– మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బూరడి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి
-బీసీ సమాజమంతా అట్టుడుకుతోంది
-బీసీలంతా తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమానికి సిద్ధం కావాలి
– కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ 3.O వస్తది… కెసిఆర్ 3.0 వస్తారు
– ఎవ్వరూ దిక్కు లేనప్పుడు గులాబీ జెండా మోసిన ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే..
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
జగిత్యాల : కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో… కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదని చెప్పారు.
సోమవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బూరడి కొట్టించారని ధ్వజమెత్తారు. తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52 శాతం ఉందని 2014లోనే కేసీఆర్ చేపట్టిన సర్వేలో తేలిందని, కానీ లెక్కపెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని అన్నారు.
బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమని స్పష్టం చేశారు. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పదోవపట్టించారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు ? అని ప్రశ్నించారు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు ? అని నిలదీశారు. తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని, స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశమవ్వడం లేదు ? అని అడిగారు.
బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని మండిపడ్డారు. ఎండిపోయిన పోలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారని, ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని, రైతులను నీళ్లించే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలు స్కూటీలు, మహిళలకు 2500 ఏమయ్యాయని నిలదీశారు. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుందని, రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారని తెలిపారు. రేషన్ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నించారు. రుణ మాఫీ ఎక్కడా కూడా సంపూర్ణంగా కాలేదని, రైతులంతా సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని విమర్శిచారు. అయినా కూడా మనోధైర్యంతో కార్యకర్తలు చెక్కుచెదరలేదని, ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని తెలిపారు.
అనంతరం జగిత్యాల బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ 3.O వస్తది… కెసిఆర్ 3.0 వస్తారని తేల్చిచెప్పారు. “మీ చెల్లెగా అక్కగా చెప్తున్న ఉద్యమకారులందరికీ న్యాయం చేసే బాధ్యత నాది.. నా చేతిలో ఎక్కడ ఎలాంటి అవకాశమున్నా ఉద్యమకారులకే మొదటి నుండి ప్రాధాన్యత ఇచ్చిన అని అన్నారు. ఎవ్వరూ దిక్కు లేనప్పుడు గులాబీ జెండా మోసిన ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే” అని భరోసా ఇచ్చారు.
విలేకరుల సమావేశంలో మరియు కార్యకర్తల సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంతా సురేశ్ , మాజీ మార్క్ఫెడ్ చైర్మెన్ బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.