ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమైంది. బీజేపీ నేతలతో సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ప్రకటించారు. టీఆర్ ఎస్ లో ఉద్యమ కారులకు ఏ మాత్రం విలువ లేదని.. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని.. అందువల్ల బీజేపీలో చేరుతున్నానని ఆయన వెల్లడించారు. బీజేపీలో తాను ఎప్పుడు, ఎక్కడ చేరాలన్న విషయాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు వదిలేస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు గురించి కీలక ప్రకటన చేశారు.
టీఆర్ ఎస్ పాలన దారుణం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ధనిక రాష్ట్రంగా ఎదుగుతుందని భావించామని.. కానీ టీఆర్ ఎస్ పాలనలో పరిస్థితి దారుణంగా తయారైందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ ఎస్ లో ఉద్యమ కారులకు విలువ లేదని.. వారిని పక్కన పెట్టి, తెలంగాణను వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ వంటి వారిని మంత్రులుగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీఆర్ ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. ప్రస్తుతం టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేశారు.
అలాగైతే కాంగ్రెస్ లో ఉండేవాడిని..
తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని.. కానీ కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్కు సకాలంలో పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చి ఉంటే తాను కాంగ్రెస్ లోనే ఉండేవాడినని తెలిపారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తాను సాధారణ కార్యకర్తగానే ఆ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.