ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్లకు ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల వయస్సును నిర్దేశించడం జరిగింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్వాడీ టీచర్లకు రూ.1,00,000/- రూపాయ లు, మినీ అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్లకు రూ.50,000/- అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు. దేశంలోనే అంగన్వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. అంగన్వాడీలకు తెలంగాణలోనే అత్యధిక వేతనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడు సార్లు అంగన్వాడీల వేతనాల పెంపు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంగన్వాడీలకు అరకొరగా జీతాలు.
సుదీర్ఘ కాలం నుంచి సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్పై ప్రత్యేక నిబంధనలేమీ లేవు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విశాల దృక్పథంతో వారికి 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ, లక్ష రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కల్పిచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు అంగన్వాడీ టీచర్, హెల్పర్ల రిటైర్మెంటు తీసుకున్న తరువాత వారికి ఆసరా పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరమని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీ టీచర్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ …దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు. ఇటీవలే మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కి దృష్టికి తీసుకెళ్లారు. అంగన్వాడీల సమస్యల పట్ల తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్ వారి సమస్యలను పరిష్కరిస్తూ జీవో విడుదల చేసారని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో మరుగునపడిన అంగన్వాడీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనని మంత్రి అన్నారు. వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పీఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు. మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్వాడీలను అంతే గౌరవంగా చూస్తూ మనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల , రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్మీ పథకం అమలు చేస్తూ.. మహిళ గర్భం దాల్చినప్పట నుంచి ప్రసవించిన తర్వాత కూడా వారి సంక్షేమం కోసం తల్లితండ్రి వలె ఈ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేదని గుర్తు చేశారు.
మోదీ సర్కారు వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నదని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా.. అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ వేతనాలకు తన వాటా కింద 40 శాతం ఇవ్వాల్సి ఉండగా.. 80 శాతం, హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండటం సీఎం కేసీఆర్ ఔదార్యానికి, అంగన్వాడీలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అంగన్వాడీల టీచర్లు హెల్పర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.