– అసెంబ్లీలో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఎందరో పుడతారు మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో దివంగత నేత మన్మోహన్ సింగ్ ఒకరు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా, ప్రతిపక్షాలను ఒప్పించి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింప చేశారు.
దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని, నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్. హైదరాబాదులో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నాను. మన్మోహన్ సింగ్ ప్రతి పదవికి వన్నె తెచ్చారు. ప్రతి బాధ్యతలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
దేశ ఆర్థిక పరిస్థితులే కాదు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ దే. సామాన్యుడు సమాచారాన్ని తెలుసుకునే సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చారు. దేశగతినే మార్చిన ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఆయన తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఏర్పడగా, ఈ చట్టం ద్వారా దేశ ప్రజలు ఆర్థిక మాధ్యం బారిన పడకుండా కాపాడగలిగారు.
ఆత్మగౌరవం లేకుండా అడవుల్లో పలికే వారి కోసం అటవీ హక్కు చట్టాన్ని తీసుకువచ్చారు. భూసేకరణ చట్టం తీసుకువచ్చి దేశంలో ప్రగతిశీల వాదుల మన్ననలు పొందారు. అమానవీయమైన స్కావెంజర్స్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, వారికి భద్రత కల్పిస్తూ ప్రపంచంలో భారతదేశంపై గౌరవం పెంచారు.