Suryaa.co.in

Andhra Pradesh

చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న లోకేష్ పాదయాత్ర!

*2000 కి.మీ.లకు చేరుకున్న సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ
*యువగళం పాదయాత్రలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు
*కావలిలో విజయవంతంగా పూర్తయి, ఉదయగిరిలోకి ప్రవేశం

కావలి: రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గం కొత్తపల్లిలో 2వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. కొత్తపల్లిలో అభిమానులు ఏర్పాటుచేసిన ఏర్పాటుచేసిన పైలాన్ ను యువగళం రథసారధి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు యువనేత లోకేష్ వీల్ చైర్లను అందజేశారు. చారిత్రాత్మక 2వేల కి.మీ.ల మజిలీకి చేరుకున్న సందర్భంగా మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, యువనేత లోకేష్ ను అభినందనలతో ముంచెత్తారు. యువగళం పాదయాత్ర 2వేల కి.మీ.ల మజిలీని చేరకోవడంతో యువగళంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రెట్టించిన ఉత్సాహంతో యాత్ర పూర్తయ్యేవరకు మీ వెంట నిలుస్తామని యువగళం బృందాలు ప్రతినబూనాయి.

యువగళం 2వేల కి.మీ. చేరుకున్న సందర్భంగా పెద్దఎత్తున కొత్తపల్లికి చేరుకున్న కార్యకర్తలు బెల్లూన్లను ఎగురవేసి, భారీగా బాణసంచా కాల్చుతూ కేరింతలు కొట్టారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తన వెంట నడుస్తున్న యువగళం బృందాలకు యువనేత లోకేష్ అభినందనలు చెబుతూ… లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇదే దూకుడు కొనసాగించాలని కోరారు. మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎన్.అమర్ నాథ్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీతల సుజాత, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, భూమిరడ్డ్డి, రాంభూపాల్ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి ఇన్ ఛార్జి సుబ్బానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బిసి జనార్దన్ రెడ్డి, మీనాక్షినాయుడు తదితరులు యువనేతను కలిసి అభినందనలు తెలిపారు. మంగళవారం సాయంత్రం యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గంలో పూర్తయి ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, టిడిపి ఇంఛార్జ్ బొల్లినేని రామారావు, టిడిపి ముఖ్య నేతలు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు.

153వరోజు యువనేత లోకేష్ 20.4 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2019.9 కి.మీ. మేర పూర్తయింది. బుధవారం సాయంత్రం కొండాపురంలో జరిగే బహిరంగసభలోయువనేత లోకేష్ ప్రసంగించనున్నారు.

*కొత్తపల్లిలో ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డుకు శిలాఫలకం
కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న నా పాదయాత్ర ఈరోజు కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక 2వేల కి.మీ. మజిలీకి చేరుకోవడం జీవితంలో మరపురాని ఘట్టం. ఇందుకు గుర్తుగా కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్ మెంట్
బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తునట్లు యువనేత లోకేష్ పేర్కొన్నారు.

*దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేసిన యువనేత లోకేష్
యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 2వేల కి.మీ. మైలురాయి చేరుకున్న సందర్భంగా టిడిపి విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకుడు గోనుగోంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యాన యువనేత లోకేష్ దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. దివ్యాంగులకు ఉపయోగపడే ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, హియరింగ్ మిషన్లు అందజేశారు. పులివెందులకు చెందిన వీరారెడ్డికి ఈ సందర్భంగా లక్షరూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి ఇన్ ఛార్జి సుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు.

*రూ.5వేల విరాళమిచ్చిన దివ్యాంగుడు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లికి చెందిన దివ్యాంగుడు జీవన్ కుమార్ రెడ్డి తమకు వచ్చే పెన్షన్ తోపాటు కొంత సొంత డబ్బు కలిపి రూ.5వేల విరాళాన్ని యువనేతకు లోకేష్ అందజేశారు. గతంలో కూడా జీవన్ పార్టీకి విరాళమిచ్చారు. 1998లో తనకు చంద్రబాబునాయుడు కాలిశస్త్రచికిత్స చేయించారని, బాబును సిఎంగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపాడు. ఈ సందర్భంగా జీవన్ ను లోకేష్ అభినందించారు.

*యువనేతను కలిసిన కొత్తపల్లి గ్రామస్తులు
కావలి నియోజకవర్గం కొత్తపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కల్లాలను ఏర్పాటుచేయాలి. ఎస్సీ కాలనీలో మురుగునీరు వెళ్లేవిధంగా డ్రైనేజీలను నిర్మించాలి. గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలను నివారించాలి. మా గ్రామంలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టి కాలనీలు ఏర్పాటుచేయాలి. కొత్తపల్లిలో శ్మశాన వాటిక ఏర్పాటుచేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…
జగన్మోహన్ రెడ్డి దొంగలముఠాకు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై లేదు. అరాచక పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కల్లాలు ఏర్పాటుచేస్తాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజి, శ్మశానం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.

నారా లోకేష్‌ను కలిసిన రాజువారిచింతలపాలెం ప్రజలు
కావలి అసెంబ్లీ నియోజకవర్గం రాజువారిచింతలపాలెం ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామానికి గతంలో మద్దూరుపాడు సబ్‌ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అయ్యేది. విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో బోర్ల ద్వారా పంటలు పండించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా చోడవరం సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ ఇస్తున్నారు. అయినప్పటికీ పంటలు పండించడానికి సరిపడా విద్యుత్ అందడంలేదు. మిర్చి, అరటి, మునగ, వేరుశెనగ, పంటలకు సకాలంలో నీరు అందక నష్టపోతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మాగ్రామానికి అందుబాటులో సబ్ స్టేషన్ నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల పాలిట శాపంగా మారింది. గత నాలుగేళ్లుగా రైతులు నష్టాలపాలై అప్పుల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిపాడు. రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3 వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2 స్థానంలో నిలిచింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ విఎస్ పాలంలో సబ్ స్టేషన్ నిర్మించి, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తాం. సాగునీరు అందేలా చేసి పంటలను కాపాడతాం.

నారా లోకేష్‌ను కలిసిన రామవరపుపాడు గ్రామస్తులు
ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం రామవరపుపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సచివాలయం నిర్మించాలి. ఆసుపత్రి లేక వైద్యం కోసం కావలి వరకు వెళ్లాల్సి వస్తుంది. మా గ్రామంలో వైద్యశాల, సి.సి రోడ్లు, నిర్మించాలి. విద్యుత్ స్తంభాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి వాటిని పునరుద్ధరించాలి. గ్రామంలో తాగు, సాగు నీటి సమస్యలు అధికంగా ఉన్నాయి. పొలాలకు వెళ్లే దారి, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలన్నిటినీ పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పంచాయితీలకు చెందిన 9వేల కోట్ల నిధులను వైసిపి ప్రభుత్వం దారిమళ్లించింది. పంచాయితీల్లో కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా లేకుండా పంచాయితీలను నిర్వీర్యం చేశాడు. పంచాయితీలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది. టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామంలో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్‌ను కలిసిన చోడవరం గ్రామ రైతులు
ఉదయగిరి నియోజకవర్గం చోడవరం రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సోమశిల ఉత్తర కాలువ కలిగిరి నుండి క్రాకుటూరు మీదుగా తిమ్మ సముద్రం వద్ద ఆగిపోయింది. ఈ ప్రాంతంలో గిరిజనుల పొలాలు అధికంగా ఉన్నాయి. గిరిజనుల సమస్యను 2018-19లో అప్పటి ఎమ్మెల్యే పరిష్కరించారు. కానీ, అక్కడ కాలువ పనులు ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పనులను పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక తిమ్మ సముద్రం, కేశవరం, చోడవరం (ఎర్రచెరువు) చోడవరం(ఊరచెరువు) రామవరప్పాడులలోని చెరువులకు నీరు అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. టీడీపీ హయాంలోడ సాగు నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు 68,294 కోట్లు ఖర్చు చేశాం. టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక సోమశిల ఉత్తర కాల్వ పనులు పూర్తిచేస్తాం. ఉదయగిరి నియోజకవర్గంలో గొలుసుకట్టు చెరువులకు నీరందించి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తాం.

LEAVE A RESPONSE