-
లిక్కర్ కిక్కు దిగుతోందా?
-
ధనంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని విచారిస్తారా?
-
వాళ్లను విచారిస్తేనే కథ కంచికి
( మార్తి సుబ్రహ్మణ్యం)
గత ఐదేళ్లు.. అంతకుముందు రెండేళ్లు.. ఢిల్లీ పెద్దల ‘దత్తప్రేమ’తో తిరుగులేని స్థావరంగా మార్చుకున్న తాడేపల్లి, ఇప్పుడు కేసులపై కేసులు.. అరెస్టులపై అరెస్టులతో తల్లడిల్లుతోంది. నిలువునా వణికిపోతోంది. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియక పిచ్చెక్కిపోతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్లూ సుశిక్షుతులైన సైనికుల్లా, చెప్పింది చేసిన అధికారులంతా.. ఇప్పుడు సీఐడీ ముందు ఒక్కో గుట్టు విప్పుతుంటే, ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఆందోళన. సీఐడీ అధికారుల విచారణలో నిందితుల వేళ్లన్నీ తాడేపల్లినే చూపిస్తున్నాయి. ఆ కథ నడిచింది తాడేపల్లి నుంచే అని, బండారం బట్టబయలు చేస్తున్న పరిస్థితి. ఒకరు కాదు. ఇద్దరు కాదు. దొరికిన ప్రతి నిందితుడూ, తాడేపల్లి ప్యాలెస్నే చూపుడువేళ్లతో చూపిస్తున్నాడు. నోట్ల ‘కట్టల’పాములన్నీని తాడేపల్లి పుట్టలోకే చేరాయంటున్నాయి. మాకేమీ తెలియదు. మేం నిమిత్తమాత్రులమేనంటున్నారు. అందుకే తాడేపల్లి తలపట్టుకుంటోంది. వేరే దారి లేక ఎదురుదాడి చేస్తోంది.
జగన్ జమానాలో జరిగిన లిక్కర్, శాండ్, మైనింగ్ కుంభకోణంతోపాటు.. జెత్వానీ కేసులో అరెస్టయిన నిందితులు పెదవి విప్పుతున్న ఒక్కో మాట తాడేపల్లి పెద్దలను ప్రమాదం వైపు తీసుకువెళుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, సజ్జల శ్రీధర్రెడ్డి, రాజ్ కసిరెడ్డి విజయవాడ జైల్లో ఉన్నారు. వీరిలో వంశీ, పీఎస్సార్ మినహాయిస్తే, మిగిలిన వారంతా లిక్కర్ కేసుతో నేరుగా సంబంధం ఉన్నవారే. మొద్దు శీను మాదిరిగా జగనన్న కళ్లలో మెరుపులు చూసేందుకు శ్రమదానం చేసిన నాటి సీఐడీ చీఫ్ సునీల్, ఆ తర్వాత వచ్చిన సంజయ్తో పాటు.. విశాల్ గున్ని, కాంతిరాణా తాతా వంటి జగన్ భక్తులంతా శంకరిగిరి మాన్యాలు పట్టడంతో తాడేపల్లి బేలగా మారిన విషాదం.
ఇక వేలకోట్ల లిక్కర్ కేసు కథ ఎక్కడ మొదలయి.. ఎక్కడ ముగిసిందన్న గుట్టును మాజీ ఎంపి విజయసాయిరెడ్డి కొద్దిగా విప్పగా, మిగిలిన గుట్టును అప్పట్లో ఆ కుంభకోణంలో భాగస్వాములయిన వారు, గుట్టలు గుట్టలుగా విప్పుతున్న పరిస్థితి.
లిక్కర్ కేసులో బిగ్బాస్ పాత్రతో పాటు, ఏం జరిగిందనేది చెప్పిన వాసుదేవరెడ్డి తన మాతృశాఖకు వెళ్లిపోయారు. ఆయన ఇచ్చిన సమాచారంతో, డొంక కదిలించిన సీఐడీ వలకు తాజాగా సజ్జల శ్రీధర్రెడ్డి అనే పెద్ద చేపనే చిక్కింది. ఇక ఈ కేసులో నాటి సీఎం కార్యదర్శి ధనంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వైఎస్ అనిల్రెడ్డి, అప్పులిచ్చిన అరబిందో పాత్ర కూడా స్పష్టం కావడంతో, వారిని కూడా సీఐడీ విచారించడమే మిగిలింది.
లిక్కర్ అమ్మకాలకు సంబంధించిన లెక్కలన్నీ నాటి సీఎం కార్యదర్శి ధనంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వైఎస్ అనిల్రెడ్డి పర్యవేక్షించారన్నది ప్రధాన ఆరోపణ. అసలు జగన్ జమానాలో అంతులేని సంపద పోగేసిన వారిలో, వారే మొదటివరసలో ఉన్నారన్నది మరో ఆరోపణ. జగ న్ సోదరుడు అనిల్, ధనంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిని విచారిస్తే, మరిన్ని విభ్రాంతికర వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు.
ఆంజనేయులు సరే… రాజేంద్రుడి సంగతేమిటి?
కాగా ముంబయి నటి జత్వాని కేసులో అరెస్టు చేసిన ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును విచారిస్తున్న సీఐడీ.. ఆ సమయంలో డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డిని ఎందుకు విచారిండం లేదన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నారు. నాటి డీజీపీ రాజేంద్రనాధ్కు జత్వానీ కేసు వివరించి, ముంబయి వెళుతున్నానని విశాల్ గున్ని చెప్పినప్పుడు, గో ఎహెడ్ అని రాజేంద్రనాధ్రెడ్డి చె ప్పారన్న స్టేట్మెంట్ ఆధారంగా రాజేంద్రనాధ్రెడ్డిని విచారించకపోవడమే ఆశ్చర్యం. ఈ కేసులో రాజేంద్రనాధ్రెడ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆయనను విచారించకపోవడమే విడ్డూరం.
నిజానికి టీడీపీ ఆఫీసుపై దాడి నుంచి.. చంద్రబాబు అరెస్టు వరకూ పదవిలో ఉన్న డీజీపీ రాజేంద్రనాధ్రెడ్డిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం ఆయనను వీఆర్కూ పంపించకపోవడంపై పోలీసు వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాజేంద్రనాధ్రెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో విపక్షంలో ఉన్న టీడీపీ.. ఆయనపై అనేక ఆరోపణలు చేసింది. ఖాకీ డ్రస్ తీసేసి వైసీపీ డ్రెస్ వేసుకోమని విమర్శించింది. వైసీపీ కార్యకర్తలు కూడా ఈర్య్యపడేలా ఆ పార్టీకోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టింది. టీడీపీ నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లినా ఆయన ఉండేవారు కాదు. చివరకు తన ఆఫీసుకు కూత వేటు దూరంలోనే ఉన్న టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సందర్భంలో, ఫోన్ చేసినా రాజేంద్రనాధ్రెడ్డి స్పందించలేదు.
చివరకు చంద్రబాబు అనేకసార్లు ఫోన్ చేసినా ఆయన తీసిన దాఖలాలు లేవు. జగన్ తన కుల-ప్రాంతాభిమానంతో రాజేంద్రనాధ్రెడ్డిని ఏరికోరి, దాదాపు 12 మంది సీనియర్లను దాటించి డీజీపీని చేసినా, అధికారంలోకి వచ్చిన కూటమి.. ఆయనను వీఆర్కు పంపించకుండా, పోస్టింగ్ ఇవ్వడంపై అటు పోలీసు శాఖలోనే కాదు. ఇటు పార్టీ వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ ఉన్న వెంకటరెడ్డిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులున్న విషయం తెలిసిందే. వీరంతా కలసి హైదరాబాద్లో, ఒక ఐటి కంపెనీ ప్రారంభించారన్న ఆరోపణలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
నిజానికి రాజేంద్రనాధ్రెడ్డి డీజీపీగా, పీఎస్సార్ ఇంటలిజన్స్ చీఫ్గా ఉన్న సమయంలో ఇద్దరికీ పడేది కాదన్నది బహిరంగ రహస్యమే. ఎవరి గ్రూపులు వారివే. అయితే.. జగన్ ఆదేశాలను పాటించకుండా రాజేంద్రనాధ్ నేర్పుగా తప్పించుకుని, వాటిని జగన్ ద్వారా పీఎస్సార్తో చేయించి.. తాను తప్పుకునేవారన్న ప్రచారం, అప్పట్లో నడిచిన విషయం తెలిసిందే.
అయితే ఎన్నికల సమయంలో మాత్రం రాజేంద్రనాధ్రెడ్డి-పీఎస్సార్.. నాటి సీఎం జగన్ కోసం తమ విబేధాలు పక్కనపెట్టి.. డీఎస్సీ స్థాయి నుంచి ఎస్పీ, ఐజీ స్థాయి అధికారి వరకూ ఫోన్లు చేసి, ‘మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది. మీరు అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందిలో పడవద్దు. అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటాం’’ అని బెదిరించారన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఆ విధంగా ఎన్నికల ముందు శ్రమదానం చేసిన ఆ ఇద్దరిలో ఒకరైన పీఎస్సార్ జైలులో.. రాజేంద్రనాధ్రెడ్డి ఎలాంటి చీకూ చింతా లేకుండా ఉద్యోగం చేసుకోవడమే వింత.