– డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కృష్ణమూర్తిపై వేటు
– డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉషశ్రీ ఉత్తర్వు
– ‘సూర్య’ ఎఫెక్ట్
– కొరడా ఝళిపిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ శేషగిరిబాబు
(సుబ్బు)
అమరావతి: కార్మికశాఖలో ప్రధాన ఆదాయ వన రుగా ఉన్న ఫ్యాక్టరీస్లోని అవినీతి తిమింగలాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ శేషరిగిరి బాబు చర్యల కొరడా ఝళిపిస్తున్నారు. గత డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కు అనుకూలంగా ఉంటూ, ఆ మేరకు అధికారులను వేధించిన ఉన్నతాధికారులకు శేషగిరిబాబు చుక్కలు చూపిస్తున్నారు. ఆయన ఆదేశాలతో డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా వచ్చిన ఉషశ్రీ.. శాఖను ప్రక్షాళన చేసేందుకు నడుంబిగించారు. అందులో భాగంగా కడప డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కృష్ణమూర్తిపై సస్పెన్షన్ వేటు వేయడం సంచలనం సృష్టించింది. కాగా ‘కార్మికశాఖలో కంప్లైంట్ మాఫియా’ పేరుతో వచ్చిన కథనానికి ప్రభుత్వం స్పందించింది.
విశాఖలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా ఉన్న చిన్నారావు అనే అధికారిపై వచ్చిన ఆరోపణలపై, విచారణ చేసింది సస్పెండ్ అయిన ఈ కృష్ణమూర్తి కావడమే ఆశ్చర్యం. ఒక ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో నిందితుడిగా ఉన్న నాటి డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా ఉన్న వర్మను విచారించకుండా.. చిన్నారావును మాత్రమే లక్ష్యంగా చేసుకుని, సస్పెన్షన్ నివేదిక ఇచ్చిన కృష్ణమూర్తి వైఖరి, ఆ శాఖలో విమర్శలకు గురయింది.
కాగా మంత్రి పేషీలో ఉన్న.. కృష్ణమూర్తి సామాజికవర్గానికి చెందిన ఒకరి సూచనలతోనే, ఆయన చిన్నారావును సస్పెండ్ చేశారన్నదానిపై శాఖలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. దానిపై కోర్టుకు వెళ్లిన చిన్నారావు వాదనలో న్యాయం ఉందని నమ్మిన కోర్టు, ఆ సస్పెన్షన్ను కొట్టివేసింది. మంత్రి పేషీలో ఉన్న ఆయన.. తన మతానికి చెందిన వారితో ఇప్పటికే ఒక ముఠాగా ఏర్పడ్డారన్న విమర్శలూ లేకపోలేదు.
కాగా ఈ మొత్తం వ్యవహారంలో కార్మిక శాఖలో అత్యున్నత స్థానంలో ఉన్న కీలక వ్యక్తి, కుటుంబపెద్ద, ఆయన బావతోపాటు.. మంత్రి పేషీలో చక్రం తిప్పుతున్న ఇద్దరు అధికారుల హవాపై, ఇప్పటికే శాఖలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు చెప్పిన వారికే థర్డ్పార్టీ సేఫ్టీ ఏజెన్సీలు ఇస్తున్నారని, వీరు సిఫార్సు చేసిన వారికే పోస్టింగులు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రధానంగా తమకు గిట్టనివారిపై వీరే మరొకరి పేరుతో ఫిర్యాదు చేసి, విచారణ పేరుతో వారిని సస్పెండ్ చేయించి, ఆ స్థానంలో తాము కోరుకున్న వారికి పోస్టింగులు ఇచ్చే.. మాఫియా రాజ్ నడుస్తోందన్న ఆరోపణలు, సీఎంఓకు సైత ం చేరడం విశేషం. ఈ నేపథ్యంలో ‘సూర్య’లో వెలువడుతున్న వరస కథనాలు ప్రభుత్వాన్ని కదిలిస్తున్నాయి.
కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషగిరి బాబు మీడియా కథనాలతోపాటు, సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగడంతో.. కార్మిక శాఖలోని పెద్ద చేపలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయన ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్లో జరుగుతున్న అవినీతిపై అంతర్గతంగా విచారణ జరిపించి.. దానిపై చర్యలు తీసుకోవాలని డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉషశ్రీని ఆదేశించారు. దానితో కృష్ణమూర్తిపై సస్పెన్షన్ వేటు పడేందుకు కారణమయింది. ఇదిలా ఉండగా.. తాజాగా కార్మికశాఖ ప్రముఖుడే స్వయంగా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.