కవితమ్మా…. ముందు మీ అయ్యను నిలదీయ్

-మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగు
-తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమను
-మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదో ప్రశ్నించు
-మహిళా బిల్లు కాపీలను చించేసిన పార్టీలతో ఎందుకు దోస్తీ చేస్తున్నాడో నిలదీయ్
-మహిళా గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నాడో సమాధానం చెప్పమను
-మహిళా బిల్లుపై జంతర్ మంతర్ దగ్గర ధర్నా వార్త చూసి జనం నవ్వుకుంటున్నరు
-కరెంట్, ఆర్టీసీ, నల్లా, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి ప్రజలను చావబాదుతున్నోళ్లు ధర్నాలు చేయడం సిగ్గు చేటు
– ఎంఐఎం పరాన్న జీవుల పార్టీ… కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశపడే పార్టీ
-ఓవైసీకి దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలి
-డిపాజిట్లు రాకుండా చేసి తీరుతాం
-ముస్లిం మహిళలంతా బీజేపీవైపే…
-వాళ్లు ఓటేయడంవల్లే ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచాం… 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం
-సాత్విక్ దోస్తులను బెదిరిస్తే చైతన్య కాలేజీ నిర్వాహకులను గల్లాపట్టి బయటకు గుంజుకొచ్చి తంతం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్

మహిళా బిల్లు విషయంలో కేసీఆర్ బిడ్డ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పడం చూస్తే నవ్వొస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ‘‘జంతర్ మంతర్ దగ్గర తరువాత ధర్నా చేయ్… ముందు మీ అయ్యను నిలదీయ్. మీ పార్టీలో ఎంత మంది మహిళలకు చోటు ఇచ్చారో చెప్పమను. మీ ప్రభుత్వంలో మహిళలెంత మంది ఉన్నరు? మహిళలంటే ఎందుకంత కక్ష? పోయిన కేబినెట్ లో మహిళలకు ఎందుకు చోటివ్వలేదు. మహిళా గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నవ్? మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తే ఎందుకు స్పందించవ్? పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆ కాపీలను చించిపారేసిన పార్టీలతో ఎందుకు దోస్తానా చేస్తున్నవో నిలదీయ్…’’అంటూ సవాల్ విసిరారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు హాజరైన బండి సంజయ్ మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్, బీజేపీ నేత బోగ శ్రావణి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, శ్రావణిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు..

బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.400 కోట్లను కేటాయించడం సంతోషం. ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇయాళ జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ బిడ్డ ధర్నా చేస్తానంటే మహిళలు నవ్వుకుంటున్నరు. ముందు మీ అయ్య దగ్గరకు వెళ్లి నిలదీయ్… మీ పార్టీలో ఎంత మంది మహిళలకు చోటు ఇచ్చారు? మీ ప్రభుత్వంలో మహిళలెంత మంది ఉన్నరు? నీకెందుకు మహిళలంటే అంత కక్ష? తొలి కేబినెట్ లో మహిళలకు ఎందుకు చోటివ్వలేదు? మహిళా గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నవ్? మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తే ఎందుకు స్పందించవు? పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆ కాపీలను చించిన పార్టీలతో ఎందుకు దోస్తానా చేస్తున్నవని నిలదీయ్… ఆ తరువాత మహిళా బిల్లు గురించి మాట్లాడు.

మెడికో ప్రీతినాయక్ చనిపోతే, నిర్మల్ లో బాలికపై మీ పార్టీ నేతే అత్యాచారం చేస్తే కనీసం మీ అయ్య స్పందించరు. గంటకో లైంగిక వేధింపు, పూటకో అత్యాచారం, రోజుకో హత్య జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడనం లేదని మీ అయ్యను నిలదీసే ధైర్యముందా? నేషనల్ క్రైమ్ బ్యూర్ రికార్డ్స్ ప్రకారం తెలంగాణలో నేరాల సంఖ్య 17 శాతం పెరిగింది. హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణగా మారింది. హత్యలు, అత్యాచారాలు చేసేటోళ్లలో ఎక్కువ మంది బీఆర్ఎసోళ్లే. ఎవరైనా ఇతరులు అత్యాచారాలు చేసి బీఆర్ఎస్ లో చేరితే వాళ్ల కేసులు మాఫీ చేస్తున్నరు. పైగా అత్యాచారాలు, హత్యలు చేసేటోళ్లను హీరోలుగా చిత్రీకరిస్తున్నరు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసే వాళ్లకు చుక్కలు చూపిస్తాం… వాళ్ల అంతు చూస్తాం. యూపీ తరహాలో వాళ్ల ఇళ్లు కూల్చేస్తాం. యూపీలో అట్లాంటోళ్లు బెయిల్ వచ్చినా బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నరు. మరి తెలంగాణలో అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే కేసులెందుకు నీరుగారుస్తున్నరు? శిక్షలు ఎందుకు పడటం లేదో ప్రజలు ఆలోచించాలి.

గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం సిగ్గు చేటు. టీఆర్ఎస్ కు సిగ్గుండాలి. పెట్రోలు, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎట్లున్నయ్.. తెలంగాణ కంటే 15 రూపాయలు తక్కువ ఎందుకున్నయ్? కరెంట్ ఛార్జీలు 10 సార్లు పెంచారు. 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిండ్రు. నల్లా ఛార్జీలు, రిజిస్ట్రేషన్లు పెంచి జనాన్ని బాదుతున్నరు. వీటిపై మీరెందుకు ధర్నా చేయలేదు? బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ మేరకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తం.. గ్యాస్ ధరలు పెరిగినందుకు మేం కూడా బాధపడుతున్నాం. కానీ రష్యా – ఉక్రెయిన్ యుద్దం వల్ల చమురు కొరత ఏర్పడటంతో ధరలు పెరిగాయనే విషయం ప్రజలకు తెలుసు. నిన్న నార్సింగిలో చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ను చిత్రహింసలు పెట్టి చంపితే బయటకు చెప్పొద్దని సాత్విక్ దోస్తులను భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నరని నాకు తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే ఆ కాలేజీకి వచ్చి ఆ నిర్వాహకులను గుంజకొచ్చి మావాళ్లు తంతరు. మా యువ మోర్చా నేతలు రడీగా ఉన్నరు..సాత్విక్ దోస్తులెవరూ భయపడకండి. మేం మీకు అండగా ఉంటాం.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు నిరసనగా ఈరోజు సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ లో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. 6వ తేదీన కూడా కార్యక్రమం తీసుకుంటున్నం. బీజేపీ-బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చెప్పడం పెద్ద జోక్. బీఆర్ఎస్ -కాంగ్రెస్ ఒక్కటేనని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే ఢిల్లీ వేదికగా స్వయంగా చెప్పిండు కదా. ఎన్నికల తరువాత అధికారం పంచుకుందామని ఆ రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ కుదిరిందని కూడా చెప్పిండు. టీఆర్ఎస్- కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజిస్టు కూడా ఒక్కరే కదా. అయినా ప్రజలను దారి మళ్లించేందుకు బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని ప్రజలు కూడా భావిస్తున్నరు.

బీజేపీ అంతు చూస్తామని ఒవైసీ చెప్పడం హాస్యాస్పదం. ఎంఐఎం పరాన్నజీవుల పార్టీ. సీఎం విసిరే ఎంగిలి బతుకులకు ఆశపడే పార్టీ. ఒవైసీ బ్రదర్స్ నిజంగా మనుషులైతే.. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగడం లేదని అనుకుంటే… దమ్ముంటే తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేయాలి. డిపాజిట్లు రాకుండా చేసి చూపిస్తాం.. ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ వస్తే… పాకిస్తాన్ జిందాబాద్ అని పొగిడేటోళ్లు. ఇక్కడి తిండితిని పరాయి పార్టీ మీది. 15 నిమిషాలు టైమిస్తే నరికి చంపుతానన్న పార్టీ. అధికారంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు కొమ్ముకాసే పార్టీ. వాళ్లా మాకు సవాల్ విసిరేది?పాతబస్తీ ఇప్పటికీ ఎందుకు అభివ్రుద్ధి కావడం లేదు? పాతబస్తీలో తీవ్రవాదులకు షెల్టర్ ఎందుకు ఇస్తున్నరు? ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నరు. ముస్లిం మహిళలకు స్వేచ్ఛ ఉండొద్దా? ఎక్కడో విదేశాల్లో ఉంటూ తలాఖ్ తలాఖ్ లని మూడుసార్లు అంటే విడాకులిస్తే ఆ మహిళల బతుకేం కావాలి? ఇవన్నీ సర్వే చేసిన తరువాతే ట్రిపుల్ తలాఖ్ విధానాన్ని రద్దు చేసినం.

మాకోసం మోదీ ఆలోచిస్తున్నారని ముస్లిం మహిళలంతా భావిస్తున్నారు కాబట్టే నిన్న మూడు రాష్ట్రాల్లో గెలిచాం. ఇయాళ దేశంలోని 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. జిల్లాలో నేతల మధ్య సమన్వయ లోపం ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ…‘‘పార్టీలో నేత పార్టీ పెరుగుతున్నప్పుడు… అక్కడక్కడా చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. దీనిపై పెద్దగా మాట్లాడాల్సిందేమీ లేదు. గెలిచే అభ్యర్ధి ఎవరు? కష్టపడి పనిచేస్తున్నదెవరనే అంశంపై జాతీయ నాయకత్వం సర్వేలు చేయిస్తుంది. గెలిచే వాళ్లకు టిక్కెట్లిస్తారు? అందరూ శిరసావహించాల్సిందే. దీనిగురించి బాధపడాల్సిన అవసరం లేదు.’’అని సంజయ్ బదులిచ్చారు.

Leave a Reply