Suryaa.co.in

Telangana

ఖమ్మం వేదిక నుంచి కంటి వెలుగు ప్రారంభం

-ఈనెల 18న ఒంటి గంటకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
-ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
-శుక్రవారం సాయంత్రానికి కంటి పరీక్ష పరికరాలు, కళ్లద్దాలు పీహెచ్సీలకు చేరాలి
-జిల్లా స్థాయిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలి
-స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలి
-పరీక్ష బృందాలకు అవసరమైన సౌకర్యాలు స్థానికంగా కల్పించాలి
-అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో ఖమ్మం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్

ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈనెల 18న ఒంటి గంటకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు వివిధ ప్రాంతాల్లో ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమాల్లో పాల్గొనేలా ముందస్తు కార్యచరణ రూపొందించుకోవాలన్నారు.

శుక్రవారం సాయంత్రానికి అన్ని ప్రాథమిక రోగ్య కేంద్రాల వద్దకు కంటి పరీక్షలు నిర్వహించే మిషన్లు, కళ్లద్దాలు, మందుల పంపిణీ జరగాలన్నారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతికి రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారులతో కూడిన వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలన్నారు. బృందాలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఒకసారి వాట్సప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా వివరాలతో కూడిన ఫ్లెక్సీలు, బోర్డులు ఎక్కడిక్కడ ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా స్క్రీనింగ్ నిర్వహణ ఉంటుంది కాబట్టి సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. ఆధార్ తప్పనిసరి అని ముందస్తుగా ప్రచారం చేయాలని, లేదంటే పరీక్ష కేంద్రానికి వచ్చి ఆధార్ కోసం మళ్లీ వెళ్లాల్సి వస్తుందన్నారు. మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలల పాటు జరిగితే, ఈ సారి వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు గాను, గతంలో 827 బృందాలు పని చేస్తే, ఈసారి 1500 లకు పెంచుకున్నట్లు చెప్పారు.

ఈ బృందాలకు వసతి, ఇతర సౌకర్యాలు స్థానికంగా సమకూర్చాలన్నారు. బృంద సభ్యుల వసతి క్యాంపుకు సమీపంలోనే ఉండేలా చూడాలన్నారు. విడతల వారీగా, 16,533 లొకేషన్స్ (రూరల్ -12,763, అర్బన్ -3,788)లో క్యాంపులు నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా 30లక్షల రీడింగ్ గ్లాస్, 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎమ్మార్వో, మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీవో పర్యవేక్షించాల్సి ఉంటుందని, జిల్లా స్థాయిలో డీఎంహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వో, ప్రోగ్రాం ఆఫీసర్స్ క్యాంపులను మానిటరింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.

క్యాంపుల సందర్శన చేసేలా వీరికి టూర్ షెడ్యూల్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజు క్యాంపుల సందర్శన ఉండేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో అడిషన్ కలెక్టర్ (లోకల్ బాడీస్) పూర్తి పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలకు చేరే కంటి శిభిర బృందాలతో కలెక్టర్లు ఇంటరాక్ట్ కావాలని, వారికి మార్గనిర్దేశనం చేయాలని మంత్రి సూచించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు ప్రజాప్రతినిధుల ఇందులో భాగస్వామ్యం కావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేసి సీఎం కేసీఆర్ గారి, నివారింప దగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్ఎంఎంస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE