడెడ్ సంస్థ‌ల‌పై నిర్ణ‌యంతో విద్యార్ధుల భవిష్యత్ ను నాశనం అవుతున్నా స‌ర్కారుకి చీమ‌కుట్టిన‌ట్ట‌యినా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ సంస్థ‌ల ప‌రిధిలో 2,203 పాఠశాలల్లో 1,96,313 మంది విద్యార్ధులు చ‌దువుతున్నారు.
182 జూనియర్ కాలేజీల్లో 71,035 మంది విద్యార్ధులున్నారు.116 డిగ్రీ కాలేజీల్లో చ‌దివే విద్యార్థుల భవిష్యత్ ప్రశార్ధకంగా మారుతుంది. ఎయిడెడ్ సంస్థ‌ల్లో చ‌దువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మంది నిరుపేద విద్యార్థులే.ల‌క్ష‌లాది పిల్ల‌ల చ‌దువు కంటే ఎయిడెడ్ సంస్థలకు వున్న‌ లక్ష కోట్ల విలువైన భూములు, ఆస్తులే జ‌గ‌న్‌రెడ్డికి ముఖ్య‌మ‌య్యాయి.ఎయిడెడ్ సంస్థ‌ల క‌ళాశాల‌ల్లో ప‌నిచేసే లెక్చ‌ర‌ర్ల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌డంతో …అప్ప‌టివ‌ర‌కూ ప‌నిచేసే 750మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను త‌మ ఉద్యోగాలు కోల్పోయారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేస్తానని చెప్పినహామీని ఇచ్చిన జ‌గ‌న్‌…చివ‌రికి వారికి ఉద్యోగ‌మే లేకుండా చేశాడు. కేవ‌లం ఎయిడెడ్ సంస్థ‌ల ఆస్తులు చేజిక్కించుకోవ‌డానికి విద్యార్థులు, కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల‌ను న‌డిరోడ్డున ప‌డేశారు జ‌గ‌న్‌రెడ్డి.
అనంతపురం ఎస్ఎస్‌బీఎన్ క‌ళాశాలే కాదు..రాష్ట్రంలో ఏ ఒక్క ఎయిడెడ్ విద్యాసంస్థా ప్రైవేటు కానివ్వం. విద్యార్థుల ఉద్య‌మానికి తెలుగుదేశం పార్టీ ముందుండి న‌డిపిస్తుంది.లాఠీల‌తో వ‌స్తారో…లారీల‌తో వ‌స్తారో రానివ్వండి…కాలేజీల‌ను కాపాడుకుందాం.. స్కూళ్ల‌ను ర‌క్షించుకుందాం..
ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల్లో విద్యార్థుల‌కు న్యాయం జ‌రిగేవ‌ర‌కూ ఈ ఉద్య‌మం అన్ స్టాపబుల్. జ‌గ‌న్ విధ్వంస‌పాల‌న‌కి చ‌ర‌మ‌గీతం పాడేవ‌ర‌కూ తెలుగుదేశం పోరాటం అన్ స్టాపబుల్. జగన్ రెడ్డికి వారం రోజులు డెడ్ లైన్ పెడుతున్నాను. కోర్టుకి తప్పుడు అఫిడవిట్ లు సమర్పించడం. ప్రభుత్వం ఎయిడెడ్ పై నిర్ణయం మార్చుకుంది అంటూ లీకులు ఇవ్వడం కాదు


ఎయిడెడ్ విద్యా సంస్థల్ని చంపేస్తూ మీరు ఇచ్చిన జిఓ 42 వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యార్థుల పై దాడి చేసిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలి. ఆదేశాలు జారీ చేసిన వారి పేర్లు బయట పెట్టేలా దర్యాప్తు చెయ్యాలి.
విద్యార్థులపై కేసులు వెంటనే ఎత్తేవెయ్యాలి వచ్చేది టీడీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ఇచ్చిన చెత్త జిఓలు రద్దు చేస్తాం. ఎయిడెడ్ ని పాత పద్దతిలో కొనసాగిస్తాం.నేను విద్యార్థుల తరపున పోరాడుతూనే ఉంటా…ఎయిడెడ్ పై నిర్ణయం మార్చుకోకపోతే మంత్రులు, ముఖ్యమంత్రి రోడ్ల పై తిరగలేరు.

LEAVE A RESPONSE