మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

అధికారికంగా ప్రకటించిన బీజేపీ

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక సమరానికి రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ప్రకటించగా తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు బీజేపీ అధిష్ఠానం అధికారింగా వెల్లడించింది. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. రాజగోపాల్‌ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు.

నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఉపఎన్నికలో వేయాల్సిన ఎత్తులు, ప్రచార ప్రణాళికలు రచిస్తున్న ఆ పార్టీ నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న 3 ఉపఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటనలో భాగంగానే రాజగోపాల్‌రెడ్డిని తమ అభ్యర్థిగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అప్పటి నుంచి బీజేపీ పట్ల సానుకూల ధోరణితో ప్రకటనలు చేస్తూ వచ్చారు.

Leave a Reply