-ఎమ్మెల్యే యెన్నంతో పాటు మహేందర్రెడ్డి,
-పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ చానళ్లకూ అందజేత
-తప్పుడు ప్రచారం చేస్తే ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టేది లేదు
-వారం రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా
-న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడి
తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీసులు పంపించా రు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏ మాత్రం సంబంధం లేకపోయినా పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించారు. వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన మరికొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ చానళ్లకు మరోసారి నోటీసులు పంపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేదే లేదని తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తమకు ఉన్న రక్షణలను ఉపయోగించుకుని చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల్లోగా మంత్రులు కొండా సురేఖ, యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.