Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి స్వార్థంతోనే అదానీకి గంగవరం పోర్టు!

• జి.ఓ. నెం. 12లోని అధికారుల సిఫారసులను ఎందుకు తుంగలో తొక్కారు?
• 37సంవత్సరాల ఆదాయమిచ్చే బంగారుబాతును పప్పుబెల్లాలకు తెగనమ్ముతారా?
• అవినీతిని కప్పిపుచ్చేందుకే జిఓలను పబ్లిక్ డొమైన్ లో లేకుండా దాచిపెట్టారు!
• జ్యుడీషియల్ ప్రివ్యూ యాక్ట్ ను ఎందుకు అమలుచేయలేదు?
• ఎంపవర్ కమిటీ నివేదిక, లీగల్ ఒపినీయన్ వివరాలు బహిర్గతం చేయండి
• తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్!

రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటా 2.1 రెవెన్యూ షేర్ కలిగిన గంగవరం పోర్టును రూ. 645కోట్ల నామమాత్రపు ధరకు అదానీకి పప్పు బెల్లాలకు తెగనమ్మారు. గంగవరం పోర్టును కారుచౌకగా అమ్మడం వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వార్థం ఉంది. ఇంకా 37 సంవత్సరాల నిరంతర ఆదాయం అందించే బంగారుబాతు లాంటి పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మారు. జ్యూడిషియల్ ప్రివ్యూ యాక్ట్ ప్రకారం 100 కోట్లు పై బడిన ఏ టెండరు అయినా ఓపెన్ బిడ్ ద్వార జరగాలని చెప్పి గంగవరం విషయంలో ఎందుకు పాటించలేదు?

ఓపెన్ బిడ్ ద్వారా మరింత లాభాం పోందే అవకాశం ఉన్న ఎంపవర్ కమిటీ సిఫారసులను సైతం పక్కనబెట్టి ఎవరి ప్రయోజనాల కోసం అదానీలు ప్రతిపాధించిన నామమాత్రపు ధరకే గంగవరం పోర్టులో వాటాలను డైరెక్ట్ సెల్ లో అమ్మారు. అవినీతికి సహకరించే ఇటువంటి జీవో లు ప్రజల కంట పడకూడదు

అనేనా పబ్లిక్ డౌమైన్ లో జీవోలు లేకుండా చేశారు. గంగవరం పోర్టును తెగనమ్మి విశాఖ ఉక్కు ఉనికికే ప్రమాదం తీసుకువచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకమని చెబుతున్నా పభుత్వం… గంగవరం పోర్టు విషయంలో కక్కుర్తిపడి గంగవరం పూర్తి ప్రైవేటీకరణకు పూనుకున్నారు. గంగవరం పోర్టు తెగనమ్మడం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో, మారిటైమ్ బోర్డులో జరుగుతున్న అవకతవకలు మరిన్ని త్వరలో ఆధారాలతో బయట పెడతాం.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలోని సహజవనరులన్నీ చాలావరకు దోపిడీకి గురయ్యాయి. దేశంలోనే అతిపెద్ద తీరప్రాంతం (దాదాపు 975కిలోమీటర్లు) మన రాష్ట్రానికి ఉండటం ప్రత్యేకత. లాభదాయకమైన సౌత్ ఈస్ట్ ఏసియా నుంచి కార్గో ట్రాఫిక్ ను హ్యాండిల్ చేయడానికి అవసరమైన పోర్టులను నిర్మించడానికి ఏపీకి ఉన్నన్ని వనరులు మరే రాష్ట్రానికి లేవు. అలాంటి సువర్ణావకాశాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకోవడానికి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు కృషిచేశారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో పోర్టుల నిర్మాణానికి అప్పట్లో పెద్దపీట వేశారు.

పోర్టులనిర్మాణం జరిగితే వాటికి అనుబంధంగా ఏర్పడేపరిశ్రమలు, తద్వారా రాబట్టడానికి అవకాశం ఉన్న పెట్టుబడుల ఆవశ్యకతను గుర్తించడం వల్లే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) మోడల్ లో గంగవరం, కాకినాడ పోర్టుల నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. మైనర్ పోర్టులు నిర్వహణ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో మారిటైమ్ బోర్డును ఏర్పాటుచేశారు.

ఆ రెండుపోర్టులు అనతికాలంలోనే గొప్పఅభివృద్ధిని కూడా సాధించాయి. అలాంటిపోర్టులను కూడా తెగనమ్మడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. గంగవరం పోర్టు పీపీపీ మోడల్ లో ఏర్పాటైనా కూడా దానిలో 10.4శాతంవాటాతోపాటు 2.1శాతం రెవిన్యూ షేర్ ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వవాటా కింద 1800ఎకరాలభూమిని ఆనాటి టీడీపీప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గంగవరంపోర్టు నిర్మాణ టెండర్లు పిలిచినప్ప్పుడు మెస్సర్స్ డీవీఎస్ రాజు టెండర్లు దక్కించుకోవడం జరిగింది.

ఈ వ్యవహారం ఇలా ఉంటే గంగవరం పోర్టులో ఉన్న రాష్ట్ర వాటా 10.4శాతాన్ని అదానీగ్రూప్ కు జగన్ ప్రభుత్వం ఎందుకు అమ్మకానికి పెట్టిందనే దాని వెనుక పెద్దతతంగమే నడిచింది. లాభదాయకమైన పోర్టులో రాష్ట్ర ప్రభుత్వవాటాను ఎందుకు తెగనమ్ముతున్నారని ప్రజలంతాకూడా ఆలోచించారు. ప్రతిసంవత్సరం డివిడెండ్ రూపంలో గంగవరం పోర్టునుంచి ఆదాయంకూడా వస్తోంది. గడచిన ఆర్థికసంవత్సరంలో గంగవరం పోర్ట్ నుంచి రూ.50కోట్లఆదాయం ఏపీప్రభుత్వానికి వచ్చింది.

రెవెన్యూ షేర్ 2.1శాతం ఉంది… దాని ద్వారా కూడా ఏపీకి ఆదాయంవస్తోంది. గతంలో ప్రభుత్వం కేటాయించిన 1800ఎకరాల భూమితోపాటు, మరలా 1000ఎకాలను లీజుకి ఇవ్వడంజరిగింది. ఆ లీజుద్వారా కూడా ఏపీ ప్రభుత్వానికి ఆదాయంవస్తోంది. ప్రతి సంవత్సరం ఏపీ ఖజానాకి ఆదాయం తీసుకొస్తున్న ఎలాంటి రుణభారంలేని గంగవరం పోర్టుని ఈ ముఖ్యమంత్రి ఎందుకు తెగనమ్మాడనే ప్రశ్న ఇప్పటికీ ప్రజల మెదళ్లను తొలుస్తూనే ఉంది.

ఒక్కసారి మనం గంగవరంపోర్టు తెగనమ్మకం వెనకున్న పూర్వాపరాల్లోకి వెళితే, జీవోనెం 4 గురించి మాట్లాడుకోవాలి. 25-05-2021న ఏపీప్రభుత్వం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టి మెంట్ జీవోనెం-4ని విడుదలచేసింది. డీ.వీ.ఎస్.రాజు అండ్ ఫ్యామిలీకి గంగవరం పోర్టులో ఉన్న 58.10శాతంవాటాతో పాటు విండీ లేక్ సైడ్ ఇన్వెస్టిమెంట్ వాటా 31.50శాతం, అలానే ఏపీ ప్రభుత్వవాటా 10.4శాతంవాటాల కొనుగోలుకు సంబంధించి అదానీ పోర్ట్స్ సెజ్ వారు ఇచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవోనెం-4 విడుదల చేసింది.

ప్రభుత్వ వాటాను అదానీ పోర్ట్స్ నుంచి ఏదైతే ప్రతిపాదనవచ్చిందో దానిలో ఒక్కో షేర్ ను రూ.120లుచొప్పున మొత్తం 645 కోట్లకు కొనుగోలుచేయాలని నిర్ణయించారు. పోర్టు వాటాలను తెగనమ్మే వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం జీవోనెం 4ను విడుదల చేసి, గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ తో ఎంపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గంగవరం పోర్ట్ ద్వారా గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో డివిడెండ్ రూపంలో రెవెన్యూషేర్ గా మరియు లీజ్ రెంటల్స్ ద్వారా ఇప్పటివరకు రూ.277కోట్లు వచ్చినట్టు జి.ఓ. నెం. 4లో స్పష్టంగా పేర్కొన్నారు. అతి తక్కువ పెట్టుబడితో అంతటి ఆదాయాన్ని అందిస్తున్న గంగవరం పోర్టును ఏ ప్రలోభాలకు లొంగి తెగనమ్మారు.

జీవో. నెం4 కి కొనసాగింపుగా 04-06-2021న ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోనెం-5లో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ను నియమించడం జరిగింది. అలా నియమించిన వారిలో నీరభ్ కుమార్ ప్రసాద్ ను ఛైర్మన్ గా, సభ్యులుగా రజిత్ భార్గవ్ (స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ అండ్ టూరిజం), షంషేర్ సింగ్ రావత్ (ఫైనాన్స్ సెక్రటరీ), కే.వీ.రమణ (సెక్రటరీ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్ట్ మెంట్), శ్రీమతి వీ.సునీత (సెక్రటరీ లా డిపార్ట్ మెంట్) , కన్వీనర్ గా కరికాలవలవన్ లను నియమించారు.

ఆరుగురు ఐఏఎస్ అధికారులతో స్పెషల్ గ్రూఫ్ సెక్రటరీస్ ను నియమించింది. ఈ కమిటీ నివేదిక ఇవ్వడానికి 60రోజుల సమయమిచ్చింది. తరువాత అత్యంతకీలకమైన 23-08-2021న జీవోనెం 12 ను విడుదల చేశారు. ఆ జీవో ఇచ్చే సమయానికే రాష్ట్ర ప్రభుత్వం జీవోలేవీ ప్రజలకు కనిపించకుండా చేయాలని నిర్ణయానికి వచ్చి ఆన్ లైన్ జిఓ లు పొందుపర్చే వెబ్ సైట్ ను పూర్తిగా నిలిపివేసింది.. జీవోనెం-12లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం నియమించిన ఎంపవర్ కమిటీ చాలా స్పష్టంగా ఓపెన్ బిడ్ ఆక్షన్ ద్వారా గంగవరం పోర్టు షేర్ల అమ్మకానికి వెళితే ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని చెప్పారు.

కమిటీ సిఫారసును పక్కనబెట్టి ప్రభుత్వం… అవసరం లేకపోయినా జే.ఎస్.అసోసియేట్స్, శార్దుల్ అమర్ చంద్ మంగళ్ దాస్ అసోసియేట్స్ పేరుతో, మరియు ఒక రిటైర్డ్ జడ్జీ నుంచి లీగల్ ఒపీనియన్ ఎందుకు తీసుకున్నారు? వారిచే మీకు అనుకూలమైన లీగల్ ఒపీనియన్ తయారు చేయించి పోర్టు వాటాలను ఓపెన్ బిడ్ విధానంలో ఆక్షన్ ద్వారా కాకుండా నేరుగా డైరక్ట్ సేల్ విధానంలో అదానీ గ్రూప్ కు తెగనమ్మే నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా? గంగవరం పోర్ట్ వాటాల అమ్మకంలో గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ కమిటీ సిఫారసు చేసిన ఓపెన్ బిడ్ విధానాన్ని కాదని, ప్రభుత్వం డైరెక్ట్ గా అదానీ గ్రూప్ కు ఎందుకు తెగనమ్మిందో చెప్పాలి?

గంగవరం పోర్ట్ వాటా అమ్మకాల్లో ఎవరో ఇచ్చిన లీగల్ ఒపీనియన్ ను తీసుకొచ్చి అదే వేదమన్నట్టుగా ఈ ప్రభుత్వం ఎందుకు నడుచుకుంది? గంగవరం పోర్ట్ లోఉన్న ప్రభుత్వావాటాను అమ్మడానికి ఓపెన్ బిడ్ విధానమే మేలని ప్రభుత్వం జీవోనెం5ద్వారా నియమించిన ఎంపవర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ (ఐఏఎస్ అధికారులకమిటీ) చెప్పింది నిజంకాదా? జగన్ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ యాక్ట్ ప్రకారం 100కోట్లకు పైబడిన టెండర్ ఏదైనా న్యాయపరిశీలనకు వెళ్లాలనే నిబంధనను పోర్ట్ వాటాల అమ్మకం వ్యవహారంలో ఎందుకు పాటించలేదు?

జీవోనెం 12లో ప్రభుత్వం నియమించిన ఎంపవర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ విభాగం ఓపెన్ బిడ్ విధానమే మేలని స్పష్టంచేసింది వాస్తవంకాదా? ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులకమిటీ సూచనను కాదని, జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కోసమే గంగవరం పోర్టులో ఉన్న 10.4శాతం ప్రభుత్వవాటాను కేవలం తక్కువలో తక్కువగా రూ.645కోట్లకు తెగన మ్మారు. గంగవరం పోర్ట్ తో ప్రభుత్వానికి 30 సంవత్సరాల ఒప్పందం ఉంది. ఆగస్ట్ 2008లో గంగ వరం పోర్ట్ లో కార్యకలాపాలు (కమర్షియల్ ఆపరేషన్స్) ప్రారంభమైననాటి నుంచి ఆ ఒప్పందం అమల్లోకివస్తుంది.

అ తేదీనుంచి 30ఏళ్లపాటు కాంట్రాక్ట్ అమల్లో ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత మరో 20 సంవత్సరాలు (పది సంవత్సరాలు రెండు దఫాలుగా) కాంట్రాక్ట్ ను పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. అంటే దాదాపు 50సంవత్సరాల అగ్రిమెంట్ అది. కానీ ఈప్రభుత్వం పోర్టులో తనకున్న వాటాను తెగనమ్ముకొని భవిష్యత్తులో 37సంవత్సరాల కాలపరిమితిని కాదనుకొని రాష్ట్రవాటాగా ఉన్న 10.4శాతాన్ని తక్కువలో తక్కువకే ఆదానీ పరం చేశారు. తూర్పు నౌకాదళం పోర్టు నిర్మాణ సమయంలో భద్రతా అంశాల దృష్ట్యా అభ్యంతరాలు వ్యక్తంచేసినపుడు దీనిలో ప్రభుత్వ వాటా ఉన్నందున ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తవని రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించడంతో అనుమతి ఇవ్వడం జరిగింది.

గంగవరం పోర్ట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలకు చాలాకీలకమైనది. స్టీల్ ప్లాంట్ కు అవసరమైన బొగ్గు, ఇతర ముడిసరుకు అంతా గంగవరంపోర్ట్ నుంచే సరఫరా అవుతోంది. ప్రైవేట్ వ్యక్తులకు లాభనష్టాలుతప్ప, ప్రజలగురించి, రాష్ట్రం గురించి ఆలోచించరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉనికికే ప్రమాదం కలిగేలా జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్ట్ వాటాలను తనస్వార్థంకోసం అదానీగ్రూప్ కు తెగనమ్మేశాడు. గంగవరం పోర్ట్ కి ఇచ్చిన భూముల్లో కొన్నిభూములు విశాఖస్టీల్ ప్లాంట్ పరిధిలోనివే.

ఈ ప్రభుత్వం విశాఖస్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైన తరుణంలో దాని భవిష్యత్ ప్రశ్నార్థం కానున్న నేపథ్యంలో గంగవరం పోర్ట్ కార్గో టారిఫ్ లను అదానీ గ్రూప్ అమాంతం పెంచితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితేమిటి? గంగవరం పోర్ట్ అమ్మకంతో పాటు విశాఖస్టీల్ ప్లాంట్ మనుగడను కూడా ప్రశ్నార్థకంచేసేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం విచారకరం.

ఈ వ్యవహారంపై సకలశాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలి. ప్రభుత్వం దీనిపై స్పందించి గంగవరం పోర్టు అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి, గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ నివేదికతోపాటు లీగల్ ఒపీనియన్ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీ మారిటైమ్ బోర్డుకు సంబంధించి కూడా ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారో త్వరలో ఆధారాలతో సహా బయటపెట్టబోతున్నాం.

LEAVE A RESPONSE